ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ పడింది. జనవరి 2023లో నిలిచిపోయిన ఈ బదిలీల ప్రక్రియ హైకోర్టు ఉత్తర్వులతో మళ్లీ ప్రారంభం కానున్నది. ఈ నెల 3 నుంచి వచ్చే నెల 3 వరకు చేపట్టేలా విద్యా శాఖ కార్యాచరణ రూపొందించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,971 మంది ఉపాధ్యాయులు ఉండగా 8 ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారు 8వేల మందికిపైనే ఉన్నారు. 2015, 2018 తర్వాత పదోన్నతులు, బదిలీలు జరుగుతుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రామగిరి, సెప్టెంబర్ 1: తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులకు 2015 జూన్లో బదీలకు జీఓ విడుదల చేయడంతో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను సైతం నిర్వహిస్తూ పదోన్నతులు, బదీలీలు చేపట్టారు. తిరిగి జూన్ 2018లో వెబ్ కౌన్సెలింగ్తో అందరికీ అవకాశం కల్పిస్తూ బదీలీలు నిర్వహించగా 8 ఏండ్ల సర్వీసు ఒకేచోట పూర్తి చేసిన వారు తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీకాగా కొందరు అవకాశం వినియోగించుకున్నారు. అయితే 2020-21 విద్యా సంవత్సరంలో ఆగస్టు 2020లో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యాశాఖ పూర్తి చేసింది. జనవరి 2023లో సుదీర్ఘ కాలం తర్వాత పదోన్నతుల కోసం, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంతో ఫిబ్రవరి 1న దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే కొందరు స్పాజ్ పాయింట్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఇచ్చే పాయింట్స్ విషయంలో హైకోర్టు వెళ్లడంతో వీటిపై స్టే వచ్చింది. తాజాగా హైకోర్టులో బదిలీలపై స్టే ఎత్తివేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. కోర్టు నిర్ణయంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
8ఏండ్లు పూర్తయిన ఉపాధ్యాయులే అధికం
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,971 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగిరీలో పని చేస్తున్నారు. వీరిలో ఒకే చోట పనిచేస్తూ 8 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు దాదాపు 8 వేలకుపైగా ఉంటారని విద్యాశాఖ నివేదికలు. జనవరిలో వెల్లడించింది. వీరంతా కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. మిగిలిన ఉపాధ్యాయులు తమ ఇష్టంమేరకే బదిలీ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు ఇలా
విద్యాశాఖ లెక్కల ప్రకారం నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 299 (జీహెచ్ఎం -II)మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులున్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 136 మంది, సూర్యాపేట జిల్లాలో 84, యాదాద్రిలో 79 మంది ఉన్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ, ఎల్పీ, పీఈటీ, పీడీ ఇతర ఉపాధ్యాయులంతా కలిపి 11,971 మంది ఉమ్మడి జిల్లాలో 3,120 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే 317 జీఓతో కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు జరిగిన విషయం విధితమే. కాగా వీరి సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
గత షెడ్యూల్ ప్రకారం..
నల్లగొండలో ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో ఒకే చోట 8 ఏండ్లు పూర్తి చేసిన ఉపాధ్యాయులు (లాంగ్ స్టాండింగ్)లో ఉన్నవారి వివరాలు, ఎగ్జిస్టింగ్ క్లియర్ వెకెన్స్లను జనవరిలో విడుదల చేశారు. దాంతో ఉపాధ్యాయులుకు ఏ ప్రాం తంలో ఖాళీలు ఉన్నాయనే విషయం స్పష్టం కావడంతో ఆన్లైన్లో దరఖాస్తులు చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, లోకల్బాడీ విభాగంలో 2,774 ఖాళీలను చూపించారు. వీటిలో ప్రభుత్వంలో క్లియర్ వెకెన్స్లు 110, లాంగ్స్టాండింగ్లో 73 ఉన్నాయి. అలాగే లోకల్బాడీ విభాగంలో ఎగ్జిస్టింగ్ క్లియర్ వెకెన్స్లో 1,009, లాంగ్స్టాండింగ్లో 1,582మొత్తం 2,591 చూపించగా రెండు విభాగాల్లో కలిపి 2,774 ఖాళీలను ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వుల ప్రకారం వీటిలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి.
స్వాగతిస్తున్నాం
జనవరిలో ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై హైకోర్టులో కేసు వేయడంతో నిలిచిపోయాయి. తాజాగా కోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే మొదటి నుంచి ఉపాధ్యాయులకు అండగా ఉంచి ఎన్నో ఉద్యమాలు చేసి పలు జీఓలను సాధించిన ఘనత మా పీఆర్టీయూ టీఎస్కే ఉంది. మళ్లీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా అందరికీ న్యాయం చేసేలా పదోన్నతులు, బదీలీల ప్రక్రియ నిర్వహించాలి. దాంతోనే ప్రభుత్వంపై ఉపాధ్యాయులలో మరింత భరోసా పెరుగుతుంది.
– కాలం నారాయణరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి, పీఆర్టీయూటీఎస్,నల్లగొండ
ఉపాధ్యాయులకు భరోసా కల్పించాలి
బదిలీలు, పదోన్నతులపై తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎలాంటి సాకులు చూపకుండా నూతన షెడ్యూల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జాబితాలు సిద్ధం చేయాలి. సజావుగా పూర్తి చేసి ఉపాధ్యాయుల్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో అటు ప్రభుత్వానికి, ఇటు విద్యాశాఖ తమ పూర్తి సహకారం అందించి సజావుగా సాగేలా చూస్తాం.
– గణపురం భీమయ్య, జిల్లా అధ్యక్షుడు, టిఎస్ ఎస్టీయూ, నల్లగొండ