కేరళ, తమిళనాడు తర్వాత దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న మూడో రాష్ట్రం తెలంగాణ. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేకంగా పది సూత్రాలతో కార్యాచరణను రూపొందించింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఈ పది సూత్రాలను అమలు చేయాలని నిర్ణయించింది. అందుకు ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు మార్చి 31ని డెడ్లైన్గా విధించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల అభివృద్ధిలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది కూడా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోని 26 మున్సిపాలిటీలు స్వచ్చ సర్వేక్షన్ అవార్డులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రతి మున్సిపాలిటీలో పది రకాల అభివృద్ది కార్యక్రమాలను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవల మునుగోడులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ కూడా వెల్లడించారు. అంశాల వారీగా ప్రతి మున్సిపాలిటీ వీటిని త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు వాటి అమలుపై దృష్టి సారించాయి.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్05(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఐదు పాతవి కాగా 14 మున్సిపాలిటీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలకు సక్రమ పాలన, సమర్థవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వీటిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో పనులను కొనసాగిస్తున్నది. రెగ్యులర్గా ఇచ్చే నిధులతో పాటు పట్టణప్రగతి ద్వారా మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దాంతో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం ఎనిమిది సంవత్సరాల్లో నల్లగొండ జిల్లాలో రూ.453 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.619.79కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 278.88 కోట్లను ఆయా మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇతర అన్ని రకాల నిధులు కలిపి సుమారు రెండు వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. ఇవే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో రూ.254.63 కోట్లను వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మరోవైపు యాదగిరిగుట్ట కేంద్రంగా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ), నల్లగొండ జిల్లా కేంద్రంగా నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)ను ఏర్పాటు చేసింది. దాంతో నిధుల సమీకరణతో పాటు అభివృద్ధి పనులు మరింత వేగవంతమవడానికి ఆస్కారం ఏర్పడింది. ఇదే సమయంలో ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, వీధిలైట్ల నిర్వహణ, వైకుంఠధామాల ఏర్పాటు వంటివి కూడా అమలులోకి వచ్చాయి. ఆయా అంశాలపై నిరంతర పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నది. వీటికి తోడు ప్రతి మున్సిపాలిటీలోనూ మరో పది రకాల సౌకర్యాల కల్పనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పది సూత్రాల అమలు కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అనుగుణంగా అన్ని మున్సిపల్ పాలకవర్గాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రతి పాలకవర్గం వీటి అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. టీఎస్బీపాస్, సమీకృత మార్కెట్, వైకుంఠ రథం, నర్సరీలు, మెకనైజ్డ్ ధోబీఘాట్, బయోమైనింగ్, మానవవ్యర్థాల శుద్ధ్దీకరణ ప్లాంట్, ప్రతి ఇంటికీ తాగునీరు, మాస్టర్ప్లాన్, డిజిటల్ డోర్ నంబరింగ్ వంటి పది రకాల అభివృద్ధి పనులను మార్చి 31 నాటికి అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. వీటి అమలుపై క్రమం తప్పకుండా జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ధోబీఘాట్
ప్రతి మున్సిపాలిటీ ఆధునిక మెకనైజ్డ్ ధోబీఘాట్ను ఏర్పాటు చేయాలి. వీటికి అవసరమైన స్థలాలను సమకూర్చుకుంటే వెంటనే ప్రభుత్వం నిధులు ఇస్తుంది.
బయో మైనింగ్
డంపింగ్ యార్డ్లోని చెత్తను శుద్ధి చేసేందుకు బయోమైనింగ్ ప్రక్రియను చేపట్టాలి. దీని వల్ల చెత్త పేరుకుపోకుండా నివారించవచ్చు.
మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్
మానవ వ్యర్థాలు సైతం పర్యావరణానికి తీవ్ర హానికరం. నల్లగొండలో మాదిరిగా మానవ వ్యర్థాల శుద్ధ్దీకరణ ప్లాంట్ను నిర్మించాలి.
ఇంటింటికీ తాగునీరు
పట్టణాల విస్తరణకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. శివారు కాలనీలతో సహా ఇంటింటికీ నీరు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. కనీసం 95 శాతం లక్ష్యమైనా చేరుకోవాలి.
మాస్టర్ ప్లాన్
పట్టణాల్లో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కీలకం. దీని ప్రకారంగానే రోడ్లు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ వంటి వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మాస్టర్ప్లాన్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పాలకవర్గాలు ప్రత్యేకంగా చర్చించి పొరపాట్లకు తావులేకుండా మాస్టర్ప్లాన్ రూపొందించాలి. స్థానిక ఎమ్మెల్యే, పాలకమండళ్లు, అధికారులు చర్చించి ఆమోదం తీసుకోవాలి.
డిజిటల్ డోర్ నంబరింగ్
పట్టణాల్లోని ప్రతి ఇంటికీ మార్చి 31 నాటికి డిజిటల్ డోర్ నంబరింగ్ను పూర్తి చేయాలి. ఇండ్లకు ప్రత్యేకంగా డిజిటల్ నంబర్ కేటాయించడం వల్ల రానున్న కాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. దాంతో పాటు మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపు ప్రక్రియ సులభం కానుంది.
వైకుంఠ రథం
ఇప్పటికే దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పాటు అంతిమయాత్ర కోసం కనీసం ఒక్కటైనా వైకుంఠరథం సమకూర్చుకోవాలి. చిన్న మున్సిపాలిటీలు సైతం వీటిని ఏర్పాటు చేయాల్సిందే.
నర్సరీలు
ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీకి నర్సరీలు ఉన్నాయి. ఇంకా అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలి. ఇందుకోసం గ్రీన్ బడ్జెట్ను ఉపయోగించుకోవచ్చు.
అమలు చేయనున్న 10 సూత్రాలు
టీఎస్ బీపాస్ మున్సిపాలిటీల్లో నిర్మాణ అనుమతులన్ని టీఎస్బీపాస్ ద్వారానే ఇవ్వాలి. దీనిని మరింత సమర్ధవంతంగా, పకడ్బందీగా అమలు చేయాలి. 75 గజాల స్థలంలోని నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు. ఆపై విస్తీర్ణంలోని స్థలాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సిందే.
సమీకృత మార్కెట్
ప్రతి మున్సిపాలిటీలో కనీసం ఒక్కటైనా వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో అదనపు అవసరాలపై దృష్టి పెట్టొచ్చు.