యాసంగిలో పంటల సాగుకు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో కావాల్సిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది. జిల్లాలో ఈ సారి 2,61,105 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది కంటే ఈసారి సుమారు 49వేల ఎకరాల్లో సాగు తగ్గుతుందని పేర్కొన్నది. ఈ సారి వర్షాలు తక్కువగా ఉండటం, నీటి కొరతతో సాగు అంచనా తగ్గినట్లు తెలుస్తున్నది. ఇక జిల్లాలో అత్యధికంగా 2,40,500 ఎకరాల్లో వరి వేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా పటిష్ట నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు సాగు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే వరి కోతలు తుది దశకు రాగా.. యాసంగి సీజన్ కోసం రైతులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో అన్ని పంటలు కలిపి 2,61,150 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో అత్యధికంగా 2,40,500 ఎకరాల్లో వరి వేయనున్నారు. 150 ఎకరాల్లో సిరి ధాన్యాలు, 150 ఎకరాల్లో పప్పు దినుసులు, 250 ఎకరాల్లో ఆయిల్ సీడ్, 20,100 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉన్నదని అంచనా వేశారు.
యాసంగి సీజన్ ప్రారంభం నేపథ్యంలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎంత మేర ఎరువులు, విత్తనాలు అవసరమో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏ పంటలకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయో జిల్లా వ్యాప్తంగా డీలర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. దీంతోపాటు ఎరువులు ఎంత మొత్తంలో అవసరమో ఆయా నెలల వారీగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడనున్నారు. ఎరువుల కొరత రాకుండా అవకాశం ఉన్నచోట బఫర్ స్టాక్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాకుండా అధికారులు పటిష్ట నిఘా పెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ఉండేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారుల సమన్వయంతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాఖ నుంచి ఏడీఏ, మండల వ్యవసాయ అధికారి, పోలీస్ శాఖ నుంచి సీఐ, ఎస్ఐతోపాటు కానిస్టేబుల్ ఉంటారు. యాదాద్రి జిల్లాలోని 17మండలాల్లో ప్రభుత్వ అనుమతితో విత్తనాలను విక్రయించేందుకు 195 విత్తన దుకాణాలు ఉన్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాల కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. 24గంటల నాణ్యమైన ఉచిత కరెంట్, పుష్కలంగా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు అందుబాటులో ఉండేవి. దీంతో రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు ముందుకొచ్చారు. కానీ.. ఈ సారి సాగు తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. గతేడాది కంటే 49వేల ఎకరాల్లో పంటల సాగు తగ్గే అవకాశం ఉన్నదని ప్రణాళికలో పేర్కొన్నది. గతేడాది 3,10,165 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని భావించారు. ఈ సారి పంటల సాగు తగ్గడానికి నీటి కొరత, వర్షాలు సరిగా రాకపోవడం కారణమని తెలుస్తున్నది.