నీలగిరి, సెప్టెంబర్ 30 : నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఐటీ హబ్ నిర్మాణం చరిత్రలో నిలిచేలా పూర్తి చేసినట్లు, సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. ఐటీ హబ్ పనులను మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అక్టోబర్ 2న నల్లగొండ పట్టణంలో సుమారు రూ.912 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారని, ఇప్పటికే పూర్తి చేసిన పనులను ప్రారంభిస్తారని అన్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద 118 కోట్ల రూపాయలతో చేపట్టిన డివైడర్స్, లైటింగ్, జంక్షన్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపారు.
రూ.87 కోట్లతో చేపట్టే అంతర్గత రోడ్ల పనులకు శంకుస్థాపనలు అక్కడే చేస్తారని చెప్పారు. అనంతరం ఎన్జీ కళాశాల సమీపంలో రూ.8.05 కోట్లతో చేపట్టే వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడి నుంచి క్లాక్టవర్ సెంటర్కు చేరుకొని రూ.234 కోట్లతో చేపట్టనున్న కళాభారతి, ఉదయసముద్రం ట్యాంక్బండ్, వల్లభరావు చెరువు నెక్లెస్ రోడ్, ఐటీ హబ్ నుంచి ఉదయ సముద్రం వరకు ట్యాంక్బండ్ రోడ్డు, చాయా, పచ్చల సోమేశ్వర దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. 216 కోట్ల రూపాయలతో యూజీడీ పనులకు, రూ.56 కోట్లతో పట్టణంలో మిగిలి పోయిన ప్రాంతాలకు తాగునీరు పనులు, ఆరు సూట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం, కార్యాలయం, రూ.36 కోట్లతో ఎన్జీ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
నల్లగొండ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో రూ.1300 నుంచి 1400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అన్ని పనులను సంవత్సరం నుంచి రెండేండ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పార్టీ నాయకులు బకరం వెంకన్న, జమాల్ ఖాద్రీ, రావుల శ్రీనివాస్రెడ్డి, సందినేని జనార్దన్రావు ఉన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. మర్రిగూడ బైపాస్, ఐటీ హబ్, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ పనులు, ఎన్జీ కళాశాల భవనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో ఐటీ హబ్ ప్రారంభం కావడంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ నియంత్రణకు చర్య లు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, డీఎస్పీ శ్రీధర్రెడ్డి ఉన్నారు.