నల్లగొండ ప్రతినిధి, మే31(నమస్తే తెలంగాణ) : ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి. మండల కేంద్రంలోనే రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో రైతులకు దూరాభారం తగ్గడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. సేల్డీడ్, మ్యుటేషన్, పాస్ పుస్తకం అప్డేట్ ఇలా అన్ని ఓకే చోట, ఒకేసారి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియతోనే పూర్తవుతున్నాయి. దాంతో ఎలాంటి ఆపసోపాలకు తావులేకుండా పెద్ద ఎత్తున లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నెలకు సుమారు 10వేల వరకు వివిధ రకాల భూ సంబంధిత లావాదేవీలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లాను పరిశీలిస్తే ధరిణి పట్ల ఆదరణ స్పష్టమవుతున్నది. 32 మండలాల్లోని తాసీల్దార్ కార్యాలయాల్లో భూ సంబంధిత క్రయవిక్రయాల రిజిష్ర్టేషన్లు కొనసాగుతున్నాయి. ధరణి ప్రారంభమైన తర్వాత (2020 నవంబర్ 2వ తేదీ) నుంచి మంగళవారం నాటికి మొత్తం 1,39,572 ట్రాన్జాక్షన్లు జరిగినట్లు జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి వెల్లడించారు. దాదాపు 31 నెలల్లో నెలకు సగటున 4500 చొప్పున జరుగడం విశేషం. ఇందులో సేల్ అండ్ గిఫ్ట్ డీడ్ల సంఖ్యనే గణనీయంగా ఉన్నాయి. సేల్ అండ్ గిఫ్ట్ డీడ్లు 1,17924 జరగగా, నాలా కన్వర్షన్లు 3933 జరిగాయి. ఇక సక్సేషన్లు 14202, పార్టిషియన్ డీడ్స్ 3513 జరిగినట్లు వెల్లడించారు. గతంలో గిఫ్ట్ లేదా పార్టిషియన్ డీడ్లు పూర్తి కావాలంటే చాలా సమయం పట్టేది. కానీ ధరిణి ఆధారంగా భూ సంబంధిత లావాదేవీలన్నీ నిమిషాల్లోనే జరిగిపోతుండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ధరణి పోర్టల్లో ఉన్న సమాచారమే అన్నింటికీ మూలం కావడంతో ప్రతి పథకం నేరుగా లబ్ధిదారుడికే అందుతున్నది. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం డబ్బుల జమ, పంట నష్టపరిహారం చెల్లింపులు, పంటల సాగుపై సూచనలు, వాతావరణ అప్డేట్స్ ఇలా అన్నింటికీ ధరణి వివరాలే ఆధారం. ప్రతి ఏటా కొనుగోలు చేస్తున్న ధాన్యం డబ్బులను రైతులకు చెల్లించడంలోనూ ధరణి సమచారమే కీలకం. ప్రస్తుత యాసంగి సీజన్లోనూ రైతులు ధాన్యం అమ్మగానే వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేస్తున్నారు. దీని ఆధారంగా రైతు అమ్మిన ధాన్యం మోతాదుకు అనుగుణంగా నేరుగా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. దాంతో రైతులు ఒకసారి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి బయటికి వస్తే మళ్లీ వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. నేరుగా బ్యాంకుల నుంచే డబ్బులు డ్రా చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ధాన్యం అమ్మాక రైతులకు చిట్టీలు ఇచ్చే వారు. దీనికి అనుగుణంగా చెక్కులు అందజేస్తే వాటిని బ్యాంకులో వేస్తే నగదు డ్రాకు రోజుల తరబడి ఎదురు చూసే వారు. కనీసం నెల రోజులకు పైగానే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసేవారు. కానీ ప్రస్తుతం ధరిణి ధాన్యం రైతులకు వరంగా మారింది. ఇదే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఏ పంట డబ్బులైనా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయగలుగుతున్నారు. బహుళ ప్రయోజనాలు ముడిపడి ఉన్న ధరణిని వ్యతిరేకిస్తూ ఏకంగా రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలపై ప్రజలు, ముఖ్యంగా రైతులు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతల ఉద్దేశం ఎమిటని ప్రశ్నిస్తున్నారు. సమైక్య పాలన నాటి రోజులు తీసుకొచ్చి తిరిగి రైతులను, భూ యజమానులను అగాథంలోకి నెట్టాలనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణిని కాపాడుకుంటామని, సీఎం కేసీఆర్కు బాసటగా నిలుస్తామని సబ్బండ వర్గాలు ప్రకటిస్తున్నాయి.
ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు సులువుగా అవుతున్నాయి. అంతకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకొనేందుకు నల్లగొండ వెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. డబ్బులు, సమయం వృథా అయ్యేది. ఇప్పుడు ధరణితో తాసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని వెంటనే పట్టా పాస్పుస్తకం పొందుతున్నాం. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సామాన్యుడికి ఉపయోగకరంగా ఉంది. వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలు అన్ని ఆ పోర్టల్లో పొందుపర్చడం వల్ల వివాదాలకు తావులేకుండా పోయింది. రైతులకోసం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-పగడోజు శంకరచార్యులు, పొనుగోడు, కనగల్ మండలం
ధరణి వచ్చినంక ఎవరి భూములు వాళ్ల పేర్లపై ఎక్కినయి. గతంలో కొట్లాటలు, గెట్ల పంచాయతీలు ఉండేవి. ఇప్పుడవేమీ లేవు. చాలా వరకు తగ్గాయి. మళ్లీ ధరణి రద్దు చేస్తామని కొందరు నాయకులు అంటున్నరు. తీసేస్తే మళ్లీ పాత కథే అయితది. ఎవరి భూములు ఎవరి పేరు మీద మారుతయో తెలువదు. గతంలో భూమి రిజిస్ట్రేషన్కు పోతే పది వేల రూపాయల దాక ఖర్చయ్యేది. రిజిస్ట్రేషన్ చేస్తందుకు వచ్చే పెద్ద మనుసులకు బస్సు కిరాయిలు, తిండి ఖర్చులు అయ్యేవి. ఇంకా పైకెళ్లి మస్తుగా అయ్యేవి. ధరణి వచ్చినంక తాసీల్దార్ ఆఫీసులనే రిజిస్ట్రేషన్ చేస్తున్నరు. ఎవరికీ పైసా కూడా లంచం ఇవ్వకుండా పని చేస్తున్నరు. పావుగంటలనే పట్టా కాగితాలు ఇస్తున్నరు. ఇంతకంటే మంచిగా ఏమున్నది. ముఖ్యమంత్రి రైతుల కోసం ఆలోచించి తీసుకొచ్చిన ధరణితోనే సులువుగా పని అవుతున్నది. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్ముకుంటే ఆగమే. తమ స్వార్థం కోసం వారు రైతులను ఇబ్బందులు పెట్టేలా మాట్లాడుతున్నరు. ధరణి ద్వారా వచ్చిన పట్టా కాగితాలు చూసే నాకు రైతు బంధు డబ్బులు పడుతున్నయి.
– నల్లగాసు రాములు, రైతు, వైదోనివంపు, దేవరకొండ మండలం
మేము ఆరుగురం అన్నదమ్ముళ్లం. మా నాన్న పేరుమీద ఉన్న 4.20 ఎకరాలు భూమిని అన్నదమ్ముళ్లం పంచుకున్నాం. ఒక్కొక్కరి పేరుమీద 30 గుంటలు చొప్పున ధరణి పోర్టర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. సాయంత్రం స్లాట్ బుక్ చేసుకున్నం. మరుసటి రోజు ఉదయం తాసీల్దార్ ఆఫీసుకు వెళితే గంటలోపే ఆరుగురి పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. పది వేల లోపే ఖర్చు వచ్చింది. భూ మార్పిడి జరిగి వెంటనే మ్యుటేషన్ కూడా అయ్యింది. ఎవ్వరికీ కనీసం చాయ్ కూడా తాపించాల్సిన అవసరం రాలేదు. గతంలో ఆరుగురి పేరుమీద రిజిస్ట్రేషన్ జరిగి పట్టా పాస్ పుస్తకాలు చేతికి అందాలంటే పెద్ద తంతు ఉండేది. ఎంత లేదన్నా సంవత్సరం పట్టేది. రూ.30 వేల వరకు ఖర్చు వచ్చేది. నెలల తరబడి ఆఫీసుల చూట్టూ తిరగాల్సి వచ్చేది. ఎంతో మందికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణితో మా పని సులువుగా అయిపోయింది. ఇప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే వెంటనే సర్వే నంబర్ కొట్టగానే భూమి ఎవరిపేరు మీద ఉందో తెలిసిపోతున్నది. ధరణితో డబ్బులు, సమయం, దళారుల చుట్టూ తిరుగుడు బాధ పోయింది. రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది.
– బొబ్బెల మల్లేశ్, రైతు, తిరుమలగిరి
పాతూరు గ్రామ శివారులో సర్వే నంబర్ 738లో నాకు ఎకరన్నర భూమి ఉంది. నాకు ఇద్దరు కొడుకులు. నా పేరున ఉన్న భూమిలోంచి ఇద్దరు కొడుకులకు చెరో 20 గుంటలు పట్టా చేయించిన. ఎవ్వరి సాయం లేకుండానే పనైపోయింది. రెండు రోజుల కింద మీ సేవలో స్లాట్ బుక్ చేయించుకున్నం. ఇయ్యాల తాసీల్దార్ కార్యాలయానికి వచ్చినం. మా దగ్గర ఉన్న పత్రాలను చూసి, ఒక ఫొటో తీసుకొని, సంతకాలు చేయించుకొని, నా పేరున ఉన్న భూమిని నా కోడుకుల పేరున రిజిస్ట్రేషన్ చేసినరు. ఇంత తొందరగా అయ్యిందంటే నేనే నమ్మలేక పోయిన. గవర్నమెంట్ తీసుకొచ్చిన ధరణితో మాలాంటి రైతుల పని సులువైంది. దళారులు బాధ తప్పింది. అరగంటలోనే పనైపోయింది. గప్పట్లో భూమి అమ్మలన్నా.. కొనాలన్నా& పిల్లల పేరున ఎక్కించాలన్నా రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. మధ్యవర్తి ద్వారా పట్వారీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. గిప్పుడు అవేమీ అవసరం లేకుండా పని పూర్తి చేసుకున్నం.
ఓర్సు మైసయ్య, పాతూరు, నల్లగొండ మండలం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తోనే రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. రికార్డులన్నీ ఆన్లైన్లోకి ఎక్కాయి. ధరణి భూములకు రక్షణగా ఉంటున్నది. భూముల వివరాలను ఎప్పటికప్పుడు తెలసుకునేందుకు ధరణి పోర్టల్ ఎంతో ఉపయోగపడుతున్నది. గతంలో మాదిరిగా అధికారుల చుట్టూ తిరిగి భూముల వివరాలను తెలుసుకునే పరిస్థితి లేదు. గతంలో భూమి కొన్నప్పుడు రిజిస్టర్ చేయించుకునేందుకు 20 కిలోమీటర్ల దూరం ఉన్న హుజూర్నగర్కు వెళ్లేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు వద్ద పడిగాపులు కాసేది. రిజిస్టర్ పూర్తయిన తరువాత రెండు రోజులకు డాక్యుమెంట్ పేపర్లు వచ్చేవి. ఆ పేపర్లు తీసుకొచ్చి తాసీల్దార్ కార్యాలయంలో మన పేరు మీద రికార్డుల్లో ఎక్కించడం కోసం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చేది. అయినప్పటికీ కొంత మంది ఎక్కించకుండా పక్కకు పడేసేవారు. ఇప్పుడు ఆ సమస్యలు లేవు. పైసా లంచం ఇవ్వకుండా మంచిగా ఫ్యాన్ కింద కూర్చోబెట్టి భూమిని రిజిస్టర్ చేస్తున్నారు. వెంటనే పాస్బుక్లో కూడా నమోదు చేసి ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ధరణి పోర్టల్ను కొనసాగించాలి. ప్రతి పక్ష పార్టీలు రైతులకు ఉపయోగపడే ధరణిని రద్దు చేస్తామని అనడం సరికాదు. ఎవరెన్ని చెప్పినా ధరణి ఉండాల్సిందే. లేకుంటే మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరుగడం, లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
-వెంపటి వెంకన్న, వ్యాపారవేత్త, నేరేడుచర్ల
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు కలుగుతున్నది. గతంలో భూమి కొన్నా, అమ్మినా మధ్య దళారులకు, అధికారులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. కనీసం రెవెన్యూ రికార్డుల్లో సిబ్బంది చేసిన పొరపాట్లను సవరించాలన్నా కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడంతో పాటు ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వచ్చేది. రక్తసంబంధీకుల పేరున భూమి మార్చాలన్నా ఎంతో అవస్థలు పడేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూముల రిస్ట్రేషన్ సులువైంది. మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని తాసీల్దార్ కార్యాలయానికి వెళితే గంటలో పని పూర్తి చేసుకొని వస్తున్నది. ఇది నిజంగా విప్లవాత్మక మార్పు. ఈ విధానం రైతుల పాలిట వరం. కేవలం రాజకీయం కోసం ధరణిని విమర్శించడం, దానిని రద్దు చేయాలని చెప్పడం సరికాదు.
– కట్ట సుచిత, కుక్కడం, మిర్యాలగూడ మండలం