రూ.20కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
త్వరలో టెండర్లు.. ఆ వెంటనే పనులు
వరద నీరు వచ్చేలోపు పూర్తి చేసేలా ప్రణాళిక
నందికొండ, మే 7 : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్పిల్వే మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 20 కోట్లను సైతం విడుదల చేసింది. దాంతో పనులు త్వరగా ప్రారంభించేందుకు ఎన్నెస్పీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం 538.50 అడుగులుగా ఉంది. నీటిమట్టం క్రస్ట్ గేట్ల వరకు (546 అడుగులు) చేరేలోపు స్పిల్వే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
వరదలకు దెబ్బతిన్న స్పిల్వే
నాగార్జునసాగర్ ప్రాజెక్టును సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా నిర్మించారు. వరద నీరు అధికమైనప్పుడు కిందికి విడుదల చేసేందుకు వీలుగా 26 రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 11,70,000 క్యూసెక్కుల వరద నీటిని ప్రధాన డ్యాం దిగువ భాగంలో 1540 అడుగుల నిడివి కలిగిన స్పిల్వే మీదుగా విడుదల చేసేలా నిర్మించారు. 2009లో కృష్ణానదికి వరదలు రాగా డ్యాం సామర్థ్యం కంటే అధికంగా 14 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో స్పిల్వే దెబ్బతిన్నది. 2014, 2020, 2021 సంవత్సరాల్లో కూడా వరదలు రావడంతో స్పీల్వే బాగా దెబ్బతిన్నది.
మరమ్మతులు ఇలా..
స్పిల్వే మరమ్మతు చేయడానికి గతంలోనే ఎన్నెస్పీ అధికారులు డ్యాం కిందుగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వరదలకు అది దెబ్బతిన్నది. ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని పునరుద్ద్ధరించి స్పిల్వే పనులు చేపట్టాల్సి ఉంటుంది. స్పిల్వేకు ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు ఎం 60 గ్రేడ్ సికాప్యూమ్, స్టీల్ వైర్ ఫైబర్, రెయిన్ ఫోర్సుడ్ కాంక్రీట్ను ఉపయోగిస్తారు. డ్యాం 7వ క్రస్ట్ గేట్ నుంచి 19వ గేట్ వరకు స్పిల్వే వద్ద భారీగా గుంతలు పడ్డాయి. సుమారు 2 నుంచి 3 మీటర్ల పైనే ఉన్న ఈ గుంతలను పూడ్చాల్సి ఉంటుంది.
జాప్యం లేకుండా పనులు
స్పిల్వే పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు చేపట్టడానికి టెండర్ల ప్రక్రియను చేపడుతున్నాం. 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే పనులు ప్రారంభిస్తాం. జూన్, జూలైలో రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే పనులు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నాం.
-ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్