కోదాడ, జూన్ 16 : బోధనకే నిర్వచనం శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అని, ఆయన తన జీవితాన్ని బోధనకు అంకితం చేసి రెండు తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన మహోపాధ్యాయుడు అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బోధనకు, సాధనకు, నిబద్ధతకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిన రామకవచం మహా బోధకుడిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. శుక్రవారం కోదాడలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకులు శ్రీరామకవచం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రీరామకవచం 90 ఏండ్ల నవతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ తెలుగు సార్ అంటే గుర్తుకొచ్చే పేరుగా శ్రీరామకవచం వేల మంది విద్యార్థుల్లో మదిలో నిలిచిపోతారన్నారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లో వేళ్ల మీద లెక్కించే తెలుగు అధ్యాపకుల్లో శ్రీరామకవచం సార్ ఒకరని పేర్కొన్నారు. శ్రీరామకవచం బోధన, ఆయన పద్యం చదివే తీరు విద్యార్థుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. శ్రీరామకవచం ఉత్తమ ఉపాధ్యాయుడే కాకుండా కాళీయమర్థనం, నీలకంఠీయం, ఆత్మవేదన, శ్రీపదార్చన, లోకాలోకనం, సౌమనస్యం, మట్టపల్లి లక్ష్మీనృసింహస్తుతి లాంటి కావ్యాలను తెలుగు సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, వేనేపల్లి చందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, ప్రముఖ విద్యావేత్త పందిరి నాగిరెడ్డి, వల్లూరి రామిరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, కోదాడ మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్యబాబు, పూర్వ విద్యార్థులు రాఘవరెడ్డి, డీఎన్ స్వామి, కేఎల్ ప్రసాద్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.