Uddhav Thackeray : శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray).. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఆందోళనలు చేపడుతున్న యువత సమస్యలను పట్టించుకోని ప్రధాని.. తమ పార్టీని చీల్చి బీజేపీతో అంటకాగుతున్న ద్రోహులతో సమావేశమయ్యేందుకు మాత్రం సమయం కేటాయించారని విమర్శించారు. శనివారం ముంబైలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో థాక్రే మాట్లాడారు.
శుక్రవారం ఎన్డీయే కూటమితో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం, ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఆరుగురు నూతన ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ కావడాన్ని ఉద్ధవ్ థాకరే ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో శివసేన వర్గాల పిటిషన్లపై విచారణ జరుగుతున్న తరుణంలో న్యాయస్థానాన్ని భయపెట్టేందుకే ఈ భేటీని ఏర్పాటు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. ‘యువతను కలిసేందుకు ప్రధానమంత్రికి సమయం లేదుకానీ, ద్రోహులతో సమావేశమవుతారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. మీరు సుప్రీంకోర్టును భయపెట్టాలని చూస్తున్నారా..?’ అని ఉద్ధవ్ థాక్రే నిలదీశారు.
సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగానే వస్తుందన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టంచేశారు. దేశంలో ప్రస్తుతం ‘తుపానుకు ముందు ప్రశాంతత’ నెలకొని ఉందని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. జెన్ జీ నిరసనలు ప్రభుత్వాన్ని కదిలించాయని, అయితే వారికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం పోలీసు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాలనలో మార్పుకు సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా వేదికల ద్వారానే పాలన సాగిస్తోందని విమర్శించారు.