హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తేతెలంగాణ) : కృష్ణా ప్రాజెక్టుల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు సకాలంలో నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయకుంటే ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఒత్తిడికి సర్కార్ దిగొచ్చి ఆగమేఘాలపై పంపులను ప్రారంభించిందని స్పష్టంచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉత్తరకుమారుడని, ఆయనకు సాగునీటి వినియోగంపై అవగాహన లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 75సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రభుత్వం కండ్లు తెరిచి వచ్చిన నీటిని ఒడిసి పట్టుకొని కృష్ణా ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ఝుటా మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు. పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్లో పెట్టిందన్న ఆయన మాటలు అవాస్తవాలని, బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు పచ్చబడిందన్న వాస్తవం తెలుసుకోవాలని హితవు పలికారు.