AP News : లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ రమానందనకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తన యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ ద్వారా నందన తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం పేరాయపాలెంకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తన కోడలికి లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, నందన తమ నుంచి రూ.10.50 లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో చాలామందికి ఉద్యోగాలు ఇప్పించానని చెప్పడంతో విడతల వారీగా ఈ మొత్తాన్ని ఆమెకు బదిలీ చేసినట్లు తెలిపారు. అయితే ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో జూలై 4న పోలీసులు నందనపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
నందనపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు గతంలో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి జారీ అయిన లుక్అవుట్ నోటీసుల కారణంగా ఇటీవల హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మోసాలతో తనకు సంబంధం లేదని, తన భర్తే ఇలాంటి వ్యవహారాలు చూసుకుంటారని విచారణ సందర్భంగా ఆమె తెలిపారు.