PM Modi | కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యుడి బతుకు భారమైంది. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నిత్యావసరాల ధరలు ఎనిమిదేండ్లలో 20నుంచి 50శాతం వరకు పెరిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, టోల్ చార్జీలు, మెడిసిన్, నిత్యావసర వస్తువుల ధరలను మరింత పెంచింది. దీంతోపాటు గ్రామాల్లో వేసవిలో పేదలకు ఆదెరువుగా ఉన్న ఉపాధి హామీ పనుల్లోనూ కోత విధించింది. ఫలితంగా గ్రామీణ ప్రజల ఆదాయం మరింత దిగజారింది.
– చౌటుప్పల్ రూరల్, మే 21
ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసింది. 2014లో ముడి చమురు ధర బ్యారల్కు అత్యధికంగా 107.95 డాలర్లు, అత్యల్పంగా 95.14 డాలర్లు ఉండగా.. దేశీయంగా పెట్రోల్ లీటర్ ధర రూ.71.41, డీజిల్ 55.49 రూపాయలు ఉన్నది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు మార్చి 31న బ్యారల్కు 75.67 డాలర్లు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.109.58, డీజిల్ 97.73 రూపాయలు ఉన్నది. గత ప్రభుత్యాలు సబ్సిడీలు అందించి ప్రజలపై పెట్రో భారం పడకుండా చర్యలు చేపట్టేవి. బీజేపీ సర్కారు మాత్రం చమురు కంపెనీలకు పెత్తనం అప్పగించి చేతులు దులుపుకొన్నది. చమురు రేట్లను నియత్రించకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది.
ఎరువుల సబ్సిడీలో కోత
ఎరువులకు ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం 22.25 శాతం కోత విధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,25,200.16కోట్ల సబ్సిడీ ఇవ్వగా.. ఈ సంవత్సరం 1,75,099.92 కోట్లకు తగ్గించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. దాంతో ఎరువుల ధరలు మరింత పెరిగి అన్నదాతపై అదనపు భారం పడనుంది.
మందుల ధరల మోత..
కేంద్ర ప్రభుత్వం మెడిసిన్ ధరలను సైతం పెంచి జనం నెత్తిన మరో భారం మోపింది. దాంతో జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి వెళ్లినా జేబులు గుల్ల కావలసిందే. జ్వరం, బీపీ, గుండె జబ్బులు, చర్మ సంబంధిత, అనీమియా, క్యాన్సర్, యాంటీ బయోటిక్, పెయిన్ కిల్లర్ సహా 800 రకాల మందు గోలీలపై కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 10.7శాతం ధరలు పెంచింది.
ఉపాధిహామీ పని దినాల తగ్గింపు
గ్రామాల్లో వేసవిలో ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ పథకానికి కేంద్ర బడ్జెట్లో 33శాతం నిధులను తగ్గించింది. 2023-24 బడ్జెట్లో ఈ పథకానికి రూ.60వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఫలితంగా కూలీల పని దినాల సంఖ్య తగ్గనుంది.
టోల్ చార్జీల బాదుడు
టోల్ప్లాజాల వద్ద కమర్షియల్ వాహనాలకు గతంలో సింగిల్ జర్నీకి రూ.140 ఉండగా.. ప్రసుతం 150 రూపాయలకు పెరిగింది. ట్రక్కు, బస్సులకు రూ.290 నుంచి రూ.305కు పెంచడంతో నిత్యావసరాలతోపాటు కూరగాయలు, రవాణా చార్జీలు మరింత పెరుగనున్నాయి. ఆధిక బరువు మిషనరీ వాహనాలకు రూ.450నుంచి రూ.475కు, ఓవర్ సైజ్ వెహికిల్స్కు రూ.560 నుంచి రూ.590కి పెంచారు. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటర్ వాహనాల టోల్ చార్జీలు రూ.90నుంచి 95 రూపాయలకు పెరిగాయి. ఈ చార్జీలు ఆయా టోల్గేట్లలో వేర్వేరుగా ఉన్నాయి.
144 శాతం పెరిగిన వంట గ్యాస్
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎనిమిదేండ్లలో వంట గ్యాస్ ధర 144 శాతం పెంచి వినియోగదారులపై గుది బండ మోపింది. 2014లో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.410 ఉండగా.. ఇప్పుడు 1190 రూపాయలకు పెరిగింది. గత ప్రభుత్వంలో కనీసం సబ్సిడీ బ్యాంకులో డిపాజిట్ అయ్యేవి. ప్రస్తుతం ఆ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేశారు.