మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఆర్ధిక పురోభివృద్ధికి చేయూతను అందిస్తున్నది. స్వశక్తితో ఎదిగేందుకు విరివిగా స్త్రీనిధి రుణాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ లక్ష్య సాధనలో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే ముందున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 176.09 కోట్ల రుణ లక్ష్యానికి గానూ ఇప్పటివరకు రూ.150 కోట్లు అందించి రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచింది. దాదాపు 21 వేల సంఘాలు సర్కారు సాయంతో కుటీర పరిశ్రమలు, సొంత ఉపాధి మార్గాలు ఏర్పాటు చేసుకుని నిలదొక్కుకుంటున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండ్రోజులు గడువు ఉండగా.. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా 4వ స్థానంలో, యాదాద్రి భువనగిరి జిల్లా 17వ స్థానంలో ఉన్నాయి.
– సూర్యాపేట, మార్చి 28
సూర్యాపేట, మార్చి 27 : మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. 90 పైసల వడ్డీతో శ్రీనిధి రుణాలను ఇస్తూ వారు కోరుకున్న రంగంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాడానికి ప్రొత్సహిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విరివిరిగా రుణాలు అందించి రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.176.09 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు దాదాపు రూ.150 కోట్లు అందించింది. 21 వేల సంఘాలకు రుణాలు అందించడం జరిగింది. రుణాలు అందించడంలో నల్గొండ జిల్లా 4వ స్థానంలో ఉండగా యాదాద్రి జిల్లా 17వ స్థానంలో నిలిచింది. మార్చి 31 నాటికి వంద శాతం రుణాలు పైగా అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో దాదాపు 26 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలను మంజూరు చేశారు. ఈ రుణాల్లో అధికంగా కిరాణం, డైయిరీ, కోళ్ల ఫామ్తో పాటు ఇతర కుటిర పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. నిత్యం ప్రజలకు ఉపయోగపడే పాలు, కిరాణం దుకాణాల ఏర్పాటుకు మహిళలు ముందుకు వచ్చారు. రూ.40 వేల నుంచి 3 లక్షలతో కిరాణా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. పాల ఉత్పత్తులతో పాటు మాసం ఉత్పత్తులకు సైతం స్త్రీ నిధి రుణాలు వినియోగిస్తున్నారు. కోళ్ల ఫామ్తో పాటు చిన్నపాటి కుటీర పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 31 మందికి రూ.3 లక్షల చొప్పున 93 లక్షల వరకు సౌభాగ్య వ్యక్తిగత రుణాలు అందించారు. గతంలో జిల్లాలోని ఆరు మండల సమాఖ్యలకు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేయడం జరిగింది. నేరేడుచర్ల, మునగాల, నూతనకల్ మండల సమాఖ్యలకు రూ.25 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేసి వరికోత మిషన్ల అందించడం జరిగింది. వీటితో పాటు మోతె, ఆత్మకూర్(ఎస్), తుంగతుర్తి సమాఖ్యలకు రూ.16.50 లక్షలతో ట్రాక్టర్తో పాటు వరి పనులకు సంబంధించిన మిషనరీని అందించారు.
రాష్ట్రంలోనే నంబర్ వన్ సూర్యాపేట
మహిళా సంఘాలకు రుణాలు అందించడంలో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.176.09 కోట్ల రుణాల టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 150 కోట్ల రుణాలు అందిచడంతో దాదాపు 85 శాతం లక్ష్యం పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లా రూ.154.38 టార్గెట్కు గాను రూ.127 కోట్ల రుణాలు అందించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా రూ.102.37 కోట్ల లక్ష్యానికి గాను రూ.67.62 కోట్ల రుణాలు అందించి 17వ స్థానంలో ఉంది. గత నాలుగేండ్లుగా రుణాలు అందిచడంలో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది.
టార్గెట్ మించి రుణాలు
జిల్లాలో అవసరం ఉన్న ప్రతి సంఘానికి స్త్రీ నిధి రుణాలు అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అత్యధికంగా రుణాలు తీసుకున్న వారు కిరాణం, డెయిరీ ఫామ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి సుమారు రూ.180 కోట్ల రుణాలు ఇచ్చే అవకాశం ఉంది.
– సుందరి కిరణ్కుమార్, పీడీ జిల్లా గ్రామీణాభివృద్ధి