హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.99.40 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023-24 బడ్జెట్లో రూ. 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో రూ.100 కోట్లు ఆలయానికి కేటాయించగా 45 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. తాజాగా విడుదలైన నిధులతో మహామండపం, ధర్మగుండం, క్యూలైన్లు, భక్తులకు అవసరమైన ఆధునిక వసతుల నిర్మాణాలు మరింతవేగంగా పూర్తికానున్నాయి. నిధుల విడుదలపై వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ హర్షం వ్యక్తంచేశారు.