తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీసింది. ఎక్కడికక్కడ చెక్డ్యామ్లు నిర్మించింది. దాంతో జలవనరులు పెరిగి చేపల పెంపకానికి అడుగులు పడ్డాయి. 2016 సంవత్సరం నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి ఏటా చెరువులు, జలాశయాల్లో విడుదల చేస్తున్నది.
సూర్యాపేట జిల్లాలో 848 చెరువులు ఉండగా 578 చెరువుల్లో ప్రతి సంవత్సరం 243.81 లక్షల చేప పిల్లలను పోస్తున్నది. 140కి పైగా మత్య్స సహకార సంఘాల ద్వారా 15,847 మంది మత్య్సకారులు ఉపాధి పొందుతున్నారు. ఏటా 520 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుండగా స్థానికంగా విక్రయించడమే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వలలు, బోట్లు అందించడంతోపాటు బీమా సౌకర్యం కల్పించడంతో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి.
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ క్రమంలో మత్స్యకారులకు ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నది. చేపలను అమ్ముకునేందుకు సబ్సిడీపై వాహనాలు, వలలు, ఇతర సామగ్రి అందించి అండగా ఉంటున్నది. చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతుండడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. దీంతో చేపలపై ఆధారపడి జీవనం సాగించేవారు స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. మత్స్యకారులు మంచి ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 578 చెరువుల్లో 243.81 లక్షల చేప పిల్లలు వేశారు. దీంతో ఏటా 520 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి వస్తుండగా.. 15,847 మంది మత్య్సకారులు జీవనోపాధి పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 విడుతల్లో చేప పిల్లలను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో 848 చెరువులు ఉండగా.. 578 చెరువుల్లో 243.81 లక్షల చేప పిల్లలను వదిలారు. దాంతో చేపల ఉత్పత్తి గణనీయంగా అవుతుండగా.. 140కి పైగా మత్స్య సహకార సంఘాల్లోని 15,847 మంది మత్స్య కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. అదేవిధంగా మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యం కూడా కల్పించాయి. దీని ద్వారా 18 నుంచి 70 ఏండ్లలోపు కార్మికులు చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదానికి గురైతే రూ.25వేలు బీమా అందుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వేయడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. దాంతో జిల్లాలో ప్రతి సంవత్సరం 520 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. మార్కెట్లో మన చేపలకు మంచి డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తూ మత్స్యకారులు మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రధానంగా కొర్రమీను, రవ్వ, బంగారు తీగ, బురకలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి.
మత్స్యకార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనే పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నది. ఇందులో భాగంగా చేపలను తరలించడానికి, ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవడానికి ఇబ్బందులు లేకుండా 70 శాతం సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, మినీ డీసీఎంలు అందజేసింది. అదేవిధంగా చేపల వేటకు అవసరమైన వలలు, ఇతర పరికరాలను సైతం అందిస్తున్నది.
గతంలో చేప పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు పోయేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ప్రతి సంవత్సరం లక్షకుపైగా చేప పిల్లలు ఉచితంగా ఇస్తుండ్రు. దాంతో చేప పిల్లల కోసం ఆంధ్రాకు పోయే బాధ తప్పింది. మేము చేపలు అమ్ముకునేందుకు ఒక బొలేరో, ఒక టాటా ఏస్, 18 టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాలు వచ్చాయి. మేము పట్టిన చేపలు ఈ వాహనాలపై తిరిగి అమ్ముకుంటున్నాం. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నాం. మత్స్య సంపద పెరుగడంతో హైదరాబాద్ చేపల మార్కెట్కు కూడా ఎగుమతి చేస్తున్నాం. జీవనోపాధి పొందడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. సంతోషంగా ఉన్నది.
– అంకిరెడ్డి లింగయ్య, మత్స్య సొసైటీ చైర్మన్, పర్సాయపల్లి, అర్వపల్లి మండలం