‘జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. మన రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతున్నది. రహదారులు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వివిధ పథకాలతో ప్రజలు లబ్ధి పొంది ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారు’ అని కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో జెండా వందనం చేసి జిల్లా ప్రగతిని వివరించారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
– నల్లగొండ, జనవరి 26
నల్లగొండ, జనవరి 26 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో లిఖించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మన సొంతం అయిందని కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. నూతన రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా అభ్యుదయం వైపు పయనిస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ వేత్తల ఆశయాలకు అనుగుణంగా నేడు రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. ఇప్పటికే ప్రజాస్వామ్య పునాదులతోపాటు ఆర్థిక పునాదులు సైతం పటిష్టమయ్యాయని పేర్కొన్నారు. రహదారులు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి దిశగా పయనించి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రైతు రాజ్యంగా ముందుకు..
రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేండ్లలో రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకెళతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా వ్యవసాయరంగంలో ప్రగతి సాధించేందుకు రైతులను ప్రోత్సహించేందుకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద గత సీజన్లో రూ.595.93 కోట్ల పెట్టుబడి సాయంతోపాటు 18 నుంచి 59 ఏండ్ల వయసున్న వాళ్లకు 2.94 లక్షల మందికి రైతుబీమా కల్పించి ఇప్పటి వరకు 409 మంది రైతులు మరణిస్తే రూ.20.45 కోట్లు క్లెయిమ్ రూపేణా చెల్లించినట్లు చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చేసి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్న ప్రభుత్వం గత ఏడాది రూ.16.50 కోట్లతో 6476 ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం 5,600 ఎకరాల్లో 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు. జాతీయ ఆయిల్ పామ్ మిషన్ కింద 3,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 2023 ఎకరాల్లో మొక్కలు నాటి 389 మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.
సాగు, తాగునీరు అందించేందుకు..
జిల్లా రైతాంగానికి సాగునీటితోపాటు తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు. సాగర్, ఉదయసముద్రం, అక్కంపల్లి జలాశయాల ద్వారా రూ.2,941 కోట్లు వెచ్చించి 1718 గ్రామాల్లో 4,02,248 గృహాలకు తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల కింద 2.46 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
కులవృత్తుల కుటుంబాల్లో వెలుగులు..
కుల వృతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. గొల్లకుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపాలని 28,234 మంది లబ్ధిదారులకు 441 గ్రామాల్లో రూ.356 కోట్లు వెచ్చించి గొర్రెలు అందజేశామన్నారు. రెండో విడుత కింద మరో 36,800 మందికి త్వరలో గొర్రెలు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నీలి విప్లవం కింద 100 శాతం సబ్సిడీతో 1005 చెరువుల్లో రూ.5.61 కోట్ల చేపపిల్లలు పోశామన్నారు. వంద శాతం సబ్సిడీతో 9 రిజర్వాయర్లలో 45.90 లక్షల రొయ్యిల పోసినట్లు చెప్పారు. చేనేతలకు త్రిప్టు, భద్రతా పథకాల కోసం రూ.8.87కోట్లు మంజూరు చేసి 4,368మందికి చేయూతనిచ్చినట్లు తెలిపారు.
గ్రామీణ, పట్టణాల అభివృద్ధి కోసం…
గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. మండలాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రహదారుల కోసం ఈ ఏడాది రూ.339 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ కింద రూ.773.69 కోట్లతో 7 952 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు చేపడుతున్నామన్నారు. నల్లగొండకు రూ.702 కోట్లు, మిర్యాలగూడకు రూ.100 కోట్లు, దేవరకొండకు రూ.52 కోట్లు, హాలియాకు రూ.30 కోట్లు, చండూరుకు రూ.14 కోట్లు, చిట్యాలకు రూ.28 కోట్లు, నందికొండకు రూ.30 కోట్లు, నకిరేకల్కు రూ.78 కోట్లు విడుదల కాగా ఆయా పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. ప్రజా రక్షణలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ఫ్రెండ్లీ పోలిసింగ్తోపాటు జనమైత్రి పోలీస్ విధానాన్ని అవలంబించామన్నారు. జిల్లాలో నేరాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని, త్వరలో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళల రక్షణ కోసం షీటీమ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటగా జెండావిష్కరణ చేసిన కలెక్టర్ అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు ఖుష్బూగుప్తా, భాస్కర్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్తోపాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్య, వైద్యంపై ప్రధాన దృష్టి..
వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎల్ఓసీలు, సీఎంఆర్ఎఫ్ నిధులను అందజేస్తుందన్నారు. కంటి వెలుగు రెండో విడుత కింద 39 ఆరోగ్య కేంద్రాల్లో 844 గ్రామ పంచాయతీల్లో 182 వార్డుల్లో వైద్య అధికారులు, వైద్య సిబ్బందితో 74 బృందాలు ఏర్పాటు చేసి 1026 క్యాంపుల ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఉచిత డెలివరీతోపాటు కేసీఆర్కిట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 53,101 మందికి రూ.27.30 కోట్ల నగదుతో కిట్లు సాయం రూపంలో అందజేసినట్లు తెలిపారు. మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం రూ.275 కోట్లు కేటాయించి ఎస్ఎల్బీసీలో 37 ఎకరాలలో రూ.117 కోట్లతో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. మన ఊరు మన బడి కింద మొదటి విడుతలో జిల్లాలో 517 పాఠశాలలను ఎంపిక చేసి రూ.175.36 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలోని విద్యా సంస్థలకు 6865 క్వింటాళ్ల సన్న బియ్యం నెలవారీగా అందిస్తున్నామన్నారు. ఆసరా పథకం కింద 50.69 కోట్లు పింఛన్ రూపంలో అందజేస్తున్నామని తెలిపారు.
బడుగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు..
బడుగు, బలహీనవర్గాలతోపాటు పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దళితుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసిన ప్రతి కుటుంబానికి రూ.10లక్షల చొప్పున దళిత బంధు రూపంలో అందచేసి యూనిట్లు నెలకొల్పేలా చర్యలు చేపట్టిందన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పేరుతో 6,775 మందికి రూ.67.62 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఎస్సీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని 61 వసతి గృహాలు ఏర్పాటు చేసి 4,360 మందికి ప్రవేశం కల్పించడంతోపాటు రూ.13.93 కోట్ల ఉపకార వేతనాలు, అంబేద్కర్ ఓవర్సిస్ పథకం కింద ఆర్థిక సాయం రూ.1.95కోట్లు, గిరిజన విద్యార్థుల కోసం 42 వసతి గృహాలు ఏర్పాటు చేసి 8,932 మందికి ప్రవేశం, ఇందుకు రూ.9.29కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం 46 వసతి గృహాల్లో 4576 మందికి వసతి కల్పించామన్నారు.