సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే మన ఊరు..మన బడి కార్యక్రమం చేపట్టి పాఠశాలలను బలోపేతం చేస్తున్నది. మరోవైపు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం యూనిఫామ్ క్లాత్ను టెస్కో (రాష్ట్ర చేనేత సహకార సంస్థ) జిల్లాలకు పంపగా అవి మండల ఎంఆర్సీలకు చేరుతున్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎండాకాలంలో స్థానిక దర్జీలతో కుట్టించి స్కూళ్లు ప్రారంభం నాటికి అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,113 బడుల్లో 2.27లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఎరుపు రంగులో ప్యాంట్, స్కర్ట్.. ఎరుపు, బూడిద రంగుతో కూడిన చెక్స్ షర్ట్ను ఐదు డిజైన్లలో అందించనున్నారు.
– రామగిరి, ఏప్రిల్ 4
రామగిరి, ఏప్రిల్ 4 : మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడికి వచ్చే విద్యార్థులకు సైతం యూనిఫాం, పుస్తకాలు అందిస్తున్నది. ప్రతి సంవత్సరం బడులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు యూనిఫామ్ చేరేవి. ఈ సారి మాత్రం పాఠశాలలు ప్రారంభించే నాటికే సిద్ధం చేసి విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు గానూ టెస్కో నుంచి సరికొత్త కలర్స్తో కూడిన క్లాత్ను కొనుగోలు చేసి జిల్లాలకు చేరవేసింది. వాటిని వేసవిలో కుట్టించి జూన్లో విద్యార్థులకు అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ముందస్తుగానే యూనిఫామ్
ప్రభుత్వ పాఠశాలలు (జడ్పీ, ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ)లో చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠశాల యూనిఫామ్స్ అందిస్తున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో జూన్లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి కొత్త డిజన్స్తో యూనిఫామ్స్ అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ఏప్రిల్లోనే పాఠశాలలకు క్లాత్ అందించి మేలో దర్జీల వద్ద స్టిచింగ్ పూర్తి చేసి పాఠశాలల ప్రారంభం నాటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,27,345 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.
ఉమ్మడి జిల్లాకు చేరిన క్లాత్
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ, జడ్పీ, మోడల్, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటీలో 2,27,345 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. వీరికి యూనిఫామ్స్ కోసం 1,13,8788.75 మీటర్ల క్లాత్ అవసరం కాగా టెస్కో(రాష్ట్ర చేనేత సహకార సంస్థ) నుంచి సరఫరా చేశారు. జిల్లా కేంద్రాలకు చేరిన క్లాత్ను ఎంఆర్సీలకు చేరవేశారు. ఈ విద్యాసంవత్సరం బళ్లు ముగిసేలోగా ఆయా మండలాల ఎంఈఓలు యూనిఫామ్ క్లాత్ను పాఠశాలల హెచ్ఎంలకు అందించనున్నారు.
సరికొత్త డిజైన్లతో
ప్రభుత్వం ఎంపిక చేసిన కొత్త డిజైన్లలోనే స్టిచ్చింగ్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందచేసే పాఠశాల యూనిఫామ్ ఈ సారి ముందస్తుగానే సిద్ధం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టెస్కో నుంచి వచ్చిన క్లాత్ను డీఈఓ భిక్షపతి ఆదేశాలతో వెంటనే మండలాల్లోని ఎంఆర్సీలకు ప్రత్యేక వాహనాల్లో చేరవేస్తున్నాం. ఎంఆర్సీల నుంచి ఆయా పాఠశాలలకు చేరవేసి ఎంఈఓల పర్యవేక్షణలో ప్రధానోపాధ్యాయులు వేసవి చివరి నాటికి ప్రభుత్వం చూపించిన కొత్త డిజైన్స్లో దర్జీలతో కుట్టించి విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు రూపొందించాం.
– వంగూరి వీరయ్య, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి, సమగ్రశిక్ష, నల్లగొండ