నల్లగొండ ప్రతినిధి, జూన్ 7(నమస్తే తెలంగాణ) : ‘కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులన్నీ క్రమేణా ధ్వంసం చేస్తూ వచ్చారు. గత పాలకుల పుణ్యాన గొలుసు చెరువుల ఆనవాళ్లు లేకుండా పోయాయి. సమైక్య రాష్ట్రంలో చిన్న నీటి వనరులన్నీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కచ్చితంగా వాటికి పెద్ద పీట వేస్తాం. ధ్వంసమైన చెరువులను జాతి గర్వించేలా పునరుద్ధరిస్తాం. వచ్చే నాలుగేండ్లలో ప్రతి చెరువు అలుగు పోసేలా, ఆ అలుగు నీటిలో జనం చేపలు పట్టేలా సమగ్ర చర్యలు చేప డు తున్నాం.’ అంటూ మిషన్ కాకతీయకు శ్రీకా రం చుడుతూ ఆనాడు సీఎం కేసీఆర్ చెప్పిన మాటల సారంశం ఇది.
ఆనాడు సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షరాల సాక్షాత్కరిస్తున్నాయి.. అందుకు నిదర్శనం కొనేండ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిండుతున్న చెరువులే. ప్రతి ఏటా చెరువులు నిండు కుండలా మారి మత్తడి దుంకుతున్నా..ఒక్క చెరు వు చెక్కు చెదరలేదు. ఒక్క చెరువుకూ గండి పడిన దాఖలాలు లేవు. వర్షం నీరంతా చెరువులు, కుంటల్లో నిల్వ ఉంటుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో వర్షాలు వచ్చి భారీ వరదలు వస్తున్నాయన్న సంతోషం ఓ వైపు ఉండేది. ఆ వెనుకాలే… చెరువులు లేదా కుంటల్లోకి వస్తున్న వరదనీరు తెల్లారే సరికి ఉంటాదా? లేదా? సందేహాలు కూడా వెంటాడుతుండేవి. ఎటు వైపు నుంచి చెరువు బుంగ పడుతుందో.. ఏ వైపు తెగుతుందోనన్న ఆందోళన కనిపించేది. కానీ స్వరాష్ట్రంలో అప్పటి పరిస్థితికి భిన్నమైన వాతావరణం ప్రస్తుతం గ్రామాల్లో నెలకొంది. అందుకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకమే ముఖ్య కారణం. మిషన్ కాకతీయలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 4,454 చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. వీటిల్లో 184 ప్రధాన చెరువులు ఆక్రమణకు గురయ్యాయని కూడా గుర్తించి అప్పట్లో చర్యలు చేపట్టారు. ఇక మొత్తం నాలుగు విడుతల్లో చెరువులన్నింటనీ ఆధునీకరించారు. దాంతో చెరువులన్నీ పూర్వవైభవం సంతరించుకున్నాయి. వాస్తవంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 4,454 చెరువుల కింద గతంలో 3.10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా సమైక్య పాలనలో అది 2.10 లక్షలకు కుదించబడింది. అయితే మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పు నరుద్ధ్దరణ తర్వాత పాత ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చినట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం చెరువులు కలిపి దాదాపు 22 నుంచి 24 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్ద్యాన్ని కలిగి ఉన్నాయి.
నేడు..చెరువుల పండగ
దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం అంతటా చెరువుల పండుగకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామంలో చెరువు గట్టుపై కార్యక్రమాల నిర్వహణకు నీటి పారుదల శాఖ ఏర్పాట్లు చేసింది. పెద్దచెరువు వద్ద సాయంత్రం ఐదు గంటలకు చెరువుల పండుగ నిర్వహించనున్నారు. గ్రామ కూడలి నుంచి బోనాలు, బతుకమ్మ, మ త్స్యకారుల వలలతో ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. పండుగ వాతావరణం తలపించేలా చెరువు కట్టలపై ముగ్గులు, తో రణాలతో అందంగా అలంకరించనున్నారు. కట్టమైసమ్మకు చెరువు నీటికి పూజలు నిర్వహించనున్నారు. అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ కోలాటాలు, పాటలు, గోరటి వెంకన్న రాసి న చెరువోయి… మా ఊరి చెరువు లాంటి పాటలతో సందడి చేసేలా కార్యక్రమాల రూపకల్పన చేశారు. తర్వాత నాయకులు, ప్రజలు, రైతులు కలిసి చెర్వు కట్టపైనే సహాపంక్తి భోజనాలు చేసేలా కార్యచరణ సిద్ధం చేశారు.