Roads Potholes | రాయపోల్, సెప్టెంబర్ 20 : అది నిత్యం వాహన రాకపోకలు సాగిస్తూ పలు గ్రామాలను కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారి.. కానీ వర్షం పడితే చాలు రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు నిత్య నరకయాతనగా మారాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది.
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని కొత్తపల్లి, రాంసాగర్, గొల్లపల్లి, రామారం, చౌదరిపాలేం, తిమ్మక్కపల్లి నుంచి లింగాపూర్ తదితర గ్రామాల్లో రోడ్లు పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాటి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలుచోట్ల రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నిత్యం ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రజలు సమయం, ఇంధనం వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలకు నిలయంగా..
గుంతలు తప్పించుకునేందుకు వాహనదారులు ఒక్కసారిగా రోడ్డు పక్కకు మళ్లడం, ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. సరైన వీధి దీపాలు లేకపోవడం, గుంతలు నీటితో నిండిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
రోడ్ల దుస్థితిపై స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాత్కాలికంగా గుంతల్లో మట్టి, కంకర పోసినా వర్షాలకు అవి కొట్టుకుపోతున్నాయని చెబుతున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తోందని వాపోతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని..గుంతలను వెంటనే పూడ్చడంతోపాటు దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.


ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్!
Watch: ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె కుటుంబం కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?