యాదాద్రి భువనగిరి, జూన్ 12 (నమస్తే తెలంగాణ)/సూర్యాపేట / నీలగిరి ;సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆదరణకు నోచక అనేక రంగాల్లోనూ వెనుకే ఉండేవారు. కనీసం భద్రత కల్పించలేని దుస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకం మహిళల పేరునే అందిస్తూ సముచిత గౌరవం కల్పించారు. తల్లి కడుపు నుంచి ఆడబిడ్డ బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ కిట్టుతో ప్రారంభమయ్యే సంక్షేమ పథకం ముసలి తనంలో ఆసరా పింఛన్ వరకు వివిధ పథకాలతో వారికి అండగా నిలుస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో లబ్ధిదారులు..
నల్లగొండ జిల్లాలో 7,759మంది ఒంటరి మహిళలు రూ.2,116 పింఛన్లు పొందుతున్నారు. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లలో 2014నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 55,365మంది ఆడబిడ్డలకు రూ.498కోట్లు అందించారు. ఇప్పటి వరకు జిల్లాలో 60,285మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప థకానికి దరఖాస్తు చేసుకోగా అందులో 55,365మంది ఖాతాల్లో డబ్బులు పడగా మిగిలిన వారివి ప్రాసెస్లో ఉన్నాయి. జిల్లాలో మూడు డివిజన్లలో షీ టీమ్లు ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు పిర్యాదులు 1320 కౌన్సిలింగులు, 2,605కేసులు, 213పెట్టి కేసులు, 594 అవగాహన సదస్సులు, మహిళలను వేధిస్తున్న 2,705 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తగిన గుణపాఠం చెప్పారు. భరోసా కేంద్రంతో 156మంది మహిళలకు సత్వర న్యాయం చేశారు. 200 వాట్సాప్ గ్రూప్స్ మహిళలతో ఏర్పాటు చేసి అందరికీ అందులో ఎప్పటికప్పుడు ప్రివెంటివ్గా సలహాలు సూచనలు ఇస్తూ వారిని మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నల్లగొండ జిల్లాలో 80 హాట్ స్పాట్లు గుర్తించి షీ టీమ్లతో నిరంతరం నిఘాపెట్టి ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. మహిళలకు అత్మరక్షణగా షీటీమ్లతో కరాటే శిక్షణ ఇస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో అంగన్వాడీల్లో పౌష్టికాహారం సరుకులు అందించేవారు. దానితో పెద్దగా ప్రయోజనం అందడం లేదని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పేరుతో ఒక పూట సంపూర్ణ ఆహారం అందిస్తున్నారు. ఫలితంగా రక్తహీనతతో శిశు మరణాల సంఖ్యను 39నుంచి 27శాతానికి తగ్గించారు. అదేవిధంగా గతంలో పోషకాహార లోపం, రక్తహీనతతో వెయ్యి మంది తల్లుల్లో 92మంది చనిపోయేవారు దాన్ని 39కి తగ్గించారు. మహిళా ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకాన్ని నీతి అయోగ్ ప్రశంసించింది. ఈ పథకంతో జిల్లాలో 90,451మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.30.82కోట్లు ఖర్చు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 1,56,002మంది మహిళలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం కాగా వారందరికీ కేసీఆర్ కిట్ అందించారు. అమ్మ ఒడి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 73,612మందికి వారి ఖాతాల్లో రూ.80.90కోట్లు జమ చేశారు.
ఆరోగ్య మహిళ పథకం ఇప్పటివరకు జిల్లాలో సుమారు 4690మందికి పైగా పరీక్షలు చేశారు. జిల్లాలో సఖి కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు సుమారు 7,209మందికి అండగా నిలిచి 5,107 మంది సమస్యలు పరిష్కరించారు. అంతేగాక మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 181 టోల్ ఫ్రీనెంబర్, హెల్ప్లైన్తో 159 ఫిర్యాదులు సేకరించి వాటిని పరిష్కరించి బాధితులకు అండగా నిలిచారు. అంతేగాక 258 అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి 25,400 మహిళలకు, 16,922 పురుషులకు మొత్తంగా 42,322మందికి అవగాహన సదస్సులు నిర్వహించారు. సమైక్య రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల వేతనం నెలకు 4200 ఉంటే ప్రస్తుతం రూ.13,650 అందిస్తున్నారు. మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.2200ఉంటే 7,800కు పెంచారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న వారిని టీచర్లుగా నామకరణం చేసి గౌరవప్రదమైన స్థాయి కల్పించారు. వెయ్యి రూపాయల గౌరవ వేతనంతో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు రూ.10,500వేతనం ఇచ్చి సుముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని పలువురు కొనియాడుతున్నారు.
మహిళలకు ఆరోగ్యానికి ప్రాధాన్యం
రాష్ట్రంలో ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ వరకు, అనంతరం ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గర్భం దాల్చిన మహిళల ఆరోగ్య సంరక్షణకు ఆశ వర్కర్తో నిరంతరం పర్యవేక్షణ , 102 వాహనంలో నెలకొకసారి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు, సాధారణ డెలివరీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ వరకు దశల వారీగా రూ.12వేల నగదు అందిస్తున్నారు. ఆడబిడ్డ పుట్టిన వారికి అదనంగా మరో వెయ్యి రూపాయలు అందిస్తున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్లు అందిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 44,105మందికి కేసీఆర్ కిట్లు అందించారు. గర్భిణులు పౌష్టికాహారం అందక ఇబ్బంది పడకూడదని కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను జిల్లావ్యాప్తంగా 2,176 అందించారు.
అనారోగ్య సమస్యలతో బాధపడే మహిళల కోసం ప్రతి మంగళవారమూ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేకంగా వారికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 4,160మందికి వివిధ రకాల పరీక్షలు ఉచితంగా చేయించారు. అంగన్వాడీ కేంద్రాలతో ప్రత్యేకంగా వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు. మహిళలను ఇంటికే పరిమితం గాకుండా స్థానిక సంస్థల పాలనలో భాగస్వామ్యూలను చేయడానికి ప్రభుత్వం తొలిసారిగా 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య భారీగా పెరిగింది. తొలి జిల్లా పరిషత్ పీఠం మహిళకే దక్కింది. వీటితో పాటు ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా చైర్పర్సన్లు ఉండగా 475 గ్రామ పంచాయతీల్లో 262పంచాయతీల్లో మహిళా సర్పంచులు ఉన్నారు. 23 జడ్పీటీసీ స్థానాల్లో 14 మంది మహిళలు, 23మంది ఎంపీపీ స్థానాలకు గాను 17ఎంపీపీ పీఠాలను మహిళలు అధిరోహించారు. మెజార్టీ స్థానాల్లో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు పాలక వర్గంలో ఉన్నారు.
అన్నింట్లో వారిదే పైచేయి
తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులను ఇంటి మహిళ పేరుపైనే ఇచ్చింది. డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారులుగా ఇంటి మహిళనే ఎంపిక చేశారు. రోజు రోజుకూ పెరుగుతున్న మహిళా వేధింపులను అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా షీ టీంలను ఏర్పాటు చేసి అరికట్టారు. ప్రస్తుతం షీటీంలు అడబిడ్డలకు పూర్తి భద్రత ఇస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో సఖీ, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసి బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నారు. వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. ఆడబిడ్డల చదువుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. బాలకలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కేటగిరీకి రెండు చొప్పున జిల్లాలో 8గురుకులాలు మంజూరుచ చేశారు. గురుకులాల కళాశాలలు సైతం ఏర్పాటు చేశారు.
వీటితో పాటు విద్యార్థినులు వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్నారు. ఆడబిడ్డ పెండ్లి తల్లిదండ్రులకు భారంగా మారొద్దని వారి పెండ్లికి అండగా ఉండేందుకు ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించి రూ.51వేలు ఆర్థిక సాయం అందించడం ప్రారంభించారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా 2017 ఏప్రిల్లో రూ.75వేలు, 2018 ఏప్రిల్ నుంచి 1,00,116 ఇస్తున్నారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో సుమారు 36వేల కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో దాదాపు రూ. 345.60కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం వారికి పింఛన్ సౌకర్యం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 6,926మందికి నెలకు రూ.2,116 పింఛన్ ఇస్తున్నారు. భర్త చనిపోయిన ప్రతి మహిళకు రూ.2,116 చొప్పున జిల్లా వ్యాప్తంగా 58,717మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగ మహిళలకు ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్తో రూ. 4116 ఇవ్వనున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 10వేల మంది లబ్ధిదారులు ఉన్నారు.
మహిళా సంక్షేమ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. నాడు సీమాంధ్రుల పాలనలో నెట్టివేయబడిన మహిళలు తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉన్నారు. నాడు, నేటి తేడాలను గుర్తించేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పథకాల అమలు తీరు వివరిస్తూ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో మహిళ లోకం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి.
– కె.కృష్ణవేణి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి, నల్లగొండ
యాదాద్రిభువనగిరి జిల్లాలో లబ్ధిదారులు
యాదాద్రిభువనగిరి జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 25,887మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.248.80కోట్లు మంజూరు చేసింది. షాదీ ముబారక్ పథకానికి 1,110మంది లబ్ధిదారులకు రూ.10.50కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో 844 ప్రధాన అంగన్వాడీ, 57 మినీ అంగన్వాడీ కేంద్రాలు కలిపి మొత్తం 901సెంటర్లు నడుస్తున్నాయి. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి రోజూ సగటున 5వేల మంది గర్భిణులు, 5వేల మంది బాలింతలు పోషకాహారం పొందుతున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు గర్భిణులు 23వేల మందికి కేసీఆర్ కిట్ అందించారు. కేసీఆర్ కిట్లో తల్లీబిడ్డలకు అవసరమయ్యే సుమారు రూ.15వేల విలువైన వస్తువులు అందిస్తున్నారు. అంతేకాకుండా ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ. 12వేల చొప్పున సాయం చేస్తున్నది. ఇందుకు గర్భిణులకు రూ.35 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఫలితంగా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. జిల్లాలోని గుండాల, బీబీనగర్ పీహెచ్సీల్లో ఇప్పటి వరకు 1000మందికి వైద్యసేవలు అందించారు. అంతేకాకుండా 80మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రభుత్వం 2015 నుంచి సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33శాతం, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నది. మారెట్ కమిటీల్లో మహిళలకు ప్రభుత్వం 33శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. దీంతో మహిళలకు చైర్పర్సన్లు అయ్యే అవకాశం లభించింది. ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 142మంది గ్రేడ్-2 సూపర్ వైజర్ పోస్టులను రెగ్యూలరైజ్ చేసింది.
నేడు మహిళా సంక్షేమ దినోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుల్లో అంగన్వాడీ టీచర్లు, సెర్ఫ్ సిబ్బంది కలిపి మొత్తం వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొననున్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించనున్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్, ఆరోగ్య మహిళ తదితర కార్యక్రమాలను వివరించనున్నారు. మహిళా ఉద్యోగులకు సన్మానం చేయనున్నారు.