మొయినాబాద్, ఆగస్టు 4: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్లోని ఎన్టీఆర్ మోడల్ పాఠశాలో ఆహారం, నీరు కలుషితమై 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థినుల తల్లిదండ్రుల వివరాల మేరకు.. బాలికల వసతిగృహంలో ఉంటూ మోడల్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు గత ఐదు రోజులుగా వాంతులు, విరేచనాలు చేసుకుంటున్నారు. విషయం తెలిసిన కొందరు తల్లిదండ్రులు వెంటనే హాస్టల్కు పరుగులు పెట్టి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లి వైద్యసేవలందించారు.
కొంతమంది తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో ఉండటం, కొంతమందికి తల్లిదండ్రులు లేకపోవడంతో పాఠశాల యాజమాన్యం వారిని గుట్టుచప్పుడు కాకుండా మొయినాబాద్లో ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యసేవలు అందించారు. 50 మంది వరకు వాంతులు, విరేచనాలు చోటుచేసుకోవడంతో మిగతా విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. నీళ్లు, ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిద్రలేమితోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని యాజమాన్యం పేర్కొనడంపై పాఠశాల, వసతిగృహం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.