నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు
పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
రామగిరి, మే 14 : ‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఆ దిశగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. అదే బాటలో ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి దశాలవారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి’ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కంచర్ల మానస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఉద్యోగార్థులకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగార్థులు ప్రతిపక్షాలు, ఇతరులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన వారి సలహాలు, సూచనలు తీసుకుని చదివితే అవగాహన పెరుగుతుందన్నారు. ఉచిత శిక్షణ అందిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల సేవలను అభినందించారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. 2 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉచితంగా టెట్, డీఎస్సీ, గ్రూప్-2, 3, 4 శిక్షణతోపాటు మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక అభ్యర్థులు నల్లగొండ నుంచే ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్ ఉన్నారు.