Bhuvanagiri | యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పదో తరగతి విద్యార్థినుల ఘటనపై ఎన్నో అనుమానాలు తావిస్తున్నాయి. అసలు ఆత్మహత్యా..? హత్యా..? అనేది క్లారిటీ రావడం లేదు. బాలికలది ఆత్మహత్య అని అధికారులు, పోలీసులు చెబుతుండగా, కచ్చితంగా హత్యే అని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇందుకు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినుల సూసైడ్కు విద్యార్థుల మధ్య గొడవే కారణమని వార్డెన్ శైలజ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఏడో తరగతి, పదో తరగతికి చెందిన కొందరు విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. ఘర్షణ నేపథ్యంలో టీచర్.. వార్డెన్కు సమాచారం ఇవ్వగా, ఆమె సదరు విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే చిన్నపాటి గొడవకే ఆత్మహత్య చేసుకునేందుకు పిరికోళ్లు తమ పిల్లలు కాదని తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురు అన్ని విషయాల్లో ధైర్యం ఉంటుందని, సూసైడ్ చేసుకోవడం ఏంటని భవ్య తల్లి చెప్పుకొచ్చింది. కాగా అసలు గొడవ ఎందుకు జరిగిందనే ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
ఆటో డ్రైవర్పై
ఈ ఘటనలో మరో కొత్త కోణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ పనిచేస్తున్న ఓ ఉద్యోగి, ఆటో డ్రైవర్ మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతున్నది. సదరు ఆటో డ్రైవర్ పగలు, రాత్రి అనే తేడా లేకుండా హాస్టల్లో తిరిగేవారని చెబుతున్నారు. స్థానికులు సైతం అతడిపై చెడుగా చెబుతుండటం గమనార్హం. ఈ కోణంలోనూ విద్యార్థినులను ఏమైనా చేసి ఉండవచ్చా అనే విషయంలోనూ స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. తల్లిదండ్రులు సైతం వార్డెన్, సదరు ఉద్యోగి, ఆటో డ్రైవర్పైనే అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆటో డ్రైవర్ విషయంలో గొడవ జరిగితే భవ్య తమకు ఫోన్ చేసి చెప్పిందని, ఇక్కడ ఉండలేనని తీసుకెళ్లాలని కోరిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. రెండు నెలల్లో పరీక్షలు ఉన్నాయని, పూర్తికాగానే తీసుకెళ్తామని బదులిచ్చామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్, సదరు ఉద్యోగి పరారీలో ఉన్నారు.
విద్యార్థుల ఆత్మహత్య తర్వాత శనివారం రాత్రి ఓ సూసైడ్ నోట్ బయటకు వచ్చింది. ఇద్దరు విద్యార్థుల్లో ఇది ఎవరు రాశారనే క్లారిటీ రావాల్సి ఉంది. నోట్లో పూర్తిగా వార్డెన్ శైలజకు అనుకూలంగానే ఉందనే ప్రచారం జరుగుతున్నది. తల్లిదండ్రుల గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. అయితే భవ్య, వైష్ణవి సంతకాలు ఒకే విధంగా ఉన్నాయి. మరోవైపు హ్యాండ్ రైటింగ్ తమ పిల్లలది కాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
సూసైడ్ నోట్పై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే అసలు విషయం ఏంటనేది బయటకు వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థినుల మృత దేహాలను పోస్ట్ మార్టం రూమ్లో భద్రపరించారు. పోస్ట్ మార్టం కంటే ముందు స్టూడెంట్లను చూసేందుకు పలువురు కుటుంబ సభ్యులను అనుమతించారు. బయటకు వచ్చిన వారు పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి చేతిపై గాయాలు ఉన్నాయని, మెడపై చుట్టు గాట్లు ఉండకుండా ఒక వైపే ఉన్నాయని చెప్పుకొచ్చారు. నాలుక బయటకు రాలేదని అంటున్నారు.
విద్యార్థుల ఘటనపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నా రు. ఆదివారం ఉదయమే సూసైడ్ స్పాట్ అ యిన సాయికృప డిగ్రీ కాలేజీలోని ఎస్సీ హాస్టల్లో విచారణ ప్రారంభించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలతో కలిసి ఘట నా స్థలిని పరిశీలించారు. అక్కడే పలు వివరాలను సేకరించారు. అనంతరం క్లూస్ టీం హాస్టల్ను సందర్శించి వివరాలు సేకరించింది.