సూర్యాపేట, మే 10 (నమస్తే తెలంగాణ) : పంట పెట్టుబడికి రంది లేకుండా చేసేందుకు అన్నదాతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.10 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రైతు బంధు సక్రమంగా అమలు కావడం లేదు. ఎన్నికల ముందు ఆ పార్టీ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.15 వేల ఇస్తామని హామీ ఇవ్వగా అదీ నెరవేరలేదు. రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కారు మొత్తానికే ఎత్తివేసే కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
‘ఐదెకరాల లోపు వారికే ఇస్తాం, సాగు చేసిన భూములకు మాత్రమే ఇస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు పదేపదే రైతు భరోసాపై విరుద్ధ ప్రకటనలు చేయడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల కోసం కాళేశ్వరాన్ని పండబెట్టి, అవకాశం ఉన్నా నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయకుండా రైతులపై స్వయం ప్రకటిత కరువును రుద్దిన కాంగ్రెస్ సర్కారు మరోపక్క సాగు చేస్తేనే పంట పెట్టుబడి సాయం ఇస్తామనడంపై వ్యవసాయాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నట్లు అర్థమవుతున్నది. సాగు చేసే రైతులకే మొండి చెయ్యి చూపిస్తున్న రేవంత్రెడ్డి సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు ఎలా రైతు భరోసా ఇస్తుందో మరీ.
2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు ద్వారా నిరంతరాయంగా 11 సీజన్లకు పంట పెట్టుబడి సాయం అందించారు. ఉమ్మడి నల్లగొడ జిల్లాలో సుమారు 22 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుల బాంకు అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. దాంతో పంట పెట్టుబడికి వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే పరిస్థితి రైతులకు తప్పింది. రైతు బంధు సాయం చేయడంతోపాటు పండిన ధాన్యాన్ని కూడా కేసీఆర్ సర్కారు కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్నది.
కానీ నాలుగున్నర నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ యాసంగి సీజన్ పూర్తయి పంటలు చేతికి అందినా ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఐదెకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు బంధు వచ్చింది. మరో నెల రోజులైతే వానకాలం సీజన్ ప్రారంభం కానుండగా రెండు సీజన్లకు సంబంధించి రైతు బంధు ఇస్తుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కొత్తగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇస్తుందా.. ఉన్నదానికే కొర్రీలు పెట్టి బంద్ చేసే కుట్ర పన్నుతుందా? అనేదానిపై రైతుల్లో ఆందోళన మొదలైంది.
అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పంట సాయం బ్యాంకు ఖాతాల్లో వేస్తానని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ ఇవ్వకుండా రైతులను మోసం చేసిండు. పంటలు సాగు చేసేందుకు అప్పులు తెచ్చినం. వాటికి మిత్తి పెరిగి మాకు భారమవుతోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ పంట వేయడానికి ముందే మా ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసేది. దాంతో పంట పెట్టుబడికి అప్పులు తెచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు. రైతుబంధు లేదు.. ధాన్యం సరిగా కొంటలేరు.. ముఖ్యమంత్రికి వాళ్ల గుంపును చూసుకోవడం తప్ప రైతుల పట్ల ఎలాంటి ఆలోచనా లేదు. చెక్డ్యాంలను అలానే వదిలిపెట్టిండు. ఇలాంటి ముఖ్యమంత్రికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెబుతం.
– కందిమళ్ల నరేందర్రెడ్డి, రైతు, మాడ్గులపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సాయం సీజన్ మొదట్లో కాకుండా పంట కోతలు పూర్తయ్యాక ఇవ్వడం సరికాదు. పంటలు సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు అప్పు చేయాల్సి వస్తున్నది. పంట దిగుబడి సరిగా రాకపోతే అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తది. గత కేసీఆర్ ప్రభుత్వం సీజన్లో పంటల సాగుకు ముందే రైతుబంధు సాయం అందించడంతో రైతులకు అప్పుల బాధలు లేకుండా పోయాయి. కానీ ఇప్పటి సీఎం రేవంత్రెడ్డి పంటలు పూర్తయ్యాక రైతుబంధు సాయం అందిస్తానంటున్నరు. ఇలా చేస్తే రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదు.
-సోమిరెడ్డి పెద వెంకట్రెడ్డి, రైతు, ఆత్మకూర్.ఎస్