ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి మొత్తం 4,331 మంది రైతులకు సంబంధించిన 5,699 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా రూ.5.69 కోట్లు ప్రభుత్వం పరిహారంగా అందజేయనుంది. పంట నష్ట పరిహారం నిధులను రాష్ట్ర సర్కారు శుక్రవారం విడుదల చేసింది. ఈ నిధులు రైతు బంధు తరహాలోనే నేరుగా పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఒకటిరెండు రోజుల్లో జమ కానున్నట్లు తెలిసింది. దీంతో పంట నష్టపోయిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) : గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాలవర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంపై వెంటనే స్పందించిన సర్కార్ క్షేత్రస్థాయి సమగ్ర సర్వేకు ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్వయంగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించింది. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అంచనాలను రూపొందించారు. ఉమ్మడి జి ల్లాలోని యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వడగండ్లతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతినగా నల్లగొండ జిల్లాలో కొంత మేరకు నష్టం వాటిల్లింది. దీని ప్రకారమే అధికార యంత్రాంగాలు నష్టపోయిన పంటలను రైతుల వారీగా ఎన్ని ఎకరాలు, ఏఏ పంటలు అని క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమగ్ర నివేదికను రూపొందించారు.
ఈ నివేదికను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. ఇందుకు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 371 రైతులకు సంబంధించిన 371.24 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు నివేదిక ఇచ్చారు. దీనికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మొత్తం 37.16లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరీ చేసింది. ఇక సూర్యాపేట జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులకు పరిహారం అందనుంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 3,960 మంది రైతులకు చెందిన 5,328 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రూ.5.32 కోట్లను రైతులకు పరిహారంగా అందనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 మండలాల్లో 7476.01ఎకరాల్లో నష్టం వాటిల్లగా 6,470 మంది రైతులకు, రూ, 7,47,60250 కోట్ల పరిహారం అందనుంది.
ఒకటి, రెండు రోజుల్లో నష్టపరిహారం
ఈ పరిహారం డబ్బులను కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దళారులకు, ఇతర వ్యక్తుల ప్రమేయానికి దూరంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా రైతులకు చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం. రైతుబంధు డబ్బుల తరహాలోనే నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా పంట నష్టపరిహారాన్ని జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రైతుల వివరాలన్నీ సేకరించి పంపారు. ఈ మేరకు ఒకటి,రెండు రోజుల్లో పంట నష్టపరిహారం డబ్బులు నేరుగా బాధిత రైతులకు అందనున్నాయి. దాంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. గతంలో పంట నష్టపరిహారం అంటే దళారులు, మధ్యవర్తులే సగం నొక్కేసే వారన్నది నిజం. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిర్ణయంతో నిజంగా నష్టపోయిన రైతులకు ప్రతీ పైసా పరిహారం చేరనుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
4,331 మంది రైతులకు రూ.5.69 కోట్లు