యాదగిరిగుట్ట, మే 11 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేసి తిరు మాఢవీధుల్లో ఊరేగించారు. సేవలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు నారసింహస్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు.
అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణతంతును వీక్షించారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామివారికి దర్బార్ సేవ నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 16 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.23,39,914 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.తతత
హుండీల ఆదాయం రూ. 2,05,55,422
స్వామి వారి 21 రోజుల హుండీల ఆదాయం రూ.2 కోట్లు దాటిందని ఆలయ ఈఓ ఎన్.గీత వెల్లడించారు. గురువారం యాదాద్రి కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించామని, నగదు 2,05,55,422 వచ్చిందని వెల్లడించారు. 45 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 100 గ్రాములు మిశ్రమ వెండి, యూఎస్ డాలర్లు 628, యూఏఈ దిరామ్స్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 100, కెనడా డాలర్లు 2, నేపాల్కు చెందిన 70 రూపాయలు, న్యూజిలాండ్ డాలర్లు 40, సింగపూర్ డాలర్లు 5, కువైట్కు చెందిన 1/6 దీనార్, బోట్సానాకు చెందిన 20 పౌలాలు, మలేషియాకు చెందిన 14 రింగిట్స్ సమకూరినట్లు వివరించారు.