మిర్యాలగూడ రూరల్, జనవరి 26 : కొడుకు మరణానికి కారణాలు తెలుపాలంటూ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన జవాన్ తల్లి గురువారం గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. తడకమళ్లకు చెందిన పగిళ్ల జానయ్య, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు పగిళ్ల వెంకన్న(38) పఠాన్కోట్ రెజ్మెంట్లో జవాన్గా పని చేస్తూ 2021 మార్చి 3న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు మృతి చెందిన బాధతో జానయ్య కూడా కొద్ది కాలానికే మృతి చెందాడు.
పెద్ద కొడుకు బతుకు దెరువు కోసం హైదరాబాద్కు వెళ్లిపోయాడు. లక్ష్మమ్మ గ్రామంలోనే ఉంటూ కూలీగా జీవనం సాగిస్తున్నది. అయితే తన కొడుకు ఎలా చనిపోయాడనేది అధికారులు ఎవరూ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అయితే తన కొడుకు మృతికి కారణాలు తెలుపాలంటూ ఆమె గ్రామ ఆర్చీవద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తల్లిప్రేమను చాటి చెబుతున్నది.