ఇదీ దళిత బంధు విజయగాథ ‘జ్యోతిలక్ష్మి’ చూడలేని నిజాలివిగో.. ఉమ్మడి జిల్లాలో 3,498 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున సర్కారు సాయం ఆర్థిక సుస్థిరత దిశగా లబ్ధిదారుల అడుగులు వినూత్న బిజినెస్లతో విజయవంతంగా ముందుకు.. నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకూ ఆదాయం ఉపాధి పొందుతూనే మరికొందరికి పని కల్పిస్తున్న లబ్ధిదారులు దళితులను ఓటు బ్యాంకుగా చూసే సంప్రదాయానికి తెరదించుతూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం కేసీఆర్ మదిలో మెదిలిన బృహత్తర పథకమే దళిత బంధు. సమాజంలో అనాదిగా వివక్షకు గురవుతూ అట్టడుగు వర్గంగా మిగిలిపోయిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం ఉద్దేశం. ఉమ్మడి జిల్లా పరిధిలో మొదట వాసాలమర్రిలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికీ పథకం వర్తింపజేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికే జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళిత కుటుంబాలు ఆర్థిక వికాసం వైపు అడుగులు వేస్తున్నాయి. తాము ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో రూ.349.80కోట్లతో 3,498 మందికి యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి. ఇందులో తొలి విడుతగా నియోజకవర్గానికి వంద చొప్పున 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1200 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేశారు. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో 75 యూనిట్లు, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 2,223 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 యూనిట్ల చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం 6వేల మందికి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, జనవరి 21 (నమస్తే తెలంగాణ):స్వరాష్ట్రంలో దళిత, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో సమూలమైన మార్పుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య పరంగా అట్టడుగు వర్గాల పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. స్వాతంత్రానంతరం నుంచి కూడా అంటరానితనానికి, వివక్షకు గురైన దళిత కుటుంబాల్లో మార్పులు తేవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధుకు రూపకల్పన చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రతి దళిత కుటుంబానికీ పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచడే ఈ పథకం లక్ష్యం. రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పైలెట్ ప్రాజెక్టుగా దీని అమలుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తర్వాత హూజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టారు. గత ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మందికి అమలు చేసి ఫలితాలను అంచనా వేశారు.
ఇక నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టగా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసి అమలు చేశారు. ఇప్పటి వరకు అమలైన పథకంలో వంద శాతం లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులకు పథకం అమలుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. పథకం అమలులో వచ్చిన అనుభవాల రీత్యా మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు పలు రకాలుగా దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను వృద్ధి చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం వెబ్సైట్ రూపకల్పన చేసి ఒక యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా కృషి కొనసాగుతుంది. దీంతో పథకం అమలులో మరింత పారదర్శకత రానుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఒకే గ్రామంలోని లబ్ధిదారుల్లో ఎక్కువ మంది ఒక రకమైన ఉపాధి అవకాశాలను ఎంచుకోవడం మార్కెట్ పరంగా కొంత ఇబ్బందికరంగా మారింది. సరైన గిరాకీలు లేక వ్యాపారం నడవకపోతే ఇబ్బందులు రావచ్చని భావించి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధ్యయనం చేస్తున్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపుతుండడంతో ఇతర వ్యాపారాలపైన అవగాహన కోసం వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో మరింత మెరుగ్గా పథకం డబ్బులతో ఎలా ప్రయోజనం పొందవచ్చన్న దానిపైనా కసరత్తు చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం పథకం గ్రౌండింగ్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవంగా ఈ పథకం ఎస్సీ సబ్ ప్లాన్లో భాగంగా అమలు చేస్తుండడంతో ఆర్థిక సంవత్సరం ముగిసినంత మాత్రాన ఈ నిధులు లాప్స్ అవుతాయనే భయం అవసరం లేదు.
గత ఏడాది కూడా మార్చి అనంతరం ఏప్రిల్, మే నెలల్లోనూ గ్రౌండింగ్ పూర్తి చేశారు. ఈ ఏడాది కూడా సాంకేతిక లేదా ఇతర సమస్యలతో మార్చి నాటికి పూర్తి కాకపోతే తర్వాత కూడా గ్రౌండింగ్ చేయడానికి ఇబ్బందులు ఉండబోవనేది స్పష్టం. దళితబంధు పథకం అమలుపై ఒక సెక్షన్ మీడియాతో పాటు కొందరు చేస్తున్న దుష్ప్రచారంపైనా దళితులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నది. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 517 యూనిట్లు, సూర్యాపేటలో 2,568, యాదాద్రి భువనగిరి జిల్లాలో 413 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయి సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయి.
గతంలోనూ ‘జ్యోతి’ కుట్రలు, కుతంత్రాలు
దళితబంధు పథకంపై ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు కథనాలు వండి వారుస్తున్నది. దళిత బంధుకు నిధులన్నీ ఎస్సీ సబ్ప్లాన్ నుంచి విడుదలవుతున్నాయి. అంటే ఈ నిధులను వచ్చే సంవత్సరం అయినా క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వీలుంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ రాధాకృష్ణ ఎప్పుడూ తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నారు. గతంలోనూ తెలంగాణపై అడ్డగోలు రాతలు, వార్తలు ప్రసారం చేశారు. దళితులను బాడుగ నేతలుగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, కేసీఆర్ సీఎం కావడాన్ని ఓర్చుకోలేకపోయారు. నాడు అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని అవహేళన, వ్యంగ్యంగా చిత్రీకరించి తెలంగాణ సమాజం నుంచి చీవాట్లు తిన్నారు. దళిత బంధు పథకం అమలుపై ఆంధ్రజ్యోతి అడ్డగోలు రాతలపై దళిత సమాజం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది.
యాదాద్రి జిల్లాలో
యాదాద్రి జిల్లాలో 412మందికి దళిత బంధు డబ్బులు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందులో భువనగిరి నియోజకవర్గంలో 100 మందికి, ఆలేరులో 175, మునుగోడులో 61, నకిరేకల్లో 39, తుంగతుర్తిలో 38మందికి దళిత బంధు డబ్బులు జమ అయ్యాయి. భార్యాభర్తల మధ్య గొడవలతో ఒక కుటుంబానికి పెండింగ్లో ఉంది.
వాసాలమర్రిలో ఎస్సీలందరికీ..
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా దళిత బంధు స్కీంను పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోనే మొదటగా ఇక్కడే అమలు చేశారు. ఊరంతా సర్వే చేసిన అధికారులు 75మందిని గుర్తించి దళితబంధు అందజేశారు. వారంతా విజయవంతంగా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు.
కేసీఆర్ సార్ మా పాలిట దేవుడైండు
నాకు ముగ్గురు కొడుకులు. నాకున్న ఒక పాత ట్రాక్టర్ను నా పెద్ద కొడుకు నడిపేది. నేను పని దొరికినప్పుడు కూలికి పోయేది. దళిత బంధు తొలి విడుతలో మా గ్రామం ఎంపికైంది. మా ఊళ్లో మొత్తం 16 మందిని ఎంపిక చేస్తే.. అందులో నాలుగు మా కుటుంబానికి రావడం సంతోషకరం. ఆ డబ్బులతో నేను గూడ్స్ ట్రాన్స్పోర్టు వాహనం, నా కుమారులు ఒక ట్రాక్టర్ తీసుకున్నారు. వాటితో ఒక్కొక్కరం రూ.30వేల దాకా సంపాదిస్తున్నాం. దళిత బంధు పథకం ఇచ్చిన కేసీఆర్ సార్ మా కుటుంబానికి దేవుడైండు. కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– సింగపంగ మారయ్య, రంగారెడ్డినగర్ (నల్లగొండ రూరల్)
ఏడాదికి రూ.6లక్షలకు పైగా సంపాదన
ఇతను తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి చెందిన గ్యార నర్సింహులు. ఇంతకాలం చిన్నాచితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య ఆండాలు పేరున దళితబంధు కింద ట్రాక్టర్ డోజర్ మంజూరయ్యాక వీరి దశ తిరిగింది. ఐటీఐ చదివిన వీరి కుమారుడు భాస్కర్ గతంలో వాసాలమర్రిలో వరి కోత మిషన్ డ్రైవర్గా పనిచేసేవాడు. దళితబంధు కింద వచ్చిన రూ.10లక్షలకు లక్షా 40వేలు జమచేసి ట్రాక్టర్, డోజర్ కొన్నాడు. రోజుకు 7నుంచి 8గంటల పని దొరుకుతుంది. డీజిల్ ఇతర ఖర్చులు పోను నెలకు రూ.50వేల వరకు మిగులుతున్నాయి. సంవత్సరంన్నరగా పోగు చేసిన డబ్బులు బ్యాంక్లో కొంత చిట్టీలు వేస్తూ మరికొంత కూతురు వివాహనికి జమ చేస్తున్నారు. వచ్చిన ఆదాయంతో త్వరలోనే తన కూతురు పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఒకరి కింద పనిచేసే బాధ తీరిందని భాస్కర్ పేర్కొంటున్నాడు.
– గ్యార నర్సింహులు, వాసాలమర్రి (తుర్కపల్లి)
ముగ్గురికి పని కల్పిస్తున్న..
గతంలో నేను కూలి పనిచేసేది. దళిత బంధు పథకం కింద రూ.9,90,000 వచ్చాయి. ఇంకా 10వేలు నా ఖాతాలోనే ఉన్నాయి. ఎప్పుడైనా అత్యవసర సమయంలో ఆ డబ్బులను వినియోగించుకోవచ్చు. దళిత బంధు డబ్బుతో ఇంటి దగ్గరే కోళ్లఫారం పెట్టుకొని బతుకుతున్నం. ఆరు వేల కోళ్లు పట్టే షెడ్డును ఏర్పాటు చేశా. ఇప్పుడు మరో ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్న. నెలకు రూ.30వేలకు పైగా ఆదాయం వస్తున్నది. ఎంతో సంతోషంగా ఉన్నం.
– మంచాల జంగమ్మ, రామలింగంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం
దళిత బంధుతో ఓనరయ్యా
నేను గతంలో కోమటికుంట నుంచి మిర్యాలగూడకు ఆటో నడుపుకొనేది. వచ్చీరాని కిరాయిలతో ఆదాయం పెద్దగా ఉండేది కాదు. కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. దళితబంధు పథకం కింద మా గ్రామం ఎంపిక కావడం.. నాకు రూ.10లక్షలు రావడంతో నేరేడుచర్లలో చెప్పుల షాపు పెట్టుకున్నా. ఓనరైన నేను ఇప్పుడు రోజుకు వెయ్యి నుంచి 1500 రూపాయల వరకు సంపాదిస్తున్నా. సొంతంగా వ్యాపారం చేస్తానని కలలో కూడా అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మేలు జన్మ జన్మలకూ మరువం.
– గాదె నాగరాజు, కోమటికుంట (పాలకవీడు)
దళితుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పాలిట దేవుడిలా నిలిచాడు. దళిత బంధు పథకం ప్రారంభించి కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేసి వాటి ద్వారా స్వయం ఉపాధి పొందే విధంగా అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. నాకు దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు మంజూరు అయ్యాయి. వాటి ద్వారా ట్రావెల్ వాహనం కొనుగోలు చేశా. దానిని బాడుగకు తిప్పుకొంటూ ఉపాధి పొందుతున్నా. దళిత నిరుద్యోగులకు దళిత బంధు పథకం ఒక వరం. స్వయం ఉపాధి పొందుతూ చింత లేని జీవితాలను గడపడానికి సదవకాశం.
– చింతల వెంకటేశ్వర్లు, వెంకటాద్రిపాలెం (మిర్యాలగూడ రూరల్)
ఆత్మగౌరవంతో బతికేలా చేసిన దళిత బంధు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మమ్ములను సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా చేసింది. ప్లంబర్ పని చేసుకుంటున్న నాకు దళిత బంధు పథకం కింద పది లక్షల రూపాయలు మంజూరయ్యాయి. దాంతో ట్రాలీ ఆటో కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నా. ఎవరి వద్ద పని చేయకుండా స్వశక్తితో బతికేలా సీఎం కేసీఆర్ దారి చూపిండు. అణగారిన మా కుటుంబాన్ని ఆదుకున్న దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– బైరం గురువయ్య, దామరచర్ల
నల్లగొండ జిల్లాలో..
నల్లగొండలో జిల్లాలో 517 మందికి దళిత బంధు ఇవ్వగా.. అందరి లబ్ధిదారుల యూనిట్స్ గ్రౌండింగ్ పూర్తయింది. ఇందులో ట్రాన్స్పోర్టు విభాగం కింద 372 మంది, ఇతర విభాగాల కింద 145 మంది యూనిట్లు పెట్టుకున్నారు. నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున దళిత బంధు ఇవ్వగా.. నకిరేకల్లో 61 (రామన్నపేట మినహా), మునుగోడులో 39 (సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మినహా) మంది, తుంగతుర్తిలో 17 (శాలిగౌరారం మాత్రమే) మందికి దళిత బంధు అందజేశారు. పది లక్షల చొప్పున 517 మందికి రూ.51.17 కోట్లు విడుదల చేయగా.. కొందరి యూనిట్లు రూ.పది లక్షలకు తక్కువగా ఉండటంతో రూ.3.75 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోనే ఉన్నాయి. నిధులు మిగిలి ఉన్నవారు మరో మినీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారుడికి రూ.9.90 లక్షలు ఇస్తున్న సర్కార్.. మరో పది వేల రూపాయలను నిలిపివేసింది. వాటికి మరో పది వేలు కలిపి నియోజకవర్గానికి ఒక బ్యాంకు ఖాతా ప్రారంభించి రక్షణ నిధిగా బ్యాంకులో కలెక్టర్ ఆధ్వర్యంలో నిల్వ చేసింది. ఏ లబ్ధిదారుడికైనా తక్షణ అవసరం పడితే కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ నిధుల్లో నుంచి తీసి ఇస్తారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు కొనసాగుతున్నది. ప్రభుత్వం నుంచి మెరుగైన మార్గదర్శకాలు రాగానే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నది.
సూర్యాపేట జిల్లాలో..
గతేడాది తొలి విడుతగా సూర్యాపేట జిల్లాలో నియోజకవర్గానికి 100 చొప్పున సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు 300 రాగా.. జిల్లా పరిధిలో ఆరు మండలాలున్న తుంగతుర్తి నియోజకవర్గానికి 45 మందికి.. మొత్తంగా 345 మందికి ఈ స్కీం అందింది. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 1500 మంది లబ్ధిదారులకు దళితబంధు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 6వేల మందికి రూ.600 కోట్లతో యూనిట్లు మంజూరు చేయనున్నారు. తొలి విడుతగా నియోజకవర్గానికి 500 చొప్పున 2వేల మందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు.
తిరుమలగిరిలో 2,223 మందికి రూ.222.30 కోట్లు
వంద శాతం దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాలను ఎంపిక చేయగా.. అందులో తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి ఒకటి. ఈ మండలంలో 2,223 దళిత కుటుంబాలను గుర్తించి వారందరికీ రూ.10లక్షల చొప్పున రూ.223.30 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమయ్యాయి. అందులో ఇప్పటి వరకు 2,152 మందికి యూనిట్లు గ్రౌండ్ కాగా.. వారంతా మినీ డెయిరీలు, కార్లు, ట్రాక్టర్లు, కిరాణం, వస్త్ర దుకాణాలు, గొర్రెలు ఇలా రకరకాల వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రైతుబంధు ద్వారా యజమానులై సంతోషంగా జీవిస్తున్న దళితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
నాడు గుమస్తా.. నేడు ఓనర్
తుంగతుర్తి : మండల కేంద్రానికి చెందిన బొంకూరు విమల-శ్రీను దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. విమల పదేండ్లుగా ఓ బట్టల షాపులో గుమస్తాగా పని చేస్తుండగా.. శ్రీను టైలరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నాడు బట్టల షాపులో రెండు నుంచి మూడు వేల రూపాయల జీతంతో, భర్త టైలరింగ్తో కొద్దో గొప్పో వచ్చే ఆదాయంతో జీవితాన్ని నెట్టుకొంటూ వచ్చారు. అయితే.. మండలంలో మొదటిసారిగా ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో 26మందికి దళితబంధు అందించారు. ఈ పథకం కింద విమలకు రూ.10లక్షలు రావడంతో టైలరింగ్, శారీ సెంటర్ను ప్రారంభించింది. ఇప్పుడు నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. ఆర్థిక సాయం అందించిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే కిశోర్కు జీవితాంతం రుణపడి ఉంటామని విమల చెప్పారు.
దళితు బంధు అద్భుత పథకం
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద మా గ్రామంలో 67 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు ఇచ్చారు. వాళ్లందరూ గతంలో నాలాగే కూలి పనులకు పోయేది. ఇప్పుడు యజమానులుగా మారి సంతోష జీవనం సాగిస్తున్నారు. నాకు ప్రభుత్వం అందించిన పది లక్షల రూపాయలతో ట్రాక్టర్, ఇతర పనిముట్లు కొనుగోలు చేశా. ఇప్పుడు కూలి పనుల కోసం ఎదురు చూడకుండా ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నా. ఇలాంటి గొప్ప పథకం ప్రవేశపెట్టి మా జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– గొల్లపూడి మట్టయ్య, కిష్టాపురం (చింతలపాలెం)
సీఎం కేసీఆర్ సారు మా భరోసా ఇచ్చిండు
గతంలో నేను లారీ డ్రైవర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించేది. లారీ మీద రాష్ర్టాలు దాటి 20 రోజులకు ఇంటికొచ్చేది. డ్రైవర్ పని మానేయమని నా భార్య గొడవ చేసింది. అది మాని కూలి పనులకు వెళ్లేది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇచ్చిండు. ఆ డబ్బుతో ట్రాన్స్పోర్టు వాహనం తీసుకున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో ఇప్పుడు సొంత ఊర్లో కుటుంబంతో కలిసి సంతోషంగా బతుకుతున్నాం. మా బతుకులు మార్చిన లకేసీఆర్ సార్కు, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం.
– జిట్ట క్రిష్ణ, బాజకుంట (నార్కట్పల్లి)
నల్లగొండలో గ్రౌండింగ్ పూర్తి చేశాం
నియోజకవర్గానికి వంద మంది చొప్పున ప్రభుత్వం గత ఏడాది దళిత బంధు కింద నిధులు ఇవ్వగా.. లబ్ధ్దిదారులు ఎంచుకున్న యూనిట్ను అందజేశాం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 517 మందివి గ్రౌండింగ్ చేశాం. ఇందులో ఎక్కువ మంది రవాణా రంగానికి సంబంధించిన కార్లు, డీసీఎంలు, ట్రాక్టర్లు, జేసీబీలు, వరి కోత మిషన్లు పెట్టుకున్నారు. మరికొంత మంది డెయిరీలు, పౌల్ట్రీ ఫామ్స్, సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అందరి ఇండ్లల్లోకి స్వయంగా వెళ్ల్లి పరిశీలించాం. ఒక్కొక్కరు నెలకు కనీసంగా రూ.20వేల నుంచి రూ.40వేల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
– ఎల్.శ్రీనివాసులు, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, నల్లగొండ
దళిత యూనిట్తో రోజూ రూ.2వేలు సంపాదిస్తున్న
గతంలో నేను ఆటో డ్రైవర్గా, మా కుటుంబ సభ్యులు కూలినాలి పనులు చేసుకుంటూ జీవించేవాళ్లం. రెక్కల కష్టం మీద బతికే మా కుటుంబంలో దళితబంధు వెలుగులు నింపింది. ఎలాంటి పైరవీలు లేకుండా జిల్లా స్థాయి అధికారులు మా ఇంటికొచ్చి దరఖాస్తు చేయించి డెయిరీ ఫాం మంజూరు చేశారు. ఇప్పుడు రోజూ 30 లీటర్ల పాలతో రెండు వేలు సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నాం. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు మా వాడలకు వచ్చి ఓట్ల కోసం వాడుకునేది తప్ప.. మా బాగును పట్టించుకోలేదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు జీవితకాలం అండగా నిలుస్తాం.
– పల్లె పుల్లారావు, గుడిబండ (కోదాడ రూరల్)