‘ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది.. దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తున్నది. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ను భారీ హాట్రిక్తో గెలిపిస్తాయి’ అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇంటింటికీ వివరించాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం నార్కట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి కడియం పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. పండుగ వాతావరణంలో జరిగిన సమ్మేళనంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ కార్యకర్తలు నిత్యం ప్రజల మధ్యే ఉండాలని, బీఆర్ఎస్ను మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు పాటుపడాలని కోరారు.
దేశ ప్రధానిగా మోదీ పేదలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో మాదిరిగా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ రూ.2వేల పింఛన్ ఇవ్వడం లేదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ఉచిత కరంట్ సరఫరా లేదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం కోసం పాకులాడుతున్నాయి తప్ప, తెలంగాణ అభివృద్ధి కోసం కాదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం తిరుమలగిరి(సాగర్)లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి జిల్లా ఇన్చార్జి కడియం శ్రీహరి పాల్గొన్నారు.
నార్కట్పల్లి, మార్చి 25 : తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ ప్రథకాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి చిరుమర్తి లింగయ్యను భారీ మోజార్టీతో తిరిగి గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని జువ్విగూడెం గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
జువ్విగూడెం నుంచి సుగుణ ఫంక్షన్ హాల్ వరకు డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీగా కార్యకర్తలు, నాయకులు నడిచి వచ్చారు. మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని సర్పంచులు వివరించారు. ముందుగా జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మేళన సందేశాన్ని కార్యకర్తలకు చదివి వినిపించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కడియం శ్రీహరి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణను అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రాష్ర్టాలకు తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలిచిందన్నారు.
తొమ్మిదేళ్లలో దేశ ప్రధానిగా ఉన్న మోదీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి చూపిస్తామని మోదీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు తమ ఇంటి వద్దకు వస్తే నిలదీయాల్సిన బాధ్యత మనదేనన్నారు. రోజుకు రూ.45 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చుపెట్టి రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్దే అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ర్టాల్లో ఉచిత కరెంటు ఇస్తున్నారో మోదీని ప్రశ్నించాలన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. విద్యా రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ. 1,25,000 చొప్పున ఖర్చు పెడుతుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించినట్లు తెలిపారు.
ఆదాయం పెంచి ప్రజలకు పంచి : జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు పంచుతున్నారని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉద్యమ స్ఫూర్తి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పథకాల అమలులో రాజీ పడకుండా పారదర్శకంగా ప్రతీ ఇంటికి సంక్షేమం అందించిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కుటుంబ పార్టీగా బీఆర్ఎస్ పని చేస్తుందన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంత కష్టం వచ్చినా తాము ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వైపే ఉంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయయే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.
సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్స్ ఎజెండా అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం, పార్టీ బలోపేతం వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు అందుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు.
అధికారం మళ్లీ బీఆర్ఎస్దే
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో రాష్ట్రంలో, నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. బీఆర్స్ సంక్షేమ పథకాలు శ్రీరామ రక్ష అని కొనియాడారు. వచ్చే ఎన్నికలో మండలంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అత్యధిక మెజార్టీ ఇచ్చే దిశగా ప్రతీ కార్యకర్త పని చేయాలని కోరారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే చిరుమర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత చోటుచేసుకున్న మార్పును, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. త్వరలో బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుందని తెలిపారు. మండలంలో ఇప్పటికీ అన్ని రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేసినట్లు చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. దళిత బంధు యూనిట్లు మన మండలంలోనే ఎక్కువగా వచ్చాయని ఇంకా విడుతల వారీగా ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్తోనే మాలాంటోళ్లకు న్యాయం
ఎప్పడు సమస్య వచ్చినా ఫోన్ చేసి చెబితే చాలు అర్థం చేసుకుని పరిష్కరించే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యనే మళ్లీ గెలిపించుకుంటం. గొర్ల కాపరులకు కేసీఆర్ సర్కార్ ఎంతో మేలు చేస్తుంది. కారు గుర్తుని మరువబోం, మా ముసలామెకు గొర్లు అప్పజెప్పి మీటింగ్కు వచ్చిన. నాకు పింఛన్ కూడా వస్తుంది. కొన్ని ఏండ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనుంటేనే మాకు న్యాయం జరుగుతది.
– కేసాని వెంకటయ్య గొర్ల కాపరి, అక్కెనపల్లి గ్రామం
కేసీఆర్ 2 వేలు పింఛన్ ఇస్తున్నడు
గతంలో రూ.200 లు పించన్ వచ్చేది. అది సరిపోక పోయేది. కారు గుర్తు కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తుండు. తలెత్తుకుని బతుకుతున్నాం. అంతేకాకుండా మా బిడ్డ బిడ్డకు కల్యాణలక్ష్మితో లక్ష రూపాయలు వచ్చినై. కారు గుర్తు ప్రభుత్వం చాలా సదుపాయాలు చేస్తున్నది.
– మోత్కూరు ఎల్లమ్మ, పల్లెపహాడ్