చౌటుప్పల్, జనవరి13 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో పట్టణ కేంద్రంలో రెండో రోజూ రద్దీ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోజంతా ఇదే పరిస్థితి కనిపించింది. పోలీసులు సంస్థాన్నారాయణపురం క్రాస్రోడ్డును మూసివేశారు. ఈ వైపు వెళ్లే వాహనాలు వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. బస్టాండ్ మార్గాన్ని కూడా మూసివేయడంతో స్థానిక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దాంతో కేవలం ద్విచక్రవాహనదారులు, పాదచారులను మాత్రమే అక్కడి నుంచి పంపించారు. పెద్ద వాహనాలను అనుమతించలేదు. నల్లగొండ వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులు బస్టాండ్ లోపలికి వెళ్లలేదు. లోపలికి రావాలంటే ధర్మోజిగూడెం క్రాస్రోడ్డు వద్ద యూటర్న్ తీసుకోవాలి. దూరభారం పెరుగడంతో జాతీయ రహదారిపైనే ప్రయాణికులను ఎక్కించుకున్నారు.
హైదరాబాద్ నుంచి చౌటుప్పల్కు నడిచిన బస్సులు వలిగొండ క్రాస్రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాయి. పోలీసులు ట్రాఫిక్ను కంట్రోల్ చేసినప్పటికీ వాహనదారులు లక్కారం సర్వీస్ రోడ్డు వెంట వెళ్లారు. సర్వీసు రోడ్డు కూడా రద్దీగా మారింది. పోలీసులు అక్కడి నుంచి పెద్ద వాహనాలను అనుమతించలేదు. అంతేకాకుండా వాహనదారులు మధ్యాహ్నం తర్వాత ధర్మోజిగూడెం క్రాస్రోడ్డు నుంచి వ్యతిరేక మార్గంలో వెళ్లారు. దాంతో కొద్దిసేపు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది.
చౌటుప్పల్ రూరల్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం భోగి ఉండడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు ఎక్కువ మంది వాహనాల్లో వెళ్లారు. పంతంగి టోల్గేట్ నుంచి శనివారం ఉదయం మొదలు సాయంత్రం 6 గంటల వరకు 65 వేల వాహనాలు వెళ్లినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. చౌటుప్పల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.