ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇది ప్రగతి పొద్దు. సమైక్య పాలనలో తీవ్ర వెనుకబాటుకు గురైన ఈ ప్రాంత ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు మోక్షం దొరుకనున్న రోజు. నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో సత్యవతీరాథోడ్ పర్యటించి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి వందల కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి అధునాతన వైద్య సేవలు అందించేందుకు తుంగతుర్తిలో 100 పడకల దవాఖానతోపాటు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, రామన్నపేటలో విద్య, వైద్యం, మౌలిక వసతులకు సంబంధించిన అభివృద్ధి పనులు, అయిటిపాముల రిజర్వాయర్ వద్ద 100కోట్ల రూపాయలతో నిర్మించనున్న లిఫ్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. మిర్యాలగూడలోని నియోజకవర్గంలోని దామరచర్ల, అడవిదేవులపల్లి, దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో బీటీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, గిరిజన గురుకుల పాఠశాలలకు గిరిజన శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నకిరేకల్, రామన్నపేట, తుంగతుర్తి, అడవిదేవులపల్లిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో మంత్రులు ప్రసంగించనున్నారు. మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్,
చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్ కుమార్, భాస్కర్రావు పర్యవేక్షిస్తున్నారు. సభలను విజయవంతం చేయాలని ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
తిరుమలగిరి/తుంగతుర్తి, సెప్టెంబర్ 28 : సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజక వర్గం ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉన్నది. తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్ మండలాల ప్రజలు జ్వరం వచ్చినా వైద్యం చేయించుకోవాలంటే సూర్యాపేటకు, మోత్కూర్ మండల ప్రజలు భువనగిరి, శాలిగౌరారం మండల ప్రజలు నల్లగొండ ఇలా ఎటూ 50 కిలోమీటర్లు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఏదైనా ప్రమాదాలు సంభవిస్తే జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లే లోపే మృత్యువాత పడ్డ ఘటనలు ఎన్నో. గర్భిణులు ఆపరేషన్ కాకుండా బిడ్డ ముఖం చూడని వైనం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 40 వేలు లేనిదే తల్లి బిడ్డ ఇంటికి పోలేని పరిస్థితి ఉండేది. కానీ నేడు బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కృషి వల్ల ఈ ప్రాంతం అభివృద్దికి కేరాఫ్గా మారింది.
నియోజక వర్గ ప్రజల కల సాకారం..
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుండడంతో తుంగతుర్తిలో వంద పడకల దవాఖాన కల సాకారమైంది. ఎమ్మెల్యే కిశోర్కుమార్ గతంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హమీతో నేడు నియోజక వర్గం కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. తుంగతుర్తి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఎమ్మెల్యే విశేష కృషి చేసి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు రూ.45 కోట్లు మంజూరు చేయించారు. నియోజక వర్గ వాసులు మెరుగైన వైద్యం అందుబాటులో లేక ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండకు పరుగులు తీయాల్సి వచ్చేది. తుంగతుర్తి మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో సరైన సిబ్బంది లేక, అరకొర వసతులతో వైద్య సేవలు అందుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే కిశోర్కుమార్ తుంగతుర్తి నియోజక వర్గంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని గతంలో హమీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, వైద్యాధికారులతో పలు దఫాలుగా చర్చించారు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యే నిరంతర కృషి ఫలితంగా రూ.45 కోట్ల నిధులతో ప్రస్తుత సామాజిక ఆరోగ్య కేంద్రం ఏరియా ఆస్పత్రిగా మారనున్నది. దాంతో నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుతో 8 రకాల వైద్య సేవలు, ప్రత్యేక డాక్టర్లు, సిబ్బందితో పాటు 24 గంటలు రోగులకు వైద్య సేవలు అందనున్నాయి. 50కి పైగా రక్త పరీక్షలు చేయడం కోసం తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు కానున్నది. ఎక్స్రే, సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్, అధునాతన యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి.
45 పల్లె దవాఖానలు, నూతన పీహెచ్సీ ఏర్పాటు..
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ రూ.5,402.67 కోట్లతో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. వైద్య రంగంలో రూ.45 కోట్లతో 100 పడకల దవాఖానతో పాటు మద్దిరాల మండలానికి ఇటీవల నూతన పీహెచ్సీ సైతం మంజూరు అయ్యింది. తాజాగా పీహెచ్సీకి గురువారం ప్రభుత్వం రూ.1.43 కోట్లు మంజూరు చేసింది. నియోజక వర్గంలో తొమ్మిది పీహెచ్సీలు, 47 పల్లె దవాఖానలు, 108, 104, 102 అత్యవసర వాహనాలతో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై పేద ప్రజలకు కార్పొరేట్కు ధీటుగా వైద్య సేవలు అందనున్నాయి.
మంత్రుల పర్యటన కార్యక్రమాలు..
పర్యటన సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శుక్రవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కలిసి ప్రారంభించి, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జాజిరెడ్డిగూడెంలో తెలంగాణ సాగునీటి నిపుణుడు, దివంగత ఆర్.విద్యాసాగర్రావు తల్లితండ్రుల జ్ఞాపకార్ధం నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించనున్నారు. 2,30 గంటలకు స్థానిక వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విద్యాసాగర్రావు విగ్రహన్ని వారు ఆవిష్కరించనున్నారు. అనంతరం 4 గంటలకు తుంగతుర్తి మండల కేంద్రంలో రూ.45 కోట్లతో ఏర్పాటు చేయనున్న 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.4 కోట్లతో రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులకు, రూ.2.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి, రూ.5.80 కోట్లతో తుంగతుర్తి నుంచి రావులపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక అంగడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తుంగతుర్తి ఆశీర్వాద సభలో మంత్రులు మాట్లాడనున్నారు.
పేదలకు అందనున్న మెరుగైన వైద్యం
గత పాలకుల పాలనలో పేదల ఆరోగ్యాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. అప్పులు చేసి మరి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేవాళ్లం. స్వరాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు ఓ మెడికల్ కళాశాల, నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి, పల్లె, పట్టణ దవాఖానలు, సబ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పేద ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యాయి. తుంగతుర్తిలో వంద పడకల ఆస్పత్రి నిర్మించడం వల్ల దూరభారం, వ్యయ ప్రయాసలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ సహకారంతో తుంగతుర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
– దోమల బాలమల్లు, నాగారం బంగ్లా
ఎమ్మెల్యే కృషితో తీరనున్న ఏండ్లనాటి సమస్య
మా ఊరి నుంచి అత్యవసర పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లడానికి 28 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాంతో కొన్నసార్లు చికిత్స అందకుండానే మార్గమధ్యలోనే చనిపోతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే కిశోర్కుమార్ ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న తుంగతుర్తిలో వంద పడకల దవాఖాన మంజూరు చేయించడం నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఇక నుంచి 24 గంటలు ప్రత్యేక డాక్టర్లతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తుండడం సంతోషం. సూర్యాపేట, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పింది. ఇక్కడే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కిశోర్కుమార్కు నియోజకవర్గ ప్రజలంతా రుణపడి ఉంటాం.
– ఆవుల నాగరాజు, గ్రామస్తుడు, అర్వపల్లి