అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సరారు అండగా నిలుస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఆగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదికుగా నిలిచారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 వేల పరిహారం ప్రకటించారు. కౌలు రైతులకూ వర్తింపజేశారు. జిల్లాలో సుమారు 4,020 మంది రైతులకు చెందిన 8,275 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేయగా రూ. 8.2 కోట్ల సాయం అందనున్నది. సీఎం కేసీఆర్ ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు ఆగమయ్యాయి.జిల్లాలో 8,275 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రా థమిక అంచనా వేశారు. మొ త్తం 4,020 మంది రైతులకు చెందిన పంట నష్టపోయినట్లు తేల్చారు. అత్యధికంగా గుండాల మండలంలో 2,550 ఎకరాల్లో పంట నేలకొరిగింది. పంట నష్టం నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి రూ. 10 ఆర్థిక సాయం ప్రకటించారు. వెంటనే నిధుల విడుదలకు ఆదేశించారు. దాంతో 8.2 కోట్ల పరిహారం అందనుంది.
అకాల వర్షాలతో కలిగిన నష్టంతో రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవ సాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకోనున్నట్లు పేరొంది. ఈ డబ్బును నేరుగా రైతులకు ఇవ్వకుండా.. ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకోనుంది. పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చర్యలకు ఉపక్రమించింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా అదుకుంటున్నది.ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదిలో రెండు సార్లు రూ.10 వేల సాయం చేస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 2,500 కోట్ల సాయం చేసింది. ఇంకా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. వాటర్ సెస్ బకాయిలను రద్దు చేసి ఆదుకున్నది. ఇక రైతు ఏ కారణంతోనైనా చనిపోతే రూ. 5లక్షల బీమా సాయం చేస్తున్నది. దీనికి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తున్నది. రైతులను నట్టేటా ముంచుతున్నది. పంట నష్టం జరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. పంట నష్టంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపుతున్నా ఎలాంటి సాయం చేయడం లేదు. కానీ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తున్నది.
వడగండ్లవానకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. నష్టపోయిన పంటలను సీఎం కేసీఆర్ స్వయంగా జిల్లాలకు వెళ్లి నష్టాన్ని పరిశీలించడంతో రైతులకు ధైర్యం పెరిగింది. ఇప్పటికే రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతుబీమా లాంటి పథకాలను అందిస్తున్నా ప్రభుత్వం పరిహారం ఇవ్వడం గొప్ప విషయం
-యాస ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్
వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ నేరుగా పరిశీలించి పంటనష్టం సాయం చేస్తానని ప్రకటించడం సంతోషంగా ఉంది. పంట నష్టం జరిగితే రైతుకు ఎంత బాధ ఉంటుందో సీఎం కేసీఆర్కు తెలుసు. రైతుల బాధలు తెల్సినోడు కనుకే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు ఇస్తుండు. కౌలు రైతులకు కూడా పంటనష్టం పరిహారం ఇస్తామని ప్రకటించడం సంతోషం. దీంతో రైతులకు చాలా మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-కంబాల కుమార్, కౌలు రైతు, పాచిల్ల , గుండాల మండలం