తిరుమలగిరి మే 24 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో నందాపురం, అనంతారం, మాలీపురం గ్రామాలతో కలిపి నూతన మున్సిపాలిటీగా తిరుమలగిరి ఏర్పడింది. 18 వేలకు పైగా జనాభా, 15 వార్డులు ఉన్నాయి. నాడు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో నిధుల వరద పారడంతో ప్రగతి పరుగులు పెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటు పడింది. గతంలో ప్రారంభించిన సంక్షేమం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాక అభివృద్ధి నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావొస్తున్న ఇప్పటి వరకు మున్సిపాలిటీలో చెప్పుకోదగ్గ పనులు జరిగిన దాఖలాలు లేవు.
మున్సిపాలిటీ ఏర్పాటైన నాలుగు సంవత్సరాల కాలంలో తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం (టీయూఎఫ్ఐడీసీ) నుంచి రూ. 20 కోట్లు మంజూరు చేసి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దింది. అదే విధంగా రూ. 5 కోట్లతో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణం. రూ.3 కోట్లతో మల్టీ పర్పస్ ఆడిటోరియం నిర్మాణం, రూ.2 కోట్లతో వెజ్ ,నాన్ వెజ్ మార్కెట్ పనులు ప్రారంభించింది. ప్రభుత్వం ఇప్పటికీ ఈ పనులు పూర్తి చేయలేదు.
గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు ఇప్పటికి పూర్తి కాలేదు. ఎప్పటి వరకు పూర్తువుతాయో కూడా తెలియదు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పనులు పూర్తవుతాయేమో అని స్థానికులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి ఒరిగిందేమీ లేదు. కనీసం నిధులు మంజూరు కాని పరిస్థితి ఉంది. ప్రస్తుత పనులన్నీ బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులతో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి తప్పు చేశామనే భావన జనంలో స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో కనిపించటం లేదు. ఇచ్చిన హమీలు నెరవేర్చలేని దుస్థితి నెలకొంది. మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఎక్కడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేసి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.