ఉమ్మడి జిల్లా మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్లనుంది. టీఆర్ఎస్ సర్కారు సాయంతో వివిధ రంగాల్లో ప్రగతి పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగా నాలుగు బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరు కానున్నాయి. దీనికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నట్లు తెలిసింది. దీనిద్వారా నేతన్నలకు అనేక విధాలుగా లబ్ధి చేకూరనున్నది. చండూరుకు రూ. 30 కోట్లు, చౌటుప్పల్కు రూ.50 కోట్లు మంజూరు చేయడంతో ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. చండూరు రెవెన్యూ డివిజన్గా మారనుండడంతో ప్రజలకు దూరభారం తగ్గనున్నది. దండు మల్కాపురంలో బొమ్మల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. నారాయణపురంలో గిరిజన గురుకులం, బంజారాభవన్ ఏర్పాటుతో గిరిజనులకు స్థానికంగా లబ్ధి చేకూరనున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లాకు వివిధ పరిశ్రమలు, వసతులు దక్కనుండడంపై జిల్లా ప్రజలు సంతోషం
వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మునుగోడులో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని భువనగిరి, సంస్థాన్ నారాయణపురంలో బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్, తేరట్పల్లిలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన చర్యలు ఇప్పటికే ప్రారంభం కాగా.. ఢిల్లీకి ప్రతిపాదనలు వెళ్లాయి. ఒకటి, రెండు రోజుల్లో మంజూరు ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే నేత కార్మికులకు అనేక విధాలుగా లబ్ధి చేకూరనుంది. సంఘం ఏర్పాటుకు రూ.50లక్షలు రానున్నాయి. 90శాతం సబ్సిడీతో మగ్గం, ఇతర పనిముట్లు అందనున్నాయి. కార్మికుల ఇంటి వద్ద స్థలం ఉంటే లూమ్ కోసం వర్క్షెడ్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం రూ. 1.20లక్షలు గ్రాంట్ వస్తుంది.
బొమ్మల తయారీ పరిశ్రమ
ఇప్పటికే పరిశ్రమల రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన జిల్లా సిగలో మరో కలికితురాయి రానుంది. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో బొమ్మల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సుమారు వంద ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దాంతో 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా మన దగ్గరి నుంచి బొమ్మలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి కానున్నాయి. ఫలితంగా చౌటుప్పల్ పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది.
మారనున్న చౌటుప్పల్ రూపురేఖలు
చౌటుప్పల్ మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోనున్నాయి. ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి జరుగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లను సర్కారు విడుదల చేయనుంది. అదేవిధంగా చండూరు మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు రానున్నాయి. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైపులైన్, రోడ్లు తదితర పనులు జరుగనున్నాయి. దాంతో పట్టణంతోపాటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలు కూడా ప్రగతి పథంలో దూసుకెళ్లనున్నాయి.
‘సంస్థాన్’కు కొత్త రూపు
గిరిజనులు అధికంగా ఉండే సంస్థాన్ నారాయణపురం మండలం దశ దిశ మారనుంది. మునుగోడు నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి రూ.25కోట్లు ఇవ్వనున్నారు. నారాయణపురం మండలంలో అత్యధికంగా తండాలున్నాయి. ఇవే కాకుండా రోడ్లకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని మునుగోడు సమీక్షలో మంత్రులు ప్రకటించారు. అన్ని గ్రామపంచాయతీలకు కనెక్టివిటీ రోడ్లు వేయడంతోపాటు పరిపాలన భవనాలను నిర్మించనున్నారు. ఇక నారాయణపురంలో ఏర్పాటు కానున్న గిరిజన గురుకులంతో గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
బొమ్మల పరిశ్రమతో మరింత ప్రగతి
దండు మల్కాపురంలో బొమ్మల తయారీ పరిశ్రమను నెలకొల్పడం హర్షణీయం. ఈ పరిశ్రమతో సుమారు 10వేల మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం బొమ్మల పరిశ్రమతో మరింత ప్రగతి సాధించనుంది. దాంతో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం బొమ్మల హబ్గా మారనుంది.
– ఒంటెద్దు లింగస్వామి, కుంట్లగూడెం, చౌటుప్పల్ మండలం