నల్లగొండ, జూన్ 6 : తలాపున కృష్ణమ్మ పారుతున్నా 70 ఏండ్లుగా సాగు నీటికి నోచుకోని నల్లగొండ కాలానుగుణంగా బీడు భూముల జిల్లాగా మారింది. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో తొమ్మిదేండ్లుగా ఈ ప్రాంతం నిత్యం జలసవ్వడితో మురుస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ద్వారా ఇక్కడి భూముల పరిస్థితి చూసినా సీఎం కేసీఆర్ రాష్ట్రం వస్తే ఏమవుతుంది..? అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో జరుగుతాయి..? మన ఆదాయం మనమే ఖర్చు చేసుకోవచ్చు..అని నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు అక్షరసత్యాలు అవుతున్నాయి.
స్వరాష్ట్రంలో కృష్ణా జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా రావాల్సిన కేటాయింపుల్లో వదులుకోకుండా సాధించి కొట్లాడి రెండు పంటలకు జిల్లాలోని ఎన్ఎస్పీ, ఎస్ఎల్బీసీ , హైలెవల్ కాల్వల ద్వారా సాగు నీరు ఇస్తుండడంతో 4.80 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతుంది. మిషన్ కాకతీయ ద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.353 కోట్లతో 1,399 చెరువుల్లో పూడికతీయడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగడంతో పాటు మరో లక్ష ఎకరాలకు ఈ సర్కార్ సాగు నీరందుతున్నది. తద్వారా బీడు భూములు కలిగిన నల్లగొండ నేడు సాగుభూముల జిల్లాగా మారి 24లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని చేతికందిస్తుంది. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పూడిక తీయబడిన చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం సైతం గణనీయంగా పెరిగింది. ఇక చెక్ డ్యామ్ల నిర్మాణాలతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలకు 16 వేల కోట్లకు పైగా వెచ్చించి సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో నడిపిస్తుంది.
10 వేల ఎకరాలు సాగులోకి..
గతంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల కింద 73 వేల ఎకరాల్లో సాగు అవుతుండగా పునరుద్ధరణ తర్వాత 90వేల ఎకరాలకు పెరిగింది. పంట దిగుబడి గతంలో ఏటా ఆయా చెరువుల పరిధిలో 1.74లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ప్రస్తుతం 2.58లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఇక చెక్ డ్యామ్ల నిర్మాణం తర్వాత 131 ఎంసీఎఫ్టీల నీటి నిల్వ సామర్థ్యం పెరగ్గా వాటి పరిధిలో మరో 10వేల ఎకరాల్లో ఉన్న భూములు సాగులోకి వచ్చాయి. ఈ చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల వర్షం రూపంలో లేదంటే కాల్వల ద్వారా వచ్చిన నీరు వృధాకాకుండా అక్కడే ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు ఉబికి పోస్తున్నాయి. దాంతో బోరు బావుల కింద ఉన్న ప్రతి గుంట కూడా సాగులోకి వచ్చింది.
చెరువుల పునరుద్ధరణతో పెరిగిన భూగర్భ జలాలు
ఉమ్మడి రాష్ర్టంలో చెరువులు ఆదరణకు నోచుకోకపోవడంతో స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధ్దరణ చేపట్టి వాటి రూపు రేఖలను మార్చింది. జిల్లా వ్యాప్తంగా 2,305 చెరువులు ఉండగా వాటిలో 1,399 చెరువులను రూ.353.58 కోట్లు వెచ్చించి పునరుద్ధరణ చేపట్టింది. దాంతో ప్రతి గ్రామంలో భూగర్భ జలాలు మూడు నుంచి ఆరు మీటర్ల వరకు పెరిగాయి. గతంలో ఆయా చెరువుల్లో 11,344 ఎంసీఎఫ్టీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే పునరుద్ధరణ తర్వాత 15,320 ఎంసీఎఫ్టీల సామర్థ్యానికి పెరిగింది. ఇక జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో 39 చెక్ డ్యామ్లను నిర్మించిన ప్రభుత్వం అందుకు రూ.63.84 కోట్లు వెచ్చిచింది.
5.80 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు..
కృష్ణా నది నల్లగొండ నుంచి పారుతున్నప్పటికీ గతంలో ఈ జిల్లాకు ఏ ఒక్క ఏడాది కూడా రెండు పంటలకు నీరిచ్చిన ఘటనలు లేవు. ఈ నేపథ్యంలో నల్లగొండలో భూములు క్రమంగా పెరిగాయి. సీఎం కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.80లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ప్రతి సీజన్లో 2.20లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ద్వారా హై లెవల్ కాల్వ ద్వారా 2.20 లక్షల ఎకరాలకు, లో లెవల్ కాల్వ ద్వారా 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. ఇక ఆయా కాల్వల ద్వారా సీజనల్గా నీటి విడుదల చేసి ప్రతి చెరువు నింపుతున్న నేపథ్యంలో ఆయా చెరువుల కింద ఉన్న మరో 99,500 ఎకరాలు సాగు లోకి వచ్చి వరి విరివిగా పండుతుంది.
16వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తి పోతల పథకాలు..
ఎన్ఎస్పీ, ఎస్ఎల్బీసీ ద్వారా జిల్లాలో అన్ని ప్రాంతాలకు సాగు నీరు అందకపోవడంతో ప్రబుత్వం అన్ని ప్రాంతాలకు ఇవ్వాలనే ఆలోచనతో వేల కోట్లు వెచ్చించి సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టింది. గతంలో పెండింగ్లో ఉన్న వాటితో పాటు కొన్ని కొత్త ప్రాజెక్టులు సైతం నిర్మించడానికి జిల్లా వ్యాప్తంగా 16 వేల కోట్లకు పైగా వెచ్చిస్తుంది. వాటిలో డిండి ఎత్తిపోతలకు రూ.6,190 కోట్లు కేటాయించిన సర్కార్, ఎస్ఎల్బీసీ సొరంగానికి రూ.3,152 కోట్లు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు రూ.1,764కోట్లు, పెండ్లి పాకలకు రూ.343కోట్లు, అక్కంపల్లికి రూ.90 కోట్లు, పెద్ద గట్టుతండా ప్రాజెక్టుకు రూ.82కోట్లు, పొగిల్ల ప్రాజెక్టుకు రూ.24 కోట్లు, కంబాలపల్లి ప్రాజెక్టుకు రూ.202కోట్లు, అంబ భవాని ప్రాజెక్టుకు రూ.184 కోట్లు, పిల్లాయిపల్లికి రూ.96 కోట్లు, ధర్మారెడ్డి కాల్వకు రూ.18.53 కోట్లు, ఉదయసముద్రం ఎత్తి పోతలకు రూ.561కోట్లు, అయిటి పాములకు రూ.101 కోట్లు, శివన్న గూడెం ప్రాజెక్టుకు రూ.1,825 కోట్లు, కిష్టరాయిపల్లికి రూ.1,074 కోట్లు కేటాయించి పనుల చేపడుతున్నది. ఇక ఇటీవల నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో కొండ్రపోల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు రూ.75 కోట్లు కేటాయించిన ప్రభుత్వం బొత్తల పాలెం ఎత్తి పోతలకు రూ.229 కోట్లు, దున్న పోతుల గండికి రూ.219 కోట్లు, వీర్లపాలెం లిఫ్ట్కు రూ.32 కోట్లు, వేములపల్లి లిఫ్ట్కు రూ.9 కోట్లు, ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్కు రూ.16 కోట్లు కేటాయించి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మరో రెండు నాలుగు లక్షల ఎకరాల మేరకు సాగులోకి రానుంది.
రూ. 16 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు
రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్లలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూపా య వేల కోట్ల రూపాయలు కేటాయించి పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ప్రారంభంలోనే మిషన్ కాకతీయ పథకం ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధ్దరణతో లక్ష ఎకరాల దాకా సాగులోకి రావడంతో పాటు చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా జిల్లా అంతటా సాగు నీరు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం సుమారు రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించి కొన్ని కొత్త ప్రాజెక్టులతో పాటు పెండింగ్ ప్రాజక్టుల పనులు చేపడుతున్నది.
– అజయ్ కుమార్, సీఈ, ఇరిగేషన్, నల్లగొండ