మిర్యాలగూడ, జూలై10 : గంజాయి అక్రమ రవాణా.. విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ రవాణాదారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తున్నది. అయినా కొంత మంది తమ స్వార్థం కోసం యువతను గంజాయికి బానిసలా మారుస్తున్నారు. దాంతో గంజాయి వాడకం చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కళాశాల విద్యార్థులు, యువకులే దీనికి బానిసలవుతూ ఆ మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తమ పిల్లల వైఖరిని ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసులు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రా నుంచి అక్రమ రవాణా
ఆంధ్రా రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో గంజాయి మిర్యాలగూడ పట్టణానికి సరఫరా అవుతున్నది. దాచేపల్లి సమీపంలోని గ్రామాల నుంచి కిలో రూ.15 వేల చొప్పున తీసుకొచ్చి దానిని చిన్ని, చిన్న పాకెట్లలో నింపి ఒక్కో ప్యాకెట్ రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గంజాయి మత్తుకు అలవాటుపడిన యువకులే నేరుగా మిర్యాలగూడ నుంచి ఆధ్రాకు ద్విచక్ర వాహనాలపై వెళ్లి కొనుగోలు చేసి తెస్తున్నారు. ఎక్కువగా ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులు గంజాయికి అలవాటుపడుతున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఇటీవల పట్టుబడిన ముఠాను విచారించిన పోలీసులకు మతిపోగొట్టే వాస్తవాలు తెలిశాయి.
కొనుగోలు దారుల
బైక్లకు ప్రత్యేక కోడ్ గంజాయి కొనుగోలుకు వచ్చే వారి బైక్లపై గంజాయి ఆకుల గుర్తులున్న స్టిక్కర్లను వేయిస్తున్నారు. ఈ గుర్తుల ఆధారంగా దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గంజాయి విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చిన గంజాయిని రవీంద్రనగర్, హనుమాన్పేట, నాగార్జుననగర్, గూడూరు, వెంకటాద్రిపాలెం, బైపాస్ రోడ్డు వెంట విక్రయిస్తున్నారు. వారి వద్ద గంజాయి కొనుగోలు కోసం వచ్చే యువకులు సైతం బైక్లపై ఉన్న ఆకుల గుర్తులు చూసే వారిని గుర్తించి గుట్టుగా కొనుగోలు చేస్తున్నారు.
గంజాయి మత్తులో దారిదోపిడీలు
గంజాయి మత్తుకు అలవాటు పడిన యువత జల్సాల కోసం దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవల మిర్యాలగూడ పట్టణ పరిధిలోని అద్దంకి- నార్కట్పల్లి బైపాస్ రోడ్డు సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఇద్దరిని స్కూటీపై వచ్చిన ముగ్గురు యువకులు అడ్డగించి దాడి చేసి వారి వద్ద ఉన్న రూ.25వేల నగదు, తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతో పాటు పట్టణంలోని పలుచోట్ల ఆటో, మూడు బైక్లు చోరీకి గురయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇటీవల పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఐదుగురు యువకులు రెండు స్కూటీల్లో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిని విచారిస్తే పలు చోట్ల దారిదోపిడీలు, బైక్ చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఇటీవల సీతారంపురానికి చెందిన యువకుడు జల్సాలకు అలవాటుపడి గంజాయి విక్రయిస్తూ పట్టుపడ్డాడు. మిర్యాలగూడ పరిసర గ్రామాల యువత సైతం గంజాయికి బానిసలుగా మారి గ్రామశివారులో అందరూ ఒక చోట చేరి గంజాయి వినియోగిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో గంజాయి మత్తులో కొంత మంది యువకులు పరస్పరం దాడులు చేసుకొని తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు వివరించారు.
ఆరోగ్యంపై చెడు ప్రభావం
గంజాయికి అలవాటుపడిన యువకులు.. చివరకు అది లేకుండా తాము ఉండలేమనే స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆ మత్తులో చెడు వ్యసనాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనించక పోవడంతో వారు చెడు సావాసాలతో గంజాయికి బానిసలుగా మారుతున్నారు. గంజాయి సేవించే వారికి చేతులు, కాళ్లు వనకడం, మాట తడపడడం చివరకు మానసిక వైకల్యంతో బాధపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టణానికి చెందిన కొంత మంది యువకులు ఇలాంటి స్థితిలో ఉండగా తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.