భువనగిరిలో డీసీఎం ఢీకొని ముగ్గురి మృత్యువాత
మద్యం తాగి వాహనం నడిపిన డ్రైవర్
స్కూటీని 20 మీటర్లకుపైగా ఈడ్చుకెళ్లిన వాహనం
మృతుల్లో భార్యాభర్తలు, తోడికోడలు
అనాథలైన పిల్లలు వలిగొండ మండలం
టేకులసోమారంలో విషాదం
భువనగిరి అర్బన్, జూన్ 9 : బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. అందులో భార్యాభర్తలు, తోడి కోడలు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన దండబోయిన నర్సింహ (35), భార్య రాజలక్ష్మి(30), వదిన దండబోయిన జంగమ్మ(40) స్కూటీపై బొమ్మలరామారం మండలం చౌదర్పల్లి గ్రామంలో నర్సింహ మేనత్త భర్త అంత్యక్రియలకు వెళ్తున్నారు. భువనగిరి నుంచి తుర్కపల్లి రోడ్డు మార్గంలో వెళ్తుండగా పోలీస్ హెడ్క్వార్టర్స్ సమీపంలో తుర్కపల్లి నుంచి భువనగిరి వైపు వస్తున్న డీసీఎం డ్రైవర్ ఎండీ.అప్సర్ మద్యం మత్తులో అతివేగంతో ఢీకొట్టాడు.
స్కూటీని డీసీఎం సుమారు 20 మీటర్లకు పైగా రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. దాంతో నర్సింహ స్యూటీలో కాలు ఇరుక్కుపోయి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీ పైనుంచి ఎగిరిపడిన రాజలక్ష్మి, జంగమ్మ తలలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలారు. స్థానికుల సమాచారంతో భువనగిరి రూరల్ ఎస్ఐ సీహెచ్.రాఘవేందర్గౌడ్, బీబీనగర్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాలను భువనగిరి ఏరియా దవాఖానకు తరలించారు. నర్సింహ, రాజలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు, జంగమ్మకు భర్త బాలమల్లు, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దవాఖానలో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు.
టేకులసోమారంలో విషాదఛాయలు
వలిగొండ , జూన్9: భువనగిరి మండలం హన్మాపురం వద్ద స్కూటీ డీసీఎం ఢీ కొన్న ప్రమాదంలో మండలంలోని టేకులసోమారం గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన నర్సింహ భార్య రాజ్యలక్ష్మి, వదిన జంగమ్మతో కలిసి స్కూటీపై మండలంలోని చౌదర్పల్లిలో జరిగె బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకోగా వారు మృత్యువాత పడ్డారు.
అనాథలుగా మారిన చిన్నారులు
దండెబోయిన నర్సింహ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడంతో వీరి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ 7వ తరగతి, రెండో కుమార్తె శృతి 4వ తరగతి చదువుతున్నారు. వీరితో పాటు మూడు సంవత్సరాల వయస్సున్న కుమారుడు జశ్వంత్ ఉన్నాడు. తల్లి తండ్రిలు మృతి చెందడంతో ఏమీ పాలుపోక ఏడుస్తున్న చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. జంగమ్మకు కూడా ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిని కోల్పోయిన చిన్నారులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.