సూర్యాపే టౌన్, జూన్ 10 : కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాలో ధాన్యపు రాశులు కురిపిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లాలో పారుతున్న నీటిలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసుకుని పొంగి పోతున్నారని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో సాగు, అందుకు తగ్గట్టే ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలబడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని, అందుకు వృద్ధి రేటే నిదర్శనమని తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం పెరిగిందని చెప్పారు. అధికార వికేంద్రీకరణ జరుగడంతో దూరభారం తగ్గి ప్రజలకు పాలన చేరువైందని (మొదటి పేజీ తరువాయి) మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. జరుగుతున్న ప్రగతికి అధికారుల పనితీరు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. పాలసీ రూపొందించేది ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ అమలు చేయాల్సింది అధికారులేనని తెలిపారు. అటువంటి అధికారులు నిరంతరం శ్రమిస్తున్నందునే తక్కువ కాలంలో ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్నామన్నారు. ఆ విజయాలను మననం చేసుకునేందుకే ఈ దశాబ్ది ఉత్సవాలని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ పాల్గొన్నారు.