యాదాద్రి భువనగిరి, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం భువనగిరి మండలంలో 11.93 టీఎంసీల నీటి సామర్థ్యంతో బస్వాపూర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇప్పటికే 85 శాతం రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా బీఎ న్ తిమ్మాపూర్ మునిగిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.7.5 లక్షలను అందించింది. ఇంట్లో మేజర్ పిల్లలు ఉన్నా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 7.5 లక్షలను వర్తింపజేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.50 కోట్లతో 655 మందికి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చింది. ప్రస్తుతం బీఎన్ తిమ్మాపూర్లోని బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇంకా 401 మంది ప్యాకేజీ చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం రూ.34 కోట్ల దాకా అవసరం. ఇప్పుడు ఈ మొ త్తం నిధులను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది.
28లోగా బాధితులకు డబ్బు..!
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 34 కోట్లతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించనున్నారు. బుధవారం నిధులకు అప్రూవల్ ఇవ్వగా, ఇవి జిల్లా అకౌంట్లో జమ చేయడానికి 48 గంటల సమయం పడుతుంది. 27 వరకు జిల్లాకు డబ్బులు వస్తే.. ఈ నెల 28 వరకు ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నిధులు రాగానే బాధితులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిర్వాసితుల బ్యాంక్ వివరాలు సిద్ధంగా ఉంచారు. బాధితులతో సంతకాలు చేయించి పెట్టుకున్నారు. నిధులు రాగానే వెంటనే నిర్వాసితులకు చెల్లిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
లేఅవుట్ అభివృద్ధికి రూ. 35 కోట్లు..
తిమ్మాపూర్ నిర్వాసితుల కోసం ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు హుస్నాబాద్లో ఉన్న సర్వే నంబర్ 107లో భూమిని ప్రభుత్వం గుర్తించింది. 96 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధ్ది చేసింది. మొత్తంగా 1100 ప్లాట్లను చేయాలని నిర్ణయించారు. ఇందులో 1056మంది నిర్వాసితులకు ప్లాట్లను ఇవ్వనుంది. ఇప్పటికే 950 ప్లాట్లు సిద్ధంగా ఉన్నా యి. ఒక్కో కుటుంబానికి 200 గజాల చొప్పున సర్కారు అందించనుంది. అయితే ఈ ప్లాట్లను గ్రామసభ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ లేఅవుట్కు సంబంధించి కూడా బుధవారం రూ. 35 కోట్లు విడుదలయ్యాయి. ఈ డబ్బులను లేఅవుట్ అభివృద్ధికి వినియోగించనున్నారు.
ఎమ్మెల్యే ‘పైళ్ల’ ప్రత్యేక చొరవ..
కొంత కాలంగా బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులు పరిహారం కోసం ఆందోళన చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఇటీవల ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను పైళ్ల శేఖర్ రెడ్డి కలిశారు. నిధులు విడుదల చేయించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ఉన్న ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును కలిశారు. దగ్గరుండి మొత్తం రూ. 67కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేయించారు. మరో వైపు నిధుల విడుదలపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 67 కోట్లు విడుదలయ్యాయి..
బస్వాపూర్ ప్రాజెక్ట్ కింద బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు నిధుల కోసం ఇటీవల ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశాను. నిధుల విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాను. సీఎం సానుకూలంగా స్పందించారు. బుధవారం స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ప్రత్యేకంగా కలిసి ఫైల్ క్లియర్ చేయించాను. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, లేవుట్ అభివృద్ధి కోసం రూ. 67 కోట్లు విడుదలయ్యాయి. 48 గంటల్లో జిల్లా ఖాతాలో జమ అవుతాయి. నిధులు విడుదల చేయించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే