నేరేడుచర్ల, జూన్ 1 : వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవడంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడు సాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై నిపుణుల సూచనలు, సలహాలు.
మొక్కజొన్న : మొక్కజొన్న పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 15లోపు విత్తనాలు విత్తుకోవాలి. మొక్కజొన్న సున్నితమైన పంట. నీరు ఎక్కువ ఉన్నా, తక్కువున్నా తట్టుకోదు. కాండం తొలుచు పురుగుతో తీవ్ర నష్టం జరుగుతుంది. పంట సాగు చేసిన 30 రోజుల లోపు కాండం తొలుచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 30 రోజులు గడిచిన తర్వాత దాని ప్రభావం పంటపై అంతగా ఉండదు. కాండం తొలుచు పురుగు ఉధృతికి జూలై చివరి వారం నుంచి ఆగస్ట్లో వాతావరణ అనుకూలంగా ఉంటుంది. జూన్లో మొక్కజొన్న సాగు చేయడం వల్ల పంట కాలం 30 రోజులు దాటి పురుగు ప్రభావం అంతగా ఉండదు. ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుచు పురుగుతో నష్టపోవాల్సి వస్తుంది. రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు విత్తనాలు వేయాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు పంట చేతికొస్తుంది.
పెసర : పెసర పంట కాలం 60 నుంచి 75 రోజులు ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 15 లోపు సాగు చేయాలి. ఆగస్టు 25 వరకు పంట చేతికొస్తుంది. ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండడంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. జూన్ 20లోపు సాగు చేస్తే ఆగస్టు 10లోపు పంట చేతికి వస్తుంది. రబీలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 30 లోపు సాగు చేయాలి నవంబర్ 20 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది.
పత్తి : పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి. పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ధర లేకపోవడంతో పత్తి సాగు రైతులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్లరేగడి భూమిలో పత్తి సాగు చేసే రైతులు 60 నుంచి 70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత పత్తి గింజలు విత్తుకోవాలి. జూన్ 20 నుంచి జూలై 20 వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చు పురుగులు ఉధృతి తక్కువగా ఉంటుంది.
కంది : కంది పంట కాలం 6 నెలలు. జూన్ 20 నుంచి జూలై చివరి వారం వరకు సాగు చేసుకోవాలి. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది. సకాలంలో కంది సాగు చేయడం వల్ల జనవరిలో రెండో పంటగా పెసర సాగు చేసుకొవచ్చు. నీటి వసతి ఉన్న రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్, మొక్కజొన్న సాగు చేయడం వల్ల అధిక లాభాలు సాధించవచ్చు.
సోయాచిక్కుడు : సోయా చిక్కుడు పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. నీటి వనరు ఉన్న రైతులు జూన్ 20 నుంచి జూలై 10 వరకు సాగు చేయాలి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 20 వరకు పంట చేతికొస్తుంది. సోయాచిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశెనగ, మూడో పంటగా వేసవిలో పెసరను సాగు చేసుకోవచ్చు.
మిరప : మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్లో నాటు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. మిరప సాగుచేసే రైతులు తొలకరి వర్షాలు కురియగానే తక్కువ కాలంలో చేతికొచ్చే పెసర రకాలను సాగు చేసి దాని తర్వాత మిరప సాగు చేసుకొవచ్చు.
వరి : దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించి జూన్ మొదటి వారం నుంచి చివరి లోపు నారు పోసుకోవాలి. పంటకాలం 135 నుంచి 150 రోజులు ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 20 లోపు పంట చేతికొస్తుంది. మధ్యకాలిక రకాల నారును జూన్ 20 నుంచి జులై 10 లోపు పోసుకోవాలి. పంటకాలం 125 నుంచి 135 రోజులు. నవంబర్ 5 నుంచి 25 లోపు పంట చేతికొస్తుంది. వానకాలంలో సాగు చేసిన పంట సకాలంలో చేతికి రావడంతో నవంబర్లో యాసంగి వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్యమౌతున్నది. ఏప్రిల్లో వడగండ్ల వర్షాలకు యాసంగిలో సాగు చేసిన వరి నష్టపోవాల్సి వస్తున్నది. మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించొచ్చు. నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను జూన్ 20 నుంచి అక్టోబర్ 15లోపు సాగు చేయాలి. మధ్యకాలిక రకాలను జూన్ 20 నుంచి జూలై 10 లోపు సాగు చేయాలి. అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారంలో పంట చేతికొస్తుంది.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఏ పంటలను ఎప్పుడు సాగు చేయాలనేది పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. కాలానుగుణంగా సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది. ఏ పంటలను సాగు చేయాలన్న విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తింపు పొందిన డీలర్ వద్దే కొనుగోలు చేసి రశీదును తప్పక తీసుకోవాలి.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి