యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి. 22 వేల మంది భక్తులు రాగా ఆలయ ఖజానాకు రూ.28,00,324 ఆదాయం సమకూరింది.
– యాదగిరిగుట్ట, జూలై 23
యాదగిరిగుట్ట, జూలై 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల కొలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు.
అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. భక్తులు పాల్గొని వీక్షించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు వైభవంగా చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివాకి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 22 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని ఆలయ ఖజానాకు రూ. 28,00,324 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి, ఐజీ తరుణ్ జోషి వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.