వైరా టౌన్, ఆగస్టు 15: ఏన్కూరు వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు వైరా లింక్ కాలువ సైడ్ బర్మ్స్.. నిర్మాణం పూర్తయిన నెల రోజులకే కుంగిపోవడం సర్వత్రా చర్చనీయాంభమైంది. ఈ విషయంపై గుంభగనంగా ఉంటున్న రేవంత్ సర్కారు.. ఆగమేఘాల మీద మరమ్మతు పనులు చేపట్టింది. వెంటనే యంత్రాలను రంగంలోకి దింపి రిపేర్లు చేసింది.
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వద్ద ఒక్క పిల్లర్ కూలినందుకే.. మొత్తం కాళేశ్వరమే కూలేశ్వరమైందంటూ అబద్ధాలను విస్తృతంగా ప్రచారాలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సీతారామ లింక్ కాలువ సైడ్ బర్మ్స్ నిర్మించిన నెల రోజులకే కుంగిపోయి వరదలో కొట్టుకుపోవడంపై ఏమి సమాధానం చెబుతుందన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఆగమేఘాల మీద మరమ్మతులు చేసింది. ఈ పనులను చూసి ముక్కున వేలేసుకోవడం స్థానిక రైతుల వంతైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టును చేపట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యే నాటికి ప్రాజెక్టు పనులను 80 శాతం పూర్తిచేసింది. ఇంతలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలుత ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఆ తరువాత ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రాజెక్టు నీళ్లపై కన్నేశారు. వాటిని తమ ప్రాంతాలకు తరలించుకునే కుట్రలకు తెరలేపారు. నీటిని మొదట నిర్దేశించుకున్న విధంగా కాకుండా తమ సొంత ఆలోచనలతో వినియోగించేందుకు పూనుకున్నారు.
ఇందుకోసం ప్రధాన కాలువలకు లింక్ కెనాళ్లు నిర్మించిన సీతారామ కాలువ ద్వారా గోదావరి నీటిని మళ్లించాలని చూశారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద సీతారామ ప్రధాన కాలువకు అడ్డుగా రాజీవ్ లింక్ కెనాల్ పేరిట రూ.72 కోట్లతో ఓ కాలువను నిర్మించారు. దీని ద్వారా గోదావరి నీటిని వైరా రిజర్వాయర్కు తరలించాలని, అక్కడి నుంచి నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించాలని చూశారు. అయితే, ఈ కాలువ నిర్మాణంలో భాగంగా ఏన్కూరు వద్ద నెల రోజుల క్రితం లింక్ కెనాల్ సైడ్ బర్మ్స్ నిర్మించారు. తాజాగా శుక్రవారం అవి కుంగిపోయాయి.
కాలువ నీటిలో కలిసి కొట్టుకుపోయాయి. దీంతో స్థానిక రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై నానా యాగీచేసిన కాంగ్రెస్ పాలకులు.. ఇప్పుడు వారు నిర్మించిన కాలువ బర్ములు కొట్టుకుపోవడంపై ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘నమస్తే’ తెలంగాణ కూడా ‘కట్టి నెలాయే…అప్పుడే కూలిపాయే..’ శీర్షికన శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో అప్పటిదాకా గుంభనంగా ఉన్న ప్రభుత్వం.. రైతుల ప్రశ్నలు, ‘నమస్తే’ కథనం నేపథ్యంలో ఆగమేఘాల స్పందించి కూలిన బర్ములకు ఆదరాబాదరాగా మరమ్మతులు చేయించింది.