సొంత ప్రిపరేషన్తో మూడు ఉద్యోగాలకు ఎంపిక
గ్రూప్ 2లో వంద లోపు ర్యాంకు సాధించిన అనిత
సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, గ్రామ కార్యదర్శిగానూ ఎంపిక
మిర్యాలగూడ రూరల్, మే 15 : ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భావించింది. దృఢ సంకల్పంతో ఆ దిశగా దృష్టి సారించింది. ఆమె పట్టుదలను గ్రహించిన భర్త మద్దతు తెలిపి, తగిన ప్రోత్సాహం అందించారు. ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టసాధ్యమైన నేటి పోటీ ప్రపంచంలో నాలుగేండ్లలో ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. అందరిచేత అభినందనలు అందుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నది.. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్కు చెందిన అత్తి అనిత.
అనిత మిర్యాలగూడ పట్టణంలోని విద్యాభారతి హైస్కూల్లో 2001లో పదో తరగతి పూర్తి చేసింది. వనిత జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, శాంతినికేతన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది. 2006-2008లో కాకతీయ విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, 2011-12లో బీఈడీ పూర్తి చేసింది. అనంతరం వివాహం కావడంతో గృహిణిగా స్థిర పడింది. ఆర్థిక పరిస్థితులు అనితను ప్రభుత్వ ఉద్యోగం వైపు దృష్టి మరల్చాయి. భర్త చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఎలాగైనా ఆ పరిస్థితి నుంచి బయటపడాలని, భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని సంకల్పించిన వనిత.. పూర్తి సమయాన్ని ఉద్యోగ సాధన వైపు కేటాయించింది. మూడేండ్ల కృషి ఫలితంగా మూడు ప్రభుత్వం ఉద్యోగాలను సాధించింది. 2016లో గ్రూప్-2లో వంద లోపు ర్యాంక్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలో స్టేట్-34వ ర్యాంకు సాధించడంతో పాటు పంచాయతీ సెక్రటరీగానూ ఎంపికైంది. 2020 ఫిబ్రవరిలో డిప్యూటీ తాసీల్దార్గా ఉద్యోగంలో చేరింది.
సొంతంగా ప్రిపరేషన్
అనిత ఎలాంటి కోచింగ్కు వెళ్లలేదు. ఇంట్లో ఉంటూనే ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించింది. గ్రూప్ 2 కోసం ఓ ఇనిస్టిట్యూట్కు చెందిన మెటీరియల్ను ఫాలో అయ్యింది. రోజుకు 8 నుంచి 12 గంటలు చదివింది. ఈ క్రమంలో ఆర్సీరెడ్డి సంస్థ నిర్వహించిన మోడల్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది. దాంతో ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం పెరిగి మరింత పట్టుదలతో ప్రిపరేషన్ కొనసాగించింది. గ్రూప్ 2కు ఎంపికై ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో డిప్యూటీ తాసీల్దార్గా పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన సువర్ణావకాశం…
మన కొలువులు మనకే.. అన్న నినాదంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన విడుదల చేయడం ఒక సువర్ణావకాశంగా భావించాను. అప్పటికే ఉద్యోగాన్వేషణలో ఉన్న నేను మరింత పట్టుదలతో చదివాను. ప్రస్తుతం భారీ ఎత్తున నోటిఫికేషన్లు విడుదల చేయడం నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కానుకగా భావిస్తునాను. ఉద్యోగ సాధనలో ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే లక్ష్యం సాధించడం సులువే.
– అత్తి అనిత, మిర్యాలగూడ