మూడు, నాలుగు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం అవసరమైన అన్ని గ్రామాల్లో కేంద్రాలు ప్రతి గింజకూ మద్దతు ధర నేడు మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా సమీక్ష హాజరుకానున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ‘స్వరాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీటితోపాటు ఉచిత కరెంటు ఇస్తూ అదనంగా కోటి ఎకరాల్లో సాగును పెంచుకున్నాం. రైతుబంధు, రైతు బీమా వంటి ఉద్దీపనలు అమలు చేస్తున్నాం. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కేంద్రం వడ్లను కొననంత మాత్రాన రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకోదు. నూకల ద్వారా వచ్చే నష్టం ఎంతైనా సరే భరించి ప్రతి గింజా కొనుగోలు చేస్తాం.’
– క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఉమ్మడి జిల్లా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల హామీతో ఎనలేని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం చిత్రపటాలకు
క్షీరాభిషేకం చేశారు. కర్షకుల ఆందోళనకు సైతం కేంద్రం కరుగకపోవడంతో సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి కొనుగోళ్లపై రైతులకు అభయమిచ్చారు. యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఆ మేరకు చకచకా ఏర్పాట్లు చేయాలని మంగళవారం సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆదేశించారు.
“కార్పొరేట్ సంస్థలకు రూ.10.50లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడానికి మోడీ సర్కార్కు శ్రద్ద ఉంటుంది. కానీ, యాసంగి వడ్లను కొనుగోలు చేస్తే రూ.3500 కోట్ల నష్టాన్ని భరించేందుకు మాత్రం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలపై ఉన్న ప్రేమ రైతులపై ఎంతమాత్రమూ లేదు. దీన్ని ఎండగట్టేందుకే కేంద్రంపై పోరాటమార్గాన్ని ఎంచుకున్నాం.” ఇది మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన స్పష్టమైన ప్రకటన.
నల్లగొండ ప్రతినిధి, ఏఫ్రిల్12(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఉమ్మడి జిల్లా రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో కదం తొక్కిన రైతులు.. సీఎం ప్రకటనతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
రెచ్చగొట్టి.. కొనుగోళ్ల ఊసెత్తని బీజేపీ నేతలు..
రాష్ట్రంలో వ్యవసాయం రంగం అభివృద్ధిని జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగా రైతులను ఇబ్బందులకు గురిచేయాలని చూశారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన రెచ్చగొట్టుడు ప్రకటనలే అందుకు నిదర్శనం. కేంద్రం కుట్రలపై సీఎం కేసీఆర్ ముందే హెచ్చరికలు చేస్తే బీజేపీ నేతలు వరి సాగు చేయాలని రెచ్చగొట్టారు. తీరా కోతల సమయంలో కొనుగోళ్ల ఊసెత్తడం లేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు, రైతులకు వివరించేందుకు గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. కేంద్రం దిగిరాక పోవడంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కొనుగోళ్లపై రైతులకు అభయమిచ్చారు.
నేటి నుంచి యుద్ద ప్రతిపాదికన ఏర్పాట్లు
ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సాగు, దిగుబడి అంచనా, కొనుగోలు కేంద్రాలే, గోనె సంచులు, కాంటాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, హమాలీలు, మిల్లులు, గోదాముల గుర్తింపు తదితర సౌకర్యాలపై సర్వం సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ఆ మేరకు జిల్లా అధికారులు అంచనాల్లో మునిగితేలారు. నల్లగొండ జిల్లాలో ఈ యాసంగిలో 4.47లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 2.38లక్షల ఎకరాల్లో సన్నాలు, 2.08లక్షల ఎకరాల్లో దొడ్డురకాలు సాగైనట్లు అంచనా. 6.48లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం, 5.75లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో సన్నాల మార్కెట్కు ఇబ్బంది లేదు. దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 4.61లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సన్నాలు 3.45లక్షల ఎకరాలు, దొడ్డు రకం 1.16లక్షల ఎకరాల్లో సాగైనట్లు అంచనా. దొడ్డురకం 3.26లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. యాద్రాది జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 3.14లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు. 95శాతం దొడ్డు రకాలే సాగైనట్లు అంచనా. సాధారణంగా దొడ్డురకం 100 కేజీల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కేజీల బియ్యం వస్తుంది. రారైస్గా మిల్లింగ్ చేస్తే 12నుంచి 15 కేజీలు నూకలుగా మారి కేవలం 52కేజీల నుంచి 55 కేజీల వరకే నాణ్యమైన రారైస్ వచ్చే అవకాశం ఉంది. నూకల ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ప్రస్తుతం నూకల ద్వారా వాటిల్లే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధపడింది. రైతులు నష్టపోకుండా మద్దతు ధరకే ధాన్యం కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది.
కొనుగోళ్లపై నేడు మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. నల్లగొండ కలెక్టరేట్లో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మూడు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. చర్చించిన అనంతరం రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. కరోనా తొలి దశ లాక్డౌన్లో ఏ విధంగానైతే ధాన్యం కొనుగోళ్లు జరిపారో అదే తరహాలో ఎలాంటి ఆంటకాల్లేకుండా కొనుగోళ్లు జరుపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. సమావేశం అనంతరం కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో స్పష్టత రానున్నది.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
కనగల్, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మంగళవారం రాత్రి మండలంలోని పగిడిమర్రి, బోయినపల్లి గ్రామాల్లో రైతులు సంబురాలు చేశారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ సర్కార్పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగం మొత్తం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో కనగల్ పీఎసీఎస్ వైస్ చైర్మన్ సింగం మల్లేశ్, సుంకిరెడ్డి కేశవరెడ్డి, సీతా నాగరాజు, సింగం మహేశ్, అయితగోని మల్లేశ్, గడకోటి శంకర్, కందిమళ్ల అంజిరెడ్డి, సింగం లింగయ్య, కేశవరెడ్డి, మల్లయ్య, కుక్కల శేఖర్రెడ్డి పాల్గొన్నారు. బోయిపల్లిలో జరిగిన సంబురాల్లో సర్పంచ్ పగిళ్ల యాదయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రాత్మకం
కేంద్రం కొర్రీలు పెట్టినా తెలంగాణలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. రైతులపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. తెలంగాణలో ధాన్యం కొనకుండా మిగతా రాష్ర్టాల్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనడం సిగ్గుచేటు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు కళ్లు తెరవాలి.
– కస్తూరి నర్సయ్య, రైతు సంఘం నాయకుడు, చిలుకూరు
కేసీఆర్ సార్కు కోటి దండాలు..
యాసంగి పంట చేతికొచ్చింది. పండించిన ధాన్యం కొంటారో లేదోనని తీవ్ర ఆందోళనలో ఉన్నాం. కానీ, తెలంగాణలో పండించిన ప్రతి గింజనూ మేమే కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ హామీ ఇవ్వడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. నాకున్న 3ఎకరాల భూమితో ఇంకో రెండెకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. ధాన్యం కొంటామని తీపి కబురు చెప్పిన కేసీఆర్ సార్కు కోటి దండాలు.
– పడాల సత్తయ్య, రైతు, మంగమ్మగౌడెం, శాలిగౌరారం
రైతుల పాలిట ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్
రైతులకు ఏ ఆపద వచ్చిన నేనున్నానని ఆభయమిచ్చి ఆదుకొనే రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకుండా కొర్రీలు పెడితే రైతులు నష్టపోతారని తెలియ జెప్పడానికి ఢిల్లీలో ధర్నా చేసిండు. అయినా కేంద్రం స్పందించకుంటే రైతుల కష్టం తెలిసిన నాయకుడిగా ప్రతి గింజా కొంటానన్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. రైతులు ఆపదలో పడకుండా ఆదుకుంటున్న కేసీఆర్ పది కాలాలపాటు సీఎంగా కొనసాగాలి.
– దేవిరెడ్డి కోటిరెడ్డి, రైతు, సుబ్బారారెడ్డి గూడెం, మిర్యాలగూడ రూరల్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
యాసంగిలో పంట మార్పిడితో పాటు సన్న రకాలు వేసుకుంటే మంచి మార్కెట్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ బీజేపీ నాయకులు దొడ్డు వడ్లు కూడా మేమే కొంటామని మాయమాటలు చెప్పిండ్రు. ఆ మాటలు నమ్మి 3ఎకరాల్లో సన్నాలు, 5ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశాను. దొడ్డు రకం అమ్ముదామంటే అడ్డికి పావుసేరు లెక్కన అడుగుతున్నారు. మార్కెట్కు పోతే ధర పడక పోవడంతో అమ్మలేక రాశి చేసి చాలా రోజులు కావొస్తుంది. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడి ఢిల్లీలో కేంద్రంపై కొట్లాడం రైతులు చేసుకున్న అదృష్టం. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని తెలంగాణ ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటుందని చెప్పడం సంతోషంగా ఉంది.
– ఏనుగు సైదిరెడ్డి, రైతు, సూర్యాపేట జిల్లా
ఎంతో ఆనందంగా ఉంది..
కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని తేల్చి చెప్పడంతో చాలా బాధపడ్డాం. కానీ, ధాన్యం మొత్తం మేమే కొంటామని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. రైతుల సంక్షేమం కోరే నాయకుడు కావడం, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం గొప్ప విషయం.
– నీలకంఠం అంజయ్య, రైతు, పజ్జూరు