ఆధ్యాత్మిక ప్రపంచాన ఇల వైకుంఠంగా ప్రభవిల్లుతున్న యాదాద్రి దివ్యక్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తున్నది. అత్యంత మహిమాన్వితుడు, శక్తిమంతుడు అయిన పంచనారసింహుడు.. కోరిన కోర్కెలు నెరువేరుస్తూ భక్తుల ఇలవేల్పు అవుతున్నాడు. ఆపదంటూ వచ్చి శరణుజొచ్చిన వారికి అభయహస్తం ఇస్తున్నాడు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, వ్యాపారం, సంతానం, విదేశీయానం.. ఇలా మనస్సులో ఉన్న కోరిక ఏదైనా స్వామివారి ముందుంచితే చాలు.. అనుగ్రహిస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసం ప్రకటిస్తున్నారు. అది నెరవేరిన అనంతరం ఇంటిల్లిపాది యాదాద్రికి వచ్చి లక్ష్మీనరసింహుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ, ఏపీతోపాటు దేశ, విదేశాల భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు యాదాద్రీశుడి కరుణాకటాక్షాల కోసం పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహాద్భుతంగా పునర్నించిన ఆలయాన్నిచూసి పరవశించిపోతున్నారు.
కొలిచిన వారికి కొంగు బంగారు స్వామిగా యాదగిరిగుట్టపై గుహలో జ్వాల, యోగా, లక్ష్మీనరసింహుడిగా స్వామివారు స్వయంభువుగా వెలిశారు. కొన్ని వేల ఏండ్ల నుంచి దర్శించుకున్న భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా యాదాద్రీశుడు నిలుస్తున్నాడు. స్వామివారికి తమ కోరికలను విన్నవిస్తే చాలు ఆయనే స్వయంగా తీరుస్తాడని భక్తుల విశ్వాసం. చాలా మంది భక్తులు స్వామివారిని మొక్కుకొని అనుగ్రహం పొందుతున్నారు. సంతానం లేనివారికి, వివాహం జరిగేవారికి లక్ష్మీనరసింహుడిగా.. ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి ధన్వంతరమూర్తిగా.. శత్రుపీడలు, బ్యాంకు, కోర్టు సమస్యలు తీర్చేందుకు పంచనారసింహుడిగా భక్తులకు అభయమిస్తున్నాడు. అడగ్గానే వరాలిచ్చే మహాద్భుత స్వామి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడని పలువురు భక్తులు కొనియాడుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబునిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న పలువురు భక్తులు నమస్తే తెలంగాణతో ఆనందాన్ని పంచుకున్నారు.
యాదాద్రి, నవంబర్ 25 : యాదాద్రిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య లక్షకు చేరువైంది. మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రోజూ 20వేల నుంచి 30వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. సెలవు దినాలతో పాటు శని, ఆదివారాల్లో దాదాపు 50వేల నుంచి 60వేల మందికి పైనే వస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. దాంతో స్వామివారి నిత్య రాబడి, హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. ఆలయ చరిత్రలో లేని విధంగా కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు లక్ష మంది దర్శించుకున్నారు. దాంతో ఒక్క రోజు ఆదాయం కోటి రూపాయలు దాటింది. యాదాద్రికి విదేశీయుల తాకిడీ పెరుగగా.. హుండీకి పలు దేశాల కరెన్సీ సమకూరుతున్నది.
నూతనాలయం పునఃప్రారంభమైన అనంతరం స్వామివారిని మొక్కుకొని ఫలితాలు పొందిన భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులు దీరుతున్నారు. కోరికలు నెరవేరిన భక్తులు సంతోషంగా స్వామివారిని మనసారా దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గతంలో లేని విధంగా విదేశీ భక్తుల తాకిడీ పెరిగింది. ఒకప్పుడు నూతన సంవత్సర వేడుకల సమయంలోనే కనిపించే విదేశీయులు.. ఇప్పుడు వారానికి రెండు మూడు ధపాలుగా కొండపై దర్శనమిస్తున్నారు. ఆలయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మన్, న్యూజిలాండ్, యూరో, కెనడా, ఖతార్, సింగపూర్, స్కాట్లాండ్, కెనడా, సింగపూర్కు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం. విదేశీయుల రాకతో హుండీకి విదేశీ కరెన్సీ భారీగా వచ్చి చేరుతున్నది. అమెరికా డాలర్లు, యూఏఈ ధిరామ్స్తో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ స్వామివారి ఖజానాకు సమకూరుతున్నది.
మాది హైదరాబాద్లోని పాతబస్తీ. నా చిన్న నాటి నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నాం. మా కుటుంబ సమస్యలు తీరితే మొక్కు తీర్చుకుంటామని గత ఏడాది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మొక్కుకున్నాం. కొంత కాలానికే మా సమస్యలన్నీ తీరాయి. అందుకే స్వామివారికి వెండి బెత్తం, కోర మీసం, కండ్లు, కాళ్లు చేయించి సమర్పించాం. మా ఇంట్లో ఏ శుభకార్యం, ఏ సమస్య వచ్చినా స్వామివారిని మదిలో తలుచుకుని మొక్కుకుంటాం. ఏ సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది. నూతనాలయం చాలా అద్భుతంగా ఉంది.
– అర్జున్, పురాణాపూల్, హైదరాబాద్
యాదాద్రి స్వయంభూ పంచనారసింహుడికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పాత దేవాలయం, బాలాలయం ఉన్న సమయంలో రోజుకు 5వేల నుంచి 10వేల మంది, సెలవు దినాలతోపాటు శని, ఆదివారాల్లో 15వేల నుంచి 20వేల మంది భక్తులు మాత్రమే వచ్చేవారు. నిత్యరాబడి రూ.15లక్షలు దాటేది కాదు. శని, ఆదివారాల్లో రూ.20లక్షల నుంచి 25 లక్షల వరకు వచ్చేది. ప్రధానాలయం పునఃప్రారంభమైన అనంతరం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా రోజుకు 20వేల నుంచి 30వేల మంది, సెలవు దినాలతోపాటు శని, ఆదివారాల్లో 50వేల నుంచి 60వేల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం రోజువారి ఆదాయం రూ.20 లక్షలకు పైగా వస్తుండగా.. శని, ఆదివారాల్లో 40లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు స్వామివారికి సమకూరుతున్నది. కార్తిక మాసం సందర్భంగా సెలవు దినాల్లో లక్ష మందికి పైగానే స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. హుండీ లెక్కించిన ప్రతిసారీ రూ.కోటిన్నరకు పైనే ఆదాయం సమకూరుతున్నది. గతంలో కార్తిక మాసంలో రూ.7కోట్లు మాత్రమే సమకూరేది. ఈ సారి రూ.3,08,60,806 హుండీ ఆదాయం రాగా, కార్తిక మాసం 28 రోజుల నిత్య రాబడి రూ.14.66 కోట్లు వచ్చింది. గతంలో మూడు వారాలకోసారి హుండీ లెక్కించగా.. ఆదాయం పెరుగుతుండడంతో ఇప్పుడు రెండు వారాలకోసారి లెక్కిస్తున్నారు.
మాకు 1985లో వివాహమైంది. అప్పట్లో భువనగిరిలో సోషల్ వెల్పేర్ విభాగంలో నేను డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేశా. ప్రతి వారం స్వామివారిని దర్శించుకునేవాళ్లం. బదిలీపై హైదరాబాద్కు వచ్చి అక్కడే విరమణ పొందా. మాకు ఒక బాబు అభినవ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మా కుమారుడికి వివాహం కావాలని గతేడాది నవంబర్లో అభినవ్తో యాదగిరిగుట్టకు వచ్చి మొక్కుకున్నాం. డిసెంబర్లోనే వివాహం కుదిరింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మొక్కు తీర్చుకునేందుకు వచ్చాం. స్వామివారి కల్యాణంలో పాల్గొన్నాం. స్వామివారిని దర్శించుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మా ఇలవేల్పుగా లక్ష్మీనరసింహస్వామిని కొలుస్తున్నాం. ఏదైనా బాధ కలిగితే స్వామివారిని మదిలో తలుచుకుంటే ఇట్టే తీరిపోతుంది. అప్పటికి, ఇప్పటికి యాదగిరిగుట్ట ఆలయం పూర్తిగా మారిపోయింది. ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకే తలమానికంగా తీర్చిదిద్దారు.
– లక్ష్మయ్య, హైదరాబాద్
మాది విజయవాడ. నేను 35 ఏండ్లుగా హైదరాబాద్లో ఉంటున్నా. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. మా కూతురు వెంకటలక్ష్మి నాగశారద వివాహం కుదురాలని 2020 జనవరిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కుకున్నాం. స్వామిని మొక్కుకున్న నెల రోజుల్లోనే పెండ్లి కుదిరింది. ప్రస్తుతం మా కూతురు, అల్లుడు ఢిల్లీలో స్థిరపడ్డారు. స్వామివారి అనుగ్రహంతో మా కుటుంబం సంతోషంగా ఉంది. ప్రతి ఏటా రెండు, మూడు సార్లు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటాం. కరోనాతో రెండేండ్లు స్వామివారికి దూరమయ్యాం. ఇప్పుడు నూతనాలయంలో స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవంలో పాల్గొని మొక్కు తీర్చుకున్నాం. స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మనశ్శాంతి దొరుకుతుంది.
– వెంకటరామకృష్ణశర్మ, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్
నా భర్త రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డాడు నా భర్త వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం మేము హైదరాబాద్లోని హస్తినాపురంలో ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో మా వారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకున్నా. పెద్ద ప్రమాదం నుంచి స్వామివారు బయటపడేశారు. బతికి బయటపడ్డారు. రెండు కాళ్లకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అందుకే స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకునేందుకు వచ్చాను. స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.
– రమాదేవి, హస్తినాపురం, హైదరాబాద్
9 నెలల క్రితం నా భర్త భిక్షపతి పక్షవాతంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. నడువలేని స్థితికి వచ్చాడు. మందులు వాడినా నయం కాలేదు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే తగ్గుతుందనే నమ్మకంతో యాదగిరిగుట్టకు వచ్చి మొక్కుకున్నాం. నడువలేని స్థితిలో ఉన్న ఆయన.. ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు. స్వామివారి దయతో ఆయన ఆరోగ్యం కుదుటపడింది. స్వయంగా ఆయనే నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకునే స్థితికి వచ్చాడు. నారసింహుడిని నమ్ముకుంటే కష్టాలు తీరుతాయన్నది నిజం. స్వయంభూ మూర్తి కావడంతో కోరిన వెంటనే అభయమిస్తున్నాడు.
– మంగమ్మ, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా
నేను హైదరాబాద్లోని ఓ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నా. ప్రధానాలయ పునఃప్రారంభ సమయంలో యాదగిరిగుట్టకు వచ్చి మా కుమారుడు వర్మకు విదేశాలకు వెళ్లేందుకు అర్హత సాధించాలని నరసింహస్వామిని మొక్కుకున్నా. ప్రస్తుతం మా బాబు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ మధ్య అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్ష ఐఈఎల్టీఎస్కు అర్హత సాధించాడు. దీంతో స్వామివారి మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో వచ్చాను. తలనీలాలు సమర్పించా. చాలా అనందంగా ఉంది. ప్రతి ఏడాది స్వామివారిని దర్శించుకుంటున్నా. యాదగిరీశుడి దయతోనే మా బాబుకు విదేశాలకు వెళ్లి చదువుకునే భాగ్యం కలిగింది.
– వెంకటేశ్వర్లు, హైదరాబాద్