నల్లగొండ, జూలై 16: గ్రామ పం చాయతీల్లో రెండున్నరేండ్లుగా పెండింగ్లో ఉన్న కరెంటు బిల్లులను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పం చాయతీ రాజ్ శాఖను ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గ ర నుంచి పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో జిల్లాలోని 868 గ్రామ పంచాయతీలు, వాటి ఆవాసాల పరిధిలో సుమారు రూ.162కోట్లు కరెంటు బిల్లులు పెం డింగ్లో ఉన్నాయి. అయితే ఆ బిల్లులు పేరుకుపోవటంతో విద్యుత్ శాఖపై పెను భారం పడటం మూలంగా ఇటీవల పంచాయతీల్లోని జనరల్ ఫండ్ నుంచి విడతల వారీగా చెల్లించాలని ఆదేశించారు.
అయితే జనరల్ ఫండ్ నుంచి బిల్స్ చెల్లించేందుకు డిజిటల్ చెక్ ద్వారా ఎస్టీవో నుంచి బిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఎస్టీవో ద్వారా బిల్స్ వెంటనే సర్కార్ ఖాతాలో పడే అవకాశం లేకపోవటంతో ఇటీవల కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని గురువారం కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు సర్పంచులపై వత్తిడి చేయటంతో వారు అంగీకరించటం లేదు. జనరల్ ఫండ్ ద్వారానే విడతల వారీగా ఇస్తామని…15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పడంతో కార్యదర్శులు, సర్పంచ్ల మధ్య లొల్లి ప్రారంభమైంది.
జనరల్ ఫండ్ అయితే ఆలస్యం అవుతుందని..
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో మళ్లీ ఖజానాను నింపుకునే ప్రయత్నంలో భాగంగానే తక్షణ కరెంటు బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. రెండున్నరేండ్లుగా రాష్ట్ర సర్కార్ గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవటంతో జిల్లాలో కరెంట్ బిల్లుల రూపంలో రూ.162 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే గ్రామాలకు పన్నులు, ఇతర రూపాల్లో వచ్చిన ఆదాయంలో విడతల వారీగా బిల్లులు చెల్లించమని గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది.
అయితే ఈ జనరల్ ఫండ్ ద్వారా కరెం ట్ బిల్లు చెల్లించాలంటే డిజిటల్ చెక్ ద్వారా ఎస్టీవోలకు పంపాలి. అక్కడ నుంచి సర్కార్ ఖాతాల్లో జమ అవుతాయి. గ్రామాల్లో పెద్దగా జనరల్ ఫండ్ లేకపోవటంతోపాటు ఎస్టీవోల ద్వారా చెల్లింపు ప్రక్రియ ఆలస్యం కానుంది. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులైతే ఎస్టీవోతో సంబంధం లేకుండా నేరుగా సర్కార్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం దీనిపై దృష్టి సారిం చి, ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ హయాంలో నెలవారీ చెల్లింపులు
గ్రామాల్లో నీటి వినియోగంపై మోటార్లకు బిగించిన మీటర్లు, వీధి లైట్ల ద్వారా వచ్చిన కరెంట్ బిల్లులను గ్రామ పంచాయతీలే చెల్లించాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ప్రతి నెలా అన్ని గ్రామాలకు పల్లె ప్రగతి పథకం పేరుతో 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో వ్యక్తికి రూ.188 చొప్పున చెల్లించటంతో ప్రతి గ్రామానికి రూ.లక్షల్లో నిధులు విడుదలయ్యేవి. వీటితో ట్రాక్టర్ల డీజిల్, పంచాయతీ కార్మికులు వేతనాలు, కరెంట్ బిల్లులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టే వారు. జిల్లాకు ఆ పథకం కింద ప్రతి నెలా సుమారు రూ.19 కోట్లు విడదలయ్యేవి. దీంతో పంచాయతీల్లో పెండింగ్ అనేవి ఉండేవి కావు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయ కూడా ఇవ్వకపోవటంతో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. అయి తే ఇప్పటి వరకు పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా విదల్చని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను ఎం దుకు తీసుకుంటుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులైతే వెంటనే సర్కార్ ఖాతాల్లోకి..
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రామాల్లో పాలక వర్గాలు లేక కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో నూతన సర్పంచుల రాకతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం జిల్లాలోని 868 గ్రామాలకు రూ.27కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. వీటిలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కొంత మేరకు నిధులను అభివృద్ధి కోసం వినియోగించగా, మరికొన్ని గ్రామాల్లో అలాగే ఉన్నాయి. ఈ నిధులను వెంటనే కరెంట్ బిల్లుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి మళ్లించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పంచాయతీ రాజ్ శాఖ యంత్రాంగాన్ని వెంటనే కరెంట్ బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు సర్పంచులపై వత్తిడి చేసి కరెంట్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గురువారం డీపీవో శంకర్ నాయక్ సైతం పంచాయతీ కార్యదర్శులతో సెల్ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి కరెంట్ బిల్లుల చెల్లింపుపై దృష్టి సారించాలని ఆదేశించారు.
15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చేది లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలిచిన దగ్గర నుంచి పంచాయతీలకు ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు. గ్రామా ల్లో పాలన ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు. రెండున్నర ఏండ్లుగా పేరుకుపోయిన బిల్లులు ఒకేసారి ఇవ్వమంటే ఎలా ఇస్తాం. అయినా కరెంట్ బిల్లుల పేరుతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నుంచి ఇచ్చిన నిధులు తీసుకుంటామంటే మేం ఎలా ఇస్తాం. స్టేట్ ఫైనాన్స్ కింద నిధులు ఇచ్చి తీసుకుంటే అభ్యంతరం చెప్పం. కానీ ఈ నిధులు మాత్రం ఇచ్చేది లేదు.
-జిల్లపల్లి రేణుకారాజు, కొత్తపల్లి సర్పంచ్, నల్లగొండ మండలం
కరెంట్ బిల్లులు కట్టాల్సిందే..
గ్రామాల్లో కరెంట్ బిల్లులు పేరుకుపోయాయి. రెండున్నరేండ్లుగా బిల్లులు కట్ట డం లేదు. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్నందున వాటిని వెంటనే చెల్లించాలని సర్పంచులకు సూచించాం. అదే విధంగా గ్రామాల్లో కరెంట్ వినియోగాన్ని తగ్గించి పొదుపుగా వాడుకుంటే ఎక్కువ బిల్లులు రాకుండా ఉంటాయి.
– శంకర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ