ఉచిత కోచింగ్తో నిరుద్యోగ యువతకు భరోసా
ఆలేరులో ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్
380 మంది నిరుద్యోగ అభ్యర్థులు
11 మంది సబ్జెక్టు నిపుణులతో బోధన
తోడ్పాటునిస్తున్న ‘నమస్తే తెలంగాణ నిపుణ’
యాదాద్రి, మే 17: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి..? ఏ మెటీరియల్ ఫాలో కావాలి..! అనే విషయంలో సతమతమవు తుంటారు. వీటికి తోడు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు చాలా మందిని కోచింగ్కు దూరం చేస్తుంటాయి. వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయలేని నిస్సహాయ స్థితిలో ఎంతో మంది ఇంటికే పరిమితమవుతుంటారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లు నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తున్నాయి. సబ్జెక్టు నిపుణులతో 70రోజుల శిక్షణతో పాటు మధ్యాహ్న భోజన వసతిని కూడా కల్పిస్తుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రం ఇప్పటికే 45రోజులు పూర్తి చేసుకున్నది. శిక్షణ తీరుపై నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా నియామకాల ప్రకటన చేయడం నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తిస్తున్నది. అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో గ్రాడ్యుయేట్స్ ప్రతిభను చాటి ఉద్యోగం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలేరు పట్టణంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాలతో ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను సంప్రదించి 11 మంది ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. 70 రోజుల పాటు సాగే కోచింగ్లో ఆర్థమెటిక్ రీజనింగ్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, ఇంగ్లిష్, పాలిటీ, తెలంగాణ చరిత్ర, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్లో నిపుణులు బోధిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుపై శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు జనగామ జిల్లా నుంచి మొత్తం 380 మంది నిరుద్యోగులు శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే 45 రోజులు పూర్తి కావడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కు వెళ్లి వేలకు వేలు వెచ్చించి తీసుకునే శిక్షణకు దీటుగా ఇక్కడే ఉచితంగా అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. శిక్షణతో పాటు ‘నమస్తే తెలంగాణ’ లో ప్రచురితమయ్యే ‘నిపుణ’ను అనుసరిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. ‘నిపుణ’ ఎంతగానో తోడ్పాటు ఇస్తున్నదని కృతజ్ఞతలు చెబుతున్నారు.
రూ.50వేలు ఖర్చయ్యేది…
2015లో ఉద్యోగాల భర్తీ సమయంలో సికింద్రాబాద్కు వెళ్లి కోచింగ్ తీసుకున్నా. అక్కడే ఉండి చదువుకున్నా. అప్పట్లోనే రూ.50 వేలు ఖర్చయ్యింది. అయినా ఉద్యోగం రాలేదు. అప్పటికి, ఇప్పటికి కోచింగ్లో చాలా తేడా ఉన్నది. సులభమైన పద్ధతిలో బోధిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్తోపాటు స్థానిక ఎమ్మెల్యే ఉచితంగా శిక్షణ ఇవ్వడం హర్షించదగ్గ విషయం. దీంతో పాటు ‘నమస్తే తెలంగాణ’ లో ప్రచురితమవుతున్న ‘నిపుణ’లో ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నది.
– జి.కుమారస్వామి, ఎంఏ, పొలిటికల్ సైన్స్, ఆలేరు
ఆలేరులో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్
కఠిన శ్రమే విజయానికి మంత్రం
రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలూ విడుదల చేయని విధంగా అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలకు తోడు నా వంతు బాధ్యతగా మా నియోజకవర్గ యువతకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయించాను. 70రోజుల పాటు ఉచితంగా శిక్షణతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నాం. అడుగగానే పీజేఆర్ ఇనిస్టిట్యూట్ వాళ్లు సానుకూలంగా స్పందించారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. ఆలేరు నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక, భౌగోళిక అంశాలు, సామాజిక స్థితిగతులు, ఉద్యమంపై అవగాహన పెంచుకోవాలి.
– గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వవిప్
హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది..
ఉద్యోగాల నోటిఫికేషన్ అనగానే హైదరాబాదే గుర్తొస్తుంది. దాదాపు మూడు నెలల పాటు అక్కడే ఉండి కోచింగ్ తీసుకునేవాళ్లం. కోచింగ్ సెంటర్లకు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది రావడంతో చెప్పే సబ్జెక్టు అర్థం కాకపోయేది. దాంతో కోచింగ్ను మధ్యలోనే విడిచి తిరిగి వచ్చే పరిస్థితి ఎదురయ్యేది. కానీ, అందుకు భిన్నంగా ఆలేరులోనే ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారని చాలా మంది చెప్తే మొదట నమ్మలేదు. కానీ ఇక్కడికి వచ్చి చూశాక చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్లో కూడా ఇంత చక్కని వాతావరణంలో కోచింగ్ ఉండదు.
– డి.ఉపేందర్, బీటెక్, ఎల్లంల, జనగామ జిల్లా
కానిస్టేబుల్ అవుతా..
ప్రభుత్వ ఉద్యోగిని కావాలన్నది నా చిన్ననాటి ఆశయం. ప్రజలకు సేవ చేసే కానిస్టేబుల్ ఉద్యోగమంటే నాకు చాలా ఇష్టం. కష్టపడి చదువుతున్న నాకు ఉచిత కోచింగ్ సెంటర్ కలిసివచ్చింది. రోజూ వచ్చి ఫ్యాకల్టీ వాళ్లు చెప్పే ప్రతి ఒక్కటీ నోట్ చేసుకుని అవగాహన పెంచుకుంటున్నా. ఉచితంగా కోచింగ్తో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని
కానిస్టేబుల్ అవుతా. – మల్క జ్యోతి, ఎంకామ్. టంగుటూరు, ఆలేరు
ప్రభుత్వ ఉద్యోగం పక్కా..
ఉచిత కోచింగ్ సెంటర్ అంటే సాధారణంగా ఉంటుందని అనుకున్నా. తూతూ మంత్రంగా కోచింగ్ ఇస్తారని భావించా. కానీ డబ్బులు ఖర్చు చేసినా ఇంతటి నాణ్యమైన కోచింగ్ ఇవ్వరు. ప్రతి అంశాన్నీ వివరంగా చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తా.
– సూదగాని ఉషశ్రీ, శ్రీరాంనగర్, యాదగిరిగుట్ట
రివిజన్, బిట్ ప్రాక్టీస్ సాధనతో సక్సెస్..
అకడమిక్ ప్రిపరేషన్ వేరు.. కాంపిటేటివ్ ప్రిపరేషన్ వేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే 80 వేల పోస్టుల్లో విజేతగా నిలువాలంటే అకడమిక్ నుంచి కాంపిటేటివ్ వైపు మళ్లాలి. ఈ కాంపిటేటివ్లో విజయం పొందాలంటే అకాడమిక్ పుస్తకాలను చదువడం, కోచింగ్లో చెప్పిన ప్రతి అంశాన్నీ అనుసరించాలి. నాణ్యమైన మెటీరియల్ ఫాలోకావాలి. పరీక్ష రాసే సమయానికి పుస్తకాలను కనీసం ఐదుసార్లు రివిజన్ చేసి సిద్ధంగా ఉండాలి. రివిజన్, బిట్ ప్రాక్టీస్ సాధన తప్పనిసరి.
– జగదీశ్వర్రెడ్డి, డైరెక్టర్, పీజేఆర్ కోచింగ్ సెంటర్