నల్లగొండ, మే 29 : నల్లగొండలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో ఉన్న ఒక ఫర్టిలైజర్ దుకాణంలో ఈ నెల 24న కట్టంగూర్ మండలం పరడకు చెందిన రైతు రాంరెడ్డి(పేరు మార్చాం) అమెరికా కంపెనీకీ చెందిన పది విత్తన ప్యాకెట్లు కావాలని అడిగాడు. దుకాణ యజమాని లేవనడంతో వ్యవసాయ అధికారిని సంప్రదించినా ఉపయోగం లేకుండాపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయాడు.
అదే రోజు సాయంత్రం తిప్పర్తికి చెందిన ఒక రైతు అవే విత్తన ప్యాకెట్లు కావాలని అడగ్గా.. పది ప్యాకెట్లు వేరే కంపెనీవీ కొంటే అమెరికా కంపెనీ ప్యాకెట్ ఇస్తానని అనడంతో ఇరవై ప్యాకెట్లు వేరే కంపెనీ ప్యాకెట్లు కొని సదరు కంపెనీ ప్యాకెట్లు తీసుకొని వెళ్లాడు.
నల్లగొండ మండలం గుండ్లపల్లికి చెందిన లక్ష్మయ్య అనే రైతు తొమ్మిది ప్యాకెట్లు అమెరికా కంపెనీ పత్తి ప్యాకెట్లు కావాలని అడగ్గా ప్యాకెట్కు రూ.1300 తీసుకొని ప్రకాశం బజార్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న సదరు కంపనీ డీలర్ అమ్మాడు.. అలాగే ఇతర జిల్లాల నుంచి తెచ్చి న్యూప్రేమ్ థియేటర్ సమీపంలో మరో ప్యాపారి ఒక్కో ప్యాకెట్ రూ.1300 నుంచి రూ.1400 వరకు అమ్ముతున్నాడని రైతులు అంటున్నారు.
ఇలా అమెరికాకు చెందిన ఒక పత్తి విత్తన కంపెనీకి సంబంధించిన ప్యాకెట్లు నల్లగొండలో విచ్చలవిడిగా బ్లాక్కు తరలిస్తూ విక్రయిస్తున్నారు. ప్రభుత్వం బీజీ-2 విత్తనాలు రూ.864కి మాత్రమే అమ్మాలని నిబంధన పెడితే వాటిని పట్టించుకోకుండా వ్యాపారులు స్థానిక అధికారులను తప్పుదోవ పట్టించి డిమాండ్ ఉన్న విత్తన ప్యాకెట్లను బ్లాక్కు తరలిస్తూ విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో ఈ సారి 5.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనుండగా ఆయా కంపెనీలు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు మాత్రమే సైప్లె చేస్తున్నాయి. దాంతో వ్యాపారులు డిమాండ్ ఉన్న ప్యాకెట్లు బ్లాక్లో విక్రయిస్తుండగా, డిమాండ్ లేని కంపెనీలను రైతులకు అంటగడుతున్నారు. ఫలితంగా పంట దిగుబడి సరిగ్గా రాక రైతులు నష్టపోవాల్సి వస్తుంది.
అమెరికా కంపెనీకి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లను ముగ్గురు వ్యాపారులు కుమ్మక్కై బ్లాక్లో అమ్మి రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో సదరు కంపెనీకి చెందిన డీలర్లు పది మంది ఉన్నప్పటికీ నల్లగొండలోని ప్రకాశం బజార్లో ఉన్న డీలర్కే కంపెనీ ప్రతినిధులు ఎక్కువ స్టాక్ ఇవ్వడంతో ఆయన పెద్దఎత్తున విత్తన ప్యాకెట్లు బ్లాక్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఆయన బాటలోనే పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డీలర్తోపాటు ఓల్డ్ సిటీలో ఉన్న మరో డీలర్ ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ ప్యాకెట్ను రూ.1300 పైగా విక్రయిస్తున్నట్లు రైతులు అంటున్నారు. అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు ఆయా దుకాణాల్లో తనిఖీలు చేసినప్పటికీ ఆ ప్యాకెట్ల స్టాక్ అయిపోయిందనే సమాధానం వచ్చిందట. ఇదిలా ఉండగా తక్కువ సరుకు వచ్చిందని, అప్పుడే అమ్మేశామని కొందరి రైతుల వివరాలు ఇచ్చి బ్లాక్లో అమ్మే వాళ్లకు కొంత సమయమిచ్చి వేరే దగ్గర నుంచి తెప్పించి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 11,18,512 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తారనే వ్యవసాయ శాఖ అంచనాలు ఉండగా అందులో 5,40,081 ఎకరాల్లో పత్తి, 5,19,160 ఎకరాల్లో వరి, మిగిలిన ఎకరాల్లో ఇతర పంటలు ఉండనున్నాయి. 5.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి కనీసం 16 లక్షల నుంచి 18 లక్షల వరకు విత్తన ప్యాకెట్లు అవసరం పడతాయి. జిల్లాలో ప్రతియేటా రైతులు ఆంధ్రాతోపాటు మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్కు వెళ్లి విత్తనాలు తీసుకొస్తుంటారు. అలా కొనుగోళ్లు జరిగినప్పటికీ డిమాండ్ ఉన్న విత్తనాల కోసం వ్యాపారులు బ్లాక్కు తెర తీస్తున్నారు. ఇక రెగ్యులర్గా సైప్లె చేసే కంపెనీ విత్తన ప్యాకెట్లు పోను మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కంపెనీల విత్తన ప్యాకెట్లు, డిమాండ్ ఉన్న విత్తన ప్యాకెట్లకు లింక్ పెట్టి ఆయా చిన్న కంపెనీల నుంచి భారీగా డిస్కౌంట్లు, ఇతర దేశాల టూర్లు, ప్రత్యేక ప్యాకేజీలు పొందుతుండటం గమనార్హం.
బీజీ-2 పత్తి విత్తన ప్యాకెట్లు ఎంఆర్పీ ధర అయిన రూ.864కు మాత్రమే విక్రయించాలి. ఎవరైనా ఏ కంపెనీ విత్తన ప్యాకెట్ అయినా అంతకు మించిన రేటు అమ్మితే షాప్ సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాం. రైతులు ఎక్కువ ధరకు కొనవద్దు. ఎవరైనా ఎక్కువ ధర అంటే వెంటనే మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల జిల్లాలోని అన్ని షాపులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలిస్తున్నాం. డీలర్లు రైతులకు ఎక్కువ ధరలకు అమ్మొద్దు.
-పాల్వాయి శ్రవణ్ కుమార్, డీఏఓ, నల్లగొండ