నీలగిరి, జనవరి 7 : నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పదవిపై సోమవారం నిర్వహించనున్న అవిశ్వాస తీర్మాణానికి ఓటింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపి 34 మంది కౌన్సిలర్లను శనివారం క్యాంపునకు తరలించింది. నేరుగా మున్సిపల్ సమావేశ మందిరానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవిశ్వాసం నెగ్గకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది.
కొంతమందికి విప్ అందజేయగా మరికొందరు అందుబాటులో లేకపోవడంతో వారి ఇండ్ల వద్ద విప్ను అంటించారు. ఒకవేళ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకునేలా ఇప్పటికే విప్ జారీ చేసి సంబంధిత కాపీలను కలెక్టర్కు అందజేశారు. గతంలో కనగల్ మండలంలో విప్ ధిక్కరించిన వారు పదవులు కోల్పోవడంతోపాటు ఉప ఎన్నికలు జరిగాయి. దాంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన కౌన్సిలర్లలో కొంత అలజడి మొదలైంది. పదవి కోల్పోవాల్సి వస్తే తమ పరిస్ధితి ఏంటని అందోళన చెందుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ క్యాంపులో ఉన్నప్పటికీ ఓటు వేయాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్లు వినికిడి.
నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులకు బీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 20, బీజేపీ 6, ఎంఐఎం ఒకటి, స్వతంత్రులు ఒకరు గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంఐఎం, స్వతంత్రులు, ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొని అప్పట్లో బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. తరువాత కాంగ్రెస్ కౌన్సిలర్ మృతి చెందడంతో అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ్ధి విజయం సాధించాడు. కాంగ్రెస్కు చెందిన మరో కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 22కు కాంగ్రెస్ సంఖ్య 18కి చేరింది.
శాసససభ ఎన్నికలు సమయంలో బీఆర్ఎస్కు చెందిన 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల తరువాత మరో ఆరుగురితోపాటు స్వతంత్రులు కలిపి మొత్తం ఏడుగురు కాంగ్రెస్లో చేరారు. దాంతో మున్సిపాలిటిలో కాంగ్రెస్ బలం 34కు చేరింది. వీరంతా కలిసి చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించారు. ఈ అవిశ్వాసం నెగ్గితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన 15 మంది కౌన్సిలర్లకు పదవి గండం ఏర్పడనుంది. కాగా, అవిశ్వాస పరీక్షలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
గతంలో కనగల్ మండలంలో రేగట్టె, కనగల్ ఎంపీటీసీలు పార్టీ విప్నకు వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొనగా పదవులు కోల్పోయారు. దాంతో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఇదే తరహాలో నల్లగొండ మున్సిపాలిటీలోనూ విప్నకు వ్యతిరేకంగా ఓటేస్తే తమ పదవులు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది.