ఎండైనా, వానైనా ఏ రోజూ ఇరాం లేకుండా ప్రాణాలను అరచేతులో పెట్టుకొని చేసే వృత్తి గీతన్నలది. అలా అంతెత్తున ఉండే చెట్లపైకి ఎక్కి కల్లు గీసే సమయంలో ప్రమాదశావత్తూ జారిపడి ప్రాణాలు వదిలినవాళ్లు అనేకమంది. తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైన వారి బాధలు మాటల్లో చెప్పలేనివి. అలాంటి వారిని, ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఆదుకుంటున్నది. సమైక్య పాలనలో గీత కార్మికుల వెతలను పట్టించుకున్న ప్రభుత్వాలే లేకపోగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గీతన్నలకు అండగా ఉంటున్నారు. తాటిచెట్టు పైనుంచి పడి గాయపడిన, చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తున్నారు. ఈ మేరకు గతంలో ఉన్న ఎక్స్గ్రేషియాను పెంచడం బాధిత కుటుంబాలకు కొండంత ఆసరా అవుతున్నది. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 434, యాద్రాది భువనగిరి జిల్లాలో 467 కుటుంబాలకు పరిహారం అందింది. సూర్యాపేటలో ఈ ఏడాది ఇప్పటివరకు 31 కుటుంబాలు ఎక్స్గ్రేషియా పొందాయి. చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి తీవ్రతను బట్టి పరిహారం అందుతున్నది. త్వరలో రైతు బీమా తరహాలో గీతన్న బీమా అమలుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
– యాదగిరిగుట్ట, జూలై 1
యాదగిరిగుట్ట, జూలై 1 : కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవించే గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో మూసివేసిన కల్లు దకాణాలను తెరిపించి వేలాది మంది గీత కార్మికుల ఉపాధిని నిలబెట్టింది. అదేవిధంగా చెట్ల పన్ను రద్దు చేయడంతోపాటు బకాయిలను మాఫీ చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా వైన్ షాపుల కేటాయింపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం కలిగినా గీత కార్మికుడికి గత ప్రభుత్వాలు రూ.50వేల నుంచి రూ.2లక్షలు మాత్రమే పరిహారం అందించేది. సీఎం కేసీఆర్ ఈ పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచారు. గతంలో తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందితేనే పరిహారం అందేది. కానీ.. ఇప్పుడు తరహాలో ఎలాంటి ప్రమాదంలో మృతిచెందినా, సాధారణ మరణమైనా పరిహారం అందించేలా చర్యలు చేపట్టారు. రైతుబీమా తరహాలో ఆ కుటుంబానికి నేరుగా బ్యాంక్ ఖాతాలో బీమా డబ్బు జమ చేయనున్నారు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
రూ.8.16 కోట్ల చెల్లింపు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17వేల మందికి పైగా గీత కార్మికులున్నారు. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం 2016 అక్టోబర్ 11నుంచి ఇప్పటి వరకు 79 మంది తాటిచెట్ల పైనుంచి పడి మృతి చెందగా, 185 మంది శాశ్వత వైకల్యం, 203 మంది తాత్కాలిక వైకల్యం బారిన పడ్డారు. 79 మందిలో 20 మందికి ఒక్కొక్కరికి రూ.2లక్షలు, 59 మందికి రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.3.35 కోట్ల బీమా చెల్లించారు. శాశ్వత వైకల్యం బారినపడ్డ 185 మందిలో 103 మందికి రూ.50వేల చొప్పున, 82 మందికి రూ.5లక్షల చొప్పున రూ.4.61 కోట్లు చెల్లించారు. దాంతోపాటు తాత్కాలిక వైకల్యం బారిన పడ్డ 203 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 20.30 లక్షల పరిహారాన్ని అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 434 కుటుంబాలకు పరిహారం అందింది. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 31 కుటుంబాలు ఎక్స్గ్రేషియా పొందాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన తమ కుటుంబాలకు సీఎం కేసీఆర్ సాయం గొప్ప ఆదెరువుగా నిలిచిందని లబ్ధిదారులు చెబుతున్నారు.
కేసీఆర్ సార్ది గొప్ప మనసు..
మా ఆయన కోల నర్సయ్య 40 ఏండ్లుగా కుల వృత్తి కొద్దిపాటి వ్యవసాయం 10 ఏండ్ల కింద తాటిచెట్టు పైనుంచి కింద పడగా విరిగింది. చాలా ఏండ్లు చెట్లు ఎక్కలేదు. అప్పట్లో ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. గతేడాది ఫిబ్రవరిలో మళ్లీ తాటిచెట్టు పైనుంచి పడితే ఆస్పత్రికి తీసుకెళ్లాం. 5 రోజుల తరువాత చనిపోయాడు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డం. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన మా కుటుంబానికి గీత కార్మిక బీమా కింద రూ.5లక్షల చెక్కు ఇచ్చిండ్రు. ఆ పైసలను బ్యాంకులో వేసుకుని వచ్చిన వడ్డీతో బతుకుతున్నాం. కేసీఆర్ సార్ది గొప్ప మనసు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కోల అంజమ్మ, వంగపల్లి, యాదగిరిగుట్ట మండలం
5 లక్షలే ఆదెరువైనయ్..
రెండేండ్ల క్రితం తాటిచెట్టు పైనుంచి పడి పూర్తిగా నడువరాని స్థితికి చేరుకున్నా. అప్పటి నుంచి ఇంటిపట్టునే ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. ఇటీవల అధికారులు వివరాలు తీసుకెళ్లారు. కానీ.. నాకు నమ్మకం లేకుండె. అప్పట్లో చాలా మంది ఇలా రాసుకుపోయారే తప్ప.. సాయం చేయలేదు. ఇప్పుడు రూ.5 లక్షల పరిహారం అందింది. ఆ డబ్బుతోనే జీవనం సాగిస్తున్నా.
– అంజయ్య, గీత కార్మికుడు, వస్తాకొండూర్
రైతుబీమా గీతన్న బీమా
రైతు బీమా తరహాలో అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక నుంచి గీత కార్మికుడు ఎలాంటి మరణం పొందినా, శాశ్వత వైకల్యం కలిగినా రైతుబీమా తరహాలో ఆ కుటుంబానికి నేరుగా బ్యాంకు ఖాతాలో బీమా డబ్బులు జమ అవుతాయి. ఇందుకు సంబంధించి గీత కార్మికుడి నామినీ వివరాలు, బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 17వేల మంది పైచిలుకు కల్లుగీత కార్మికులుండగా.. 14 వేల మంది నామినీ వివరాలు సేకరించాం. ప్రతి గీత కార్మికుడు తమ నామినీ వివరాలను స్థానిక ఎక్సైజ్ అధికారులకు అందజేయాలి.
– నవీన్కుమార్, జిల్లా ఎక్సైజ్ అధికారి, యాదాద్రి భువనగిరి