జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : గుంతల రోడ్డుపై వర్షపు నీరు నిలువడంతో బీఆర్ఎస్ యూత్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రహదారి మరమ్మతులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్ యాదవ్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై నిలిచిన నీటిలో చేపలు పడుతూ నిరసన తెలిపారు.
మహేందర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి కేటీకే-2 ఇైంక్లెన్ జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నాలుగు లైన్ల రోడ్డు పనులకు రూ.10 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రోడ్డు పనులు నిలిచిపోవడంతో గుంతలు పడి వర్షానికి నీరు నిలుసున్నదని, దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.